అమరావతి: విదేశీ విద్యకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో విదేశీ విద్యపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఇటీవల సెక్రటరీ గంధం చంద్రుడు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. విదేశీ విద్యను చదువుకోవాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో విదేశీ విద్యకు రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చేవారు..వైయస్ జగన్ సీఎం అయ్యాక ఈ మొత్తాన్ని రూ.15 లక్షలకు పెంచారని మంత్రి వెల్లడించారు. గతంలో రూ.25 కోట్లు ఉన్న బడ్జెట్ను మా ప్రభుత్వం రూ.50 కోట్లకు పెంచిందని తెలిపారు. పిలిఫ్పిన్స్, ఉక్రెయిన్ వంటి దేశాల్లో వైద్య విద్యను అభ్యశిస్తున్నారు. ఇక్కడ వారు ఉద్యోగంలో స్థిరపడాలంటే ఇండియన్ మెడికల్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. వారందరికీ ఉన్నతమైన ప్రమాణాలతో విద్యనందించాలనే ఉద్దేశంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. విద్యా కోర్సు పూర్తి అయ్యే వరకు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.