ఏం మాయ చేశారో..

 వైయ‌స్ఆర్‌సీపీ ఓటమికి అంతు చిక్కని కారణాలు

జగనన్న వెంటే జనం 

అయినా పరాజయం

జీర్ణించుకోలేకపోతున్న ప్రజానీకం 

మోసం జరిగిందేమోనని అనుమానం

ఈవీఎంలు ట్యాంపర్‌ చేశారేమోనని సందేహం

దేశంలోనే ఇదివరకెన్నడూ చూడని జనరంజక పాలన.. గ్రామ/వార్డు సచివాలయాలతో ప్రజల ముంగిట్లోనే అన్ని ప్రభుత్వ సేవలు.. విద్యార్థులు, మహిళలు, రైతులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, ఇతర అభాగ్యులు.. ఇలా అందరికీ ఏదో ఒక రూపంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వ సాయం.. 

పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ చదువుల్లో విప్లవాత్మక మార్పులు.. నాడు – నేడుతో పాఠశాలల ఆధునీకరణ.. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానళ్లతో విద్యా బోధన.. ఇంగ్లిష్‌ మీడియం చదువులు.. బైలింగ్వల్‌ పాఠ్య పుస్తకాలు, జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన.. ఇలా ఎన్నో రూపాల్లో సహకారం.. 

పీహెచ్‌సీల నుంచి ప్రభుత్వాస్పత్రుల వరకూ ఆధునీకరణ, ఆధునిక పరికరాల ఏర్పాటు, మెరుగైన వైద్య సేవలు, మునుపెన్నడూ ఎవ్వరూ ఎరుగని విధంగా ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైయ‌స్ఆర్‌  కంటి వెలుగు.. ఇంకా వేలాది మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు అడుగడుగునా అండదండలు.. వారి ప్రాణరక్షణకు పటిష్ట చర్యలు..

అందరినీ ఆదుకునే అన్నదాతలకు విత్తు నుంచి విక్రయం వరకూ అడుగడుగునా అండ.. రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సీజన్‌ ముగియకుండానే ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేత.. 

ఇంకా మత్స్యకారులకు వైయ‌స్ఆర్‌ మత్స్యకార భరోసా.. చేనేత కార్మికులకు నేతన్న నేస్తం.. ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర.. ఇంకా ఎవరికైనా అనుకోని కష్టం వస్తే నేనున్నానంటూ భరోసా.. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు, ఉపాధి కల్పన.. ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక ప్రోత్సాహం, ఫిషింగ్‌ హార్బర్లు.. ఇలా గడచిన ఐదేళ్ల పాటు ఎన్నో రూపాల్లో సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించి.. అభివృద్ధికి సరికొత్త అర్థం చెప్పి.. ప్రభుత్వం అంటే ప్రజల కోసమే పని చేసేదని అడుగడుగునా చాటి చెప్పారు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

అందుకే ఐదేళ్ల అనంతరం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని వైయ‌స్ఆర్‌ సీపీ 
కే మెజారిటీ ప్రజలు ఓట్లు వేశారు. కానీ, తాము వేసిన ఓట్లు ఏమయ్యాయనే ప్రశ్న ఇప్పుడు వారిని వేధిస్తోంది. ఆ పార్టీకి అత్యధికంగా ఓట్లు పోలైన చోట్ల కూడా టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థులకు మెజారిటీలు రావడం అనేక మంది ఓటర్లను ఆశ్చర్యపరుస్తోంది. సీఎం జగన్‌ పాలన పట్ల పెద్దగా ప్రజా వ్యతిరేకత లేనేలేదు. 

అలాగని కూటమి నేతల పట్ల సానుభూతీ లేదు. దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్, పోస్ట్‌ పోల్‌ సర్వేలూ వైయ‌స్ఆర్‌ సీపీ విజయం నల్లేరుపై నడకేనని ఢంకా బజాయించి మరీ చెప్పాయి. మరి అటువంటప్పుడు వైఎస్సార్‌ సీపీ ఎందుకు ఓడిపోయింది? ఒకవేళ ఓడినా.. అంత తక్కువ సీట్లు ఎందుకు వచ్చాయి? పైగా కూటమి అభ్యర్థులకు అంతంత భారీ మెజారిటీలు రావడమేమిటి? ఇదే ప్రశ్న ఇప్పుడు పలువురు ఓటర్లు వేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎక్కడైనా ఏదైనా కుట్ర జరిగిందేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఇలాంటి ఫలితాలు ఊహించలేదు 
వైఎస్సార్‌ సీపీకి ఫలితాలు ఇంత దారుణంగా వస్తాయని ఊహించలేదు. ఇది మాకు తట్టుకోలేని విషయం. ఎన్నో రోజులు కష్టపడి ప్రతి ఓటరునూ కలసి, పార్టీకి ఓట్లు వేయించాం. కానీ ఫలితాలు ఇలా రావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. 
– బీఎస్‌ రాజు, నడుపల్లి, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా 

