‘బడ్జెట్‌ డొల్ల.. రైతులు గుల్ల’

వ్యవసాయ బడ్జెట్‌పై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి.

వ్యవసాయం రంగాన్ని నిర్వీర్యం చేసే బడ్జెట్‌

ఆశలు పెట్టుకున్న రైతులకు నయ వంచన

అన్నదాత సుఖీభవ పేరుతో మరోసారి దగా ∙

కేంద్రం ఇచ్చేది కాకుండా రూ.20 వేలు ఇస్తామన్నారు

ఇప్పుడు దాంతో కలిపి అంటూ, రైతులకు మోసం

నాడు వైయ‌స్ఆర్‌సీపీ వేరుగా ఇచ్చినా చంద్రబాబు విమర్శ

గుర్తు చేసిన కాకాణి గోవర్థన్‌రెడ్డి

ధరల స్థిరీకరణ నిధికి కేవలం రూ.300 కోట్లు

రైతులు మద్దతు ధర మీద ఆశలు వదిలేయాల్సిందే

ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం. ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు రానట్టే

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన కాకాణి గోవర్థన్‌రెడ్డి

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు కాడి వదిలేసే పరిస్థితి వస్తుందని, చంద్రబాబు విజన్‌కి తగ్గట్టు వ్యవసాయం దండగ అనే రీతిలో ఈ బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నాయని వైయ‌స్ఆర్‌సీపీ  నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆక్షేపించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తన పదవిని కాపాడుకోవడానికి లోకేష్‌ను పొగిడే స్థాయికి దిగజారిపోయారని ఆయన విమర్శించారు. అన్నదాత సుఖీభవకు కేటాయింపులు చూస్తే లబ్ధిదారులను తగ్గించే కుట్ర కనిపిస్తోందని చెప్పారు. పంటలకు మద్ధతు ధరలేక ఒక రైతులు అల్లాడిపోతున్నా వారి గురించి పట్టించుకోకుండా ధరల స్థిరీకరణ నిధికి కేవలం రూ.300 కోట్లు కేటాయించారని దుయ్యబట్టారు. ఇకపై రైతులు మద్ధతు ధర కోరుకోవడం ఎండమావే అవుతుందని, తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు.

కాకాణి గోవర్థన్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:

వంచనకు నిలువుటద్దం ఈ బడ్జెట్‌:
    చంద్రబాబు చెప్పే మాటలకు బడ్జెట్‌ కేటాయింపులకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. బడ్జెట్‌లో ఎక్కడా ప్రజల ఆశలు నెరవేరుతాయనే నమ్మకం కనిపించడం లేదు. గతం మోసం, వర్తమానం మోసం, భవిష్యత్తు నాలుగేళ్లు కూడా మోసమే అన్నట్టుగా ఈ బడ్జెట్‌  ఉంది. మోసానికి వంచనకి నిలువుటద్దంగా ఈ బడ్జెట్‌ నిలిచింది. ఇందులో రైతులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల నమ్మకాన్ని వమ్ము చేశారు. అందరి ఆశలు చిదిమేశారు. మొక్కుబడి కేటాయింపులతో సరిపుచ్చి, ఏ పథకాన్ని ఎంతమందికి అమలు చేయబోతున్నామనే స్పష్టత ఇవ్వలేదు. 
    చంద్రబాబు ఏం చేశాడు? ఏం చేస్తాడో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో చంద్రగుప్త మౌర్యుడి గురించి ప్రస్తావించారు. తన పదవిని కాపాడుకోవడానికి నారా లోకేష్‌ను పొగడ్తలతో ముంచెత్తే దుస్థితికి పయ్యావుల దిగజారిపోయారు. 

