గుంటూరు: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అంతకు ముందు, పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మే 13, 2024న ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగగా.. పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లకు సంబంధించి పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కొందరు తెలుగుదేశం నేతలు ఉన్నారని, ఉద్దేశపూర్వకంగా తనను ఇరికిస్తున్నారంటూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించాడు. మాచర్ల నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్లను తెలుగుదేశం నేతలు కబ్జా చేసి, రిగ్గింగ్ చేశారని, ఆ విషయం తెలిసి పోలింగ్ బూత్కు తాను వెళ్లానని పిన్నెల్లి హైకోర్టుకు తెలిపాడు. జూన్ 4, 2024న ఎన్నికల ఫలితాలు రాగా.. తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాల అనంతరం పలు చోట్ల వైయస్ఆర్సీపీ క్యాడర్పై విచ్చలవిడిగా దాడులు జరిగాయి. పలువురు కార్యకర్తలు రాష్ట్రం విడిచి పారిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి మిన్నకుండిపోయిన పోలీసులు.. టిడిపి నేతల ప్రోత్సాహంతో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకున్నారని వైయస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇవాళ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం రాగానే పోలీసులు రంగంలోకి దిగి పిన్నెల్లిని అరెస్ట్ చేశారు.