ఇలా ఎందుకు జరిగిందో!
ప్రజా సంక్షేమమే శ్వాసగా జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారు. ఆయనకు ప్రజలందరూ మద్దతు తెలిపినా ఎన్నికల్లో ఫలితాలు వ్యతిరేకంగా రావడం ఏమిటో తెలియడం లేదు. జగన్‌ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని ప్రజలందరూ ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తున్న సమయంలో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. 
– రేకాడి జగన్‌మోహన్, రాజేంద్ర నగర్, 

రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా మా ఓట్లు ఏమైపోయాయో? 
జి.మేడపాడు గ్రామంలో ఎవరిని అడిగినా  వైయ‌స్ఆర్‌ సీపీకే ఓట్లు వేశామని చెబుతున్నారు. నేను, నా కుటుంబం అంతా ఫ్యాను గుర్తుకే ఓట్లు వేశాం. అయితే ఆ ఓట్లు ఏమైపోయాయో అర్థం కావడం లేదు. జి.మేడపాడు గ్రామంలో 102 నుంచి 109 వరకూ పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. 106 మినహా మిగిలిన అన్ని బూత్‌లలోనూ టీడీపీకి ఎక్కువ ఓట్లు పడినట్లు ఫలితాలు రావడం ఆశ్చర్యంగా ఉంది. వైఎస్సార్‌ సీపీ అభిమానుల బూత్‌లలోనూ ఫలితాలు తారుమారయ్యాయి. 
– పుట్టా బుజ్జిబాబు, రైతు, జి.మేడపాడు, సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా  

ఈ ఫలితాలు దారుణం 
సార్వత్రిక ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు చాలా దారుణం. కావాలనే కూటమి నేతలు కుయుక్తులు పన్ని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాకుండా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజానీకం వైఎస్సార్‌ సీపీ వైపే ఉన్నా, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసినా, కూటమి అభ్యర్థులకు పడేలా చేశారు. ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదు. 
– గవరసాని సూరిబాబు, జెడ్పీటీసీ సభ్యుడు,

అర్థం కాలేదు :కాండ్రకోట, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లా
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరాయి. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే కాకుండా, ఇంగ్లిష్‌ మీడియం విద్యను ప్రవేశపెట్టి, మా పిల్లల చదువులను వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మెరుగుపరిచారని తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకువచ్చేవారు. వాటితో పాటు అమ్మ ఒడి, రైతు భరోసా, పింఛన్లు.. ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్‌కే మా ఓటు అని ప్రజలు చెప్పారు. కానీ ఓటు వేసే విషయంలో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో అర్థం కాలేదు. 
– వేగి రామకృష్ణ, కిర్లంపూడి, కాకినాడ జిల్లా 

జనసేనకు ఇంత మెజార్టీయా..! 
నేను, నా కుటుంబం వైయ‌స్ఆర్‌ సీపీకే ఓటు వేశాం. మా గ్రామంలో, మా నియోజకవర్గంలో ప్రజలు అత్యధికంగా వైఎస్సార్‌ సీపీకే ఓటు వేశారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యమనిపించాయి. అందులోనూ మా నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కన్నబాబుపై జనసేన అభ్యర్థికి 72 వేల మెజార్టీ రావడం ఆశ్చర్యం. ఇది నమ్మశక్యంగా లేదు. నాలాగే చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
– కరీం బాషా, వాకలపూడి, కాకినాడ రూరల్‌ 

అయోమయంగా ఉంది 
ఎన్నికల ఫలితాలు అయోమయానికి గురి చేశాయి. అన్ని సామాజిక వర్గాల వారూ వైయ‌స్ఆర్‌ సీపీకే ఓట్లు వేశారు. ఎన్నికల రోజున అడిగితే ఫ్యాన్‌ గుర్తుకే వేశామని ఎక్కువ శాతం మహిళలు, వృద్ధులు తెలిపారు. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే కూటమికి మెజార్టీ చూపించింది. ఫలితాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. 
– చింతా ఈశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ కరప 
మండల అధ్యక్షుడు, పెద కొత్తూరు, కాకినాడ జిల్లా 

