ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? 

మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డి

బద్వేల్‌లో విద్యార్థిని కుటుంబ సభ్యుల‌కు కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ప‌రామ‌ర్శ‌

వైయ‌స్ఆర్ జిల్లా : ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అని  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డి ప్రశ్నించారు. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అఘాయిత్యాల కారణంగా ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులు బాధపడుతున్నారని అన్నారు. బద్వేల్‌లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. 

ఈ సందర్బంగా ఎంపీ అనినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటన మాటల్లో చెప్పలేని అమానుషం. ఈ దారుణంపై ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. 2021లో ఇలాంటి ఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశారు. ఈ నాలుగు మాసాల్లో ఇలాంటి 74 ఘటనలు జరిగితే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది?.

ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా?. రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నీ చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేం కదా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఈ విద్యార్థిని 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్.. అలాంటి అమ్మాయి చనిపోవడం బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కోవాలి. దిశా చట్టం, యాప్ అమలు చేసి ఉంటే పది నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేవారు. ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది. సమాజం భయపడేలా కఠిన శిక్ష ఉండాలని ఆ తల్లి కోరుతోంది’ అని చెప్పారు. 

బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ..మన రాష్ట్రంలో మహిళలపై ఇంత దారుణాలు జరుగుతుంటే మహిళా హోం మంత్రి ఏం చేస్తున్నారు?. దీంట్లో రాజకీయాలకు తావు లేదు.. గట్టి చర్యలు తీసుకోవాలి. నా బిడ్డ చనిపోయినట్లు మరొకరు చనిపోరని నమ్మకం ఏంటి అని ఆ తల్లి ప్రశ్నిస్తోంది. ఆమెకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామ‌ని ఎమ్మెల్యే సుధ‌ కామెంట్స్‌ చేశారు.

Back to Top