విశాఖపట్నం: టీటీడీలో కల్తీ నెయ్యి ఆరోపణల్లో చంద్రబాబే దోషి అని, ఆధారాలన్నీ ఆయనవైపే వేలెత్తి చూపిస్తున్నాయని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అది నిజం కాదని చంద్రబాబు నిరూపించుకోగలరా? అన్న ఆయన, దమ్ముంటే విచారణ కోరగలరా?, కేంద్రం, సుప్రీంకోర్టు, హైకోర్టుకు లేఖ రాయగలరా? అని సవాల్ చేశారు. తిరుమలలో ఆ నెయ్యి సరఫరా జరిగింది, నాణ్యత పరీక్షలో కల్తీ అని తేలింది.. ఈ ప్రభుత్వం వచ్చాకే అని బొత్స గుర్తు చేశారు. విశాఖపట్నంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారంటూ, సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని కోరుతూ, ఇప్పటికే తమ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన విషయాన్ని గుర్తు చేసిన బొత్స, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, తామూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కోరారు. అందుకే వైయస్ జగన్ పర్యటన వాయిదా: వైయస్ జగన్ తిరుపతి పర్యటనపై అనవసర రాద్దాంతం చేసిన ప్రభుత్వం, ఆయన డిక్లరేషన్ ఇవ్వాలంటూ కొత్తగా రాజకీయం మొదలు పెట్టిందని మండలి విపక్షనేత ఆక్షేపించారు. తిరుపతిలో వైయస్ జగన్గారి పర్యటన సందర్భంగా భారీ అల్లర్లకు కుట్ర చేసిన టీడీపీ, బీజేపీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశాయని తెలిపారు. ఒకవైపు తమ పార్టీకి చెందిన రాయలసీమ నాయకులందరికీ నోటీస్లు ఇచ్చి, హౌజ్ అరెస్ట్ చేశారని, మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలను తిరుపతికి తరలించినా, పోలీసులు పట్టించుకోలేదని ప్రస్తావించారు. వీటన్నింటి నేపథ్యంలో, తిరుపతిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసమే, జగన్గారు తన పర్యటన వాయిదా వేసుకున్నారని మండలి విపక్షనేత చెప్పారు. రాష్ట్రమంతా పూజా కార్యక్రమాలు: అతి పవిత్రమైన శ్రీవారి ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలతో, దేవదేవుడికి ఆగ్రహం వచ్చి, దాన్ని రాష్ట్ర ప్రజలపై చూపకుండా, అది చంద్రబాబుకే పరిమితమయ్యేలా.. స్వామివారిని వేడుకుంటూ.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలన్న పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ నిర్దేశం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్: ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం, ఏ సమస్య వచ్చినా దాన్ని గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఆపాదిస్తోందని మండలి విపక్షనేత తెలిపారు. అంతే కాకుండా, ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సీఎం చంద్రబాబుకు అలవాటని గుర్తు చేశారు. తాజాగా 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకు అతి పవిత్రమైన శ్రీవారి లడ్డూపై సీఎం దారుణ ఆరోపణలు చేశారని, అది బెడిసి కొట్టడంతో, జగన్గారు తిరుపతి పర్యటనపై రాద్దాంతం చేశారని ఆక్షేపించారు. వైయస్ జగన్గారు తిరుమల వెళ్లడం, శ్రీవారిని దర్శించుకోవడం ఇది తొలిసారి కాదన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. భక్తుల మనోభావాలకు విఘాతం: శాంతి భద్రతల పరిరక్షణ కోసం తిరుపతి పర్యటన వాయిదా వేసుకుంటున్నట్లు జగన్గారు ప్రకటించగానే, మరోసారి డిఫెన్స్లో పడిన చంద్రబాబు..‘టీటీడీలో కల్తీ నెయ్యి వాడారు. కానీ ఎక్కడ జరిగిందో తెలియదు. ఎలా జరిగిందో నాకు తెలియదు’ అంటూ మాట్లాడడం చూస్తుంటే జాలి కలుగుతోందని బొత్స అన్నారు. తన అబద్ధాన్ని నిజం చేయడానికి, సాక్షాత్తూ శ్రీ వెంకటేశ్వరస్వామినే ఫణంగా పెట్టాలన్న చంద్రబాబు యత్నం, ఏ మాత్రం ధర్మం, న్యాయం కాదన్న బొత్స, అది కోట్లాది భక్తుల మనోభావాన్ని దెబ్బ తీస్తోందని చెప్పారు. కార్మికుల తొలగింపు దారుణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, అందుకే 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రక్రియ మొదలైందని మండలి విపక్షనేత తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించిన ఆయన, దీనికి ఎవరు సమాధానం చెబుతారని నిలదీశారు. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన కోరారు. తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు?: మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు మండుతున్నాయని.. బియ్యం, పుప్పు, నూనెలు, కాయగూరల ధరలన్నీ ఆకాశాన్ని అంటాయని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉల్లి కిలో ధర దాదాపు రూ.70 పలుకుతోందని చెప్పారు. నూనెల ధరలు సలసలా కాగుతున్నాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 100 రోజుల్లోనే ఏకంగా రూ.25 వేల కోట్ల అప్పులు చేశారన్న ఆయన, వాటితో ఏమేం చేశారని ప్రశ్నించారు. ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయడం లేదని, అలాంటప్పుడు ఎందుకంతగా అప్పు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ నిలదీశారు.