నెల్లూరు జిల్లా: కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక బూటకమని, ఇదంతా చంద్రబాబు నాటకమే అంటూ వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇసుక ఉచితంగా ఇవ్వాలని డిమాండు చేస్తూ నెల్లూరులో వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడి నుంచి భారీ ప్రదర్శనగా కలెక్టర్ ఆఫీసు వద్దకు వెళ్లి అనంతరం జాయిన్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్రెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డిలు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక అందుబాటులోకి తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రజలకు హామీ ఇచ్చారు. అనుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో అతి తక్కువ ధరకే ఇసుక తీసుకు వెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. టన్ను ఇసుక అతి తక్కువ ధర మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక సొంతంగా తవ్వుకుని వెళితే వాళ్ళ దగ్గర ఎలాంటి రుసుము వసూలు చేయకూడదని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ఇసుక అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ ఇసుక ధరలు పెంచేసింది. ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పడం ఎందుకు, ఆ ఇసుకను ఎక్కువ ధరకు విక్రయించడం ఎందుకు అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇసుక తీసే కాంట్రాక్టర్లు అందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అని, పక్కా ప్లాన్ ప్రకారం ఇది జరిగిందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకున్నదాని ప్రకారమే ఇసుక కాంట్రాక్టులు దక్కించుకున్నారు. అందరూ దసరా పండగ బిజీలో ఉంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇసుక కాంట్రాక్టులు తెలుగుదేశం పార్టీ నాయకులకు అప్పగించింది. వైయస్ జగన్ ప్రభుత్వంలో ఇసుక దోపిడీకి అవకాశం లేకుండా పారదర్శకంగా ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని వారు గుర్తు చేశారు.