ఢిల్లీ: చంద్రబాబు.. కలియుగంలో నీ అంత పాపం ఎవరూ చేసి ఉండరని మండిపడ్డారు వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అలాగే, చంద్రబాబు నిజంగా నిఖార్సయిన నాయకుడే అయితే తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో బాబుకు ఎక్స్ వేదికగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘వైజాగ్ ఎంపీ భరత్, మంత్రి నారా లోకేష్.. తోడల్లుళ్లు కుమ్మకై రాజకీయ కక్షతో భీమిలిలో మా ప్రైవేట్ స్థలంలో ఈరోజు మళ్లీ రెండోసారి ప్రహరీ పగలగొట్టడం పిల్లచేష్టలుగా భావిస్తున్నా!. నారా చంద్రబాబు నాయుడు నివసిస్తున్న కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ కొంపను ఆ చట్టం, ఆ నిబంధనల ప్రకారమే కూల్చమని పలుసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. బుద్ధిహీనత వల్ల మీరు అది చెయ్యలేరు. నారా చంద్రబాబు నాయుడు నిఖార్సయిన నాయకుడైతే క్రింది ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి! తిరుమల వెయ్యికాళ్ల మండపం ఎందుకు కూల్చావు. విజయవాడలో 50కు పైగా గుళ్ళు ఎందుకు కూల్చావు. దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు ఎందుకు చేసావు. బూట్లు వేసుకుని ఎందుకు పూజలు చేస్తావు. రాష్ట్రంలో విగ్రహాలు ధ్వసం చేసి మాపై నిందలు ఎందుకు వేశావు. పవిత్రమైన ప్రసాదం లడ్డు మీద ఎందుకు విషప్రచారం చేసావు. నీలాంటి దుర్మార్గుడిని బహిష్కరిస్తే గానీ సమాజం బాగుపడదు. ప్రసాదం స్వీకరించే ప్రతి భక్తుడు నిన్ను చీ కొడుతున్నాడు. ప్రసాదంలో ఏ కల్తీ లేదు, కల్తీ అంతా నీ బుర్ర, మనసు నీ చరిత్ర, నీ మానసిక రుగ్మత. ఆరోపణలే తప్ప నీ జీవితం లో నిరూపణలు వుండవు. బట్ట కాల్చి ముఖానవేసి ప్రత్యర్థిని తుడుచుకో అంటావు. నీ అధికారం నీ డబ్బు సంపాదన కోసమే తప్ప ప్రజలకోసం మాత్రం కాదు. ఆ డబ్బుతో వ్యవస్థలను మానేజ్ చేస్తావు. విలువలకు ఎన్నడో వలువలు ఊడ్చిన నువ్వు ఒక మనిషివేనా! దేవదేవుడు నిన్ను ఎప్పటికి క్షమించడు. కలియుగంలో నీ అంత పాపం ఎవరూ చేసి ఉండరు. నీ ప్రవర్తనతో రావణాసురుడు, కంసుడు, కీచకుడు సిగ్గుపడేలా చేశావు. నీలాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు జాతి దురదృష్టం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.