ఇది ప్రజలు ఇచ్చిన తీర్పేనా!
ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ప్రజలకు అర్థం కాని స్థితిలో ఉన్నాయి. మేమందరం వైఎస్సార్‌ సీపీకే పట్టం కట్టేందుకు ఓటు వేశాం. వైయ‌స్ఆర్ సీపీయే ఘన విజయం సాధిస్తుందని ఎంతో ఆకాంక్షించాం. ఫలితాలు చూస్తుంటే ఇది నిజమేనా అని అనిపిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పని చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదేనా అనిపిస్తోంది. నమ్మలేకపోతున్నాం. 
– జక్కి శ్రీనివాసరావు, ఉప్పరగూడెం, నాగులపల్లి, కొత్తపల్లి మండలం, కాకినాడ జిల్లా 

నమ్మబుద్ధి కావడం లేదు 
ప్రజలకు మంచి చేసే నాయకుడికి ఇంత దారుణమైన ఓటమా! ఆశ్చర్యంగా ఉంది. సంక్షేమ ఫలాలను దళారీలు లేకుండా నేరుగా లబి్ధదారుకు చేర్చడమే నేరమైందా? ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చిన ఘనతను మూట కట్టుకున్న నాయకుడికిచ్చే ప్రతిఫలమిదా? అన్ని వర్గాలకూ మేలు చేసినా కూడా ఓటమి పాలయ్యారంటేనే ఆశ్చర్యం కలుగుతోంది. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. కానీ ఇంత వ్యత్యాసం అంటేనే నమ్మబుద్ధేయడం లేదు. 
– నల్లమిల్లి నానాజీ, ప్రత్తిపాడు, కాకినాడ జిల్లా

వైయ‌స్ఆర్‌ సీపీ కే ఓటేశాం 
మళ్లీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా అధికారం చేపట్టాలని కోరుకుంటూ మేమందరం వైయ‌స్ఆర్‌ సీపీ కే ఓటు వేశాం. ఎన్నికల ఫలితాలు చూస్తే చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ ఫలితాలు నిజమేనా అని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అభ్యర్థులకు భారీ మెజారీ్టలు రావడంపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. 
– చింతపల్లి గోపాల్‌రెడ్డి, నాగులపల్లి, 

కొత్తపల్లి మండలం, కాకినాడ జిల్లా జీర్ణించుకోలేక‌పోతున్నాం 
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఓటమిని జీరి్ణంచుకోలేకపోతున్నాం. ఎన్నికల్లో విజయం కోసం ఎంతో కష్టపడి పని చేశాం. నాయకులు, కార్యకర్తలందరం కలసికట్టుగా పని చేశాం. ప్రతి ఓటరునూ కలిసి ఓటు అభ్యర్థించాం. ప్రభుత్వం చేసిన మంచిని వివరించి, అండగా నిలవాలని విజ్ఞప్తి చేశాం. మొదటి నుంచీ విజయం సాధిస్తామని ఆశాభావంతో ఉన్నాం. ఎన్నికలు జరిగిన తరువాత ఆ ఆశాభావం మరింత పెరిగింది. కౌంటింగ్‌ రోజు వరకూ గెలుపు అంచున ఉన్నామనే భావించాం. ఏం జరిగిందో తెలియదు కానీ అనూహ్య ఓటమి హృదయాలను రగిలించింది. 
– వెలగా వెంకట కృష్ణాజీ, తుని ఏఎంసీ వైస్‌ చైర్మన్, కోటనందూరు, కాకినాడ జిల్లా

ఈవీఎంలపై అనుమానం 
ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియపై పూర్తి స్థాయిలో అనుమానం ఉంది. మేమంతా ఫ్యాన్‌ గుర్తుపై గంపగుత్తగా ఓట్లు వేశాం. ఈవీంలపై చేపట్టిన కౌంటింగ్‌ విధానంలో ఎక్కడో మోసం జరిగిందని భావిస్తున్నాను. లేకుంటే అంత స్థాయిలో మెజార్టీలు వచ్చాయంటే, తప్పనిసరిగా ఎక్కడో ఏదో మోసం జరిగింది. 
– గిడుతూరి రమణమ్మ, గుమ్మరేగుల, రౌతులపూడి మండలం, కాకినాడ జిల్లా 

Back to Top