అన్నదాత సుఖీభవ పేరుతో దగా:
    విత్తనం నుంచి అమ్మకం వరకు గత వైయ‌స్ఆర్‌సీపీ  పాలనలో రైతులకు అండగా నిలబడితే నేడు కూటమి పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ఆధారపడి 62 శాతం మంది బతుకుతున్నా.. చంద్రబాబు వచ్చాడు, వ్యవసాయాన్ని మళ్లీ దండగ చేస్తున్నాడనే నానుడిని నిజం చేసేలా బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నాయి. అన్నదాత సుఖీభవ కేటాయింపులు చూస్తే ఎంతమంది రైతులను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది.
    పీఎం కిసాన్‌ సాయంతో కలిపి రైతు భరోసా అమలు చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు, తాము అధికారంలోకి వస్తే, కేంద్రం ఇచ్చేది కాకుండా రూ.20 వేల చొప్పున ఇస్తామని ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు కేంద్రం ఇచ్చే సాయాన్ని కలిపి అన్నదాత సుఖీభవలో రూ.20వేల చొప్పున ఇస్తామని ప్రకటించి, రైతులను మోసం చేస్తున్నారు. ఈ పథకానికి రూ.10,706 కోట్లు అవసరం కాగా, కేవలం రూ.6300 కోట్లు కేటాయించి మిగతాది కేంద్రం ఇచ్చే దాంట్లో సర్దుబాటు చేస్తామంటున్నారు. ఇంతకన్నా మోసం ఇంకోటి ఉంటుందా? అంటూ..
(నాడు రైతు భరోసాపై చంద్రబాబు విమర్శల వీడియో చూపారు.)
    నిజానికి ఆనాడు రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 ఇస్తామని ప్రకటించినా, పీఎం కిసాన్‌ రూపంలో  కేంద్రం రూ.6 వేలు సాయం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రం ఇచ్చే సాయాన్ని రూ.13,500లకు పెంచి నాలుగేళ్లు ఇస్తామన్న పథకాన్ని ఐదో ఏడాదికి కూడా పొడిగించి రైతుల పట్ల ఉన్న ప్రేమను జగన్‌ నిరూపించుకున్నారు. 

రైతులకు మద్దతు ధర ఎండమావే:
    ధరల స్థిరీకరణ నిధి కింద కేవలం రూ.300 కోట్లు కేటాయించడం చూస్తే, పంటలకు మద్దతు ధర దక్కడం ఎండమావిగానే కనిపిస్తోంది. ఇప్పటికే మద్ధతు ధర దక్కక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారు. ధరల స్థిరీకరణ నిధి కింద నాడు వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం రూ.3 వేల కోట్లు కేటాయించింది. ఇప్పుడు అందులో పదో వంతు మాత్రమే ప్రతిపాదించారు. దీని వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదు.

ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం:
    ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు పరిచయం చేసి విత్తనం నుంచి అమ్మకం వరకు రైతుకు అండగా నిలిచిన ఆర్బీకేల ఊసే బడ్జెట్‌లో కనిపించలేదు. ఆర్బీకేలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఇదంతా. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ రుణాల పథకాలకు చంద్రబాబు పూర్తిగా మంగళం పాడేశాడు. కేవలం 6,667 బోర్లు వేస్తామని చెప్పడం చూస్తే వైయస్‌ జగన్‌ తీసుకొచ్చిన ఉచిత బోర్ల పథకాన్ని కూడా నిర్వీర్యం చేసేసినట్టే.     రైతాంగాన్ని తీవ్రమైన సంక్షోభంలో నెట్టడంలో భాగంగానే ఉచిత విద్యుత్‌ స్థానంలో సోలార్‌ విద్యుత్‌ ఇస్తామని చెబుతున్నారు. విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వకుండా భవిష్యత్తులో ఉచిత విద్యుత్‌ పథకాన్ని నీరు గార్చడంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు.

బడ్టెట్‌ డొల్ల..రైతులు గుల్ల:
    గత వైయ‌స్ఆర్‌సీపీ  పాలనలో పాడి రైతులకు మేలు చేసిన అమూల్‌ సంస్థ పేరే ఎత్తకపోవడం చూస్తుంటే హెరిటేజ్‌కి లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యం స్ఫష్టంగా కనపడింది. బడ్జెట్‌ డొల్ల.. రైతులు గుల్ల.. అనేలా ఈ వ్యవసాయ బడ్జెట్‌ ఉంది. ప్రచారం మోత, పథకాలకు కోత, ప్రజలకు వాత, ఇది మన తలరాత అని బాధపడాల్సిన బడ్జెట్‌ ఇది. అందుకే ఈ బడ్జెట్‌ను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని కాకాణి గోవర్థన్‌రెడ్డి వివరించారు.
 

Back to Top