మూడు హత్యలు.. ఆరు రేప్‌లు

రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది

ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే స్థితి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ  వరుదు కళ్యాణి ఫైర్‌

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి

రోజుకో దారుణం జరుగుతున్నా స్పందించని ప్రభుత్వం

మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది

వరుదు కల్యాణి ఆక్షేపణ

ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యమై 12 రోజులు

ఇప్పటికీ ఆచూకీ దొరకని చిన్నారి మృతదేహం

ఇది ప్రభుత్వ చేతగానితనాన్ని అద్దం పడుతోంది

సీఎం, డిప్యూటీ సీఎం కనీసం అక్కడికి వెళ్లలేదు

ప్రభుత్వ తీరుపై వరుదు కళ్యాణి ధ్వజం

నాడు దిశ.. మహిళల పాలిట కొండంత అండ

దిశ యాప్‌.. మహిళలు, యువతుల రక్షణ అస్త్రం

ఏకంగా 2800 మందిని కాపాడిన దిశ యాప్‌

ఇప్పుడు దిశను పూర్తిగా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం

మీడియా స‌మావేశంలో వరుదు కళ్యాణి స్పష్టీకరణ

విశాఖపట్నం:రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా క్షీణించిందని, ఆడపిల్లలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. ఇంకా చెప్పాలంటే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత, ఈ 40 రోజుల్లో.. రోజూ మూడు హత్యలు, ఆరు రేప్‌లు అన్నట్లుగా పరిస్థితి మారిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీవరుదు కల్యాణి మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ కానీ స్పందించడం లేదని ఆమె ఆక్షేపించారు.దాడులు, దౌర్జన్యాలు జరిగితే.. అక్కడ బాధితులపైనే కేసులు పెట్టడం, ఎక్కడికక్కడ వైయస్‌ఆర్‌సీపీ లేకుండా చేయాలన్న కుట్ర.. ఆ దిశలో దాడులు, ఆస్తుల విధ్వంసం.. కొన్ని చోట్ల ప్రాణాలు సైతం తీసే పరిస్థితి నెలకొందని  వరుదు కళ్యాణి వెల్లడించారు.

బయటకు రావాలంటే భయం:
    రాష్ట్రంలో వరసగా చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలతో.. ఆడపిల్లలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని శ్రీమతి వరుదు కళ్యాణి స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 12 రోజులు గడిచినా చిన్నారి మృతదేహాన్ని కనిపెట్టలేక పోయారంటే ప్రభుత్వ చేతగానితనం అందరికీ అర్ధం అవుతోందని అన్నారు.

అంత తీరిక లేదా?
    ఆ చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించడానికి ఇప్పటి వరకు సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, చివరకు హోం మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ వెళ్లలేదంటే.. సామాన్య ప్రజల పట్ల ప్రభుత్వ వైఖరి ఎలా ఉందనేది అర్ధం అవుతోందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో బుల్డోజర్‌ సంస్కృతి:
    రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బుల్డోజర్‌ సంస్కృతి వచ్చిందని శ్రీమతి వరుదు కళ్యాణి తెలిపారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసులు, నాయకుల బిల్డింగులను కూల్చడంపైనే కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతోందని ఆమె పేర్కొన్నారు.
    మరి ఆడపిల్లలను ఇంత దారుణంగా హత్యలు, అత్యాచారాలు చేస్తున్న వారి మీద ఈ ప్రభుత్వం, అవే బుల్డోజర్లు ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు మొదలు.. ఈరోజు వరకు రాష్ట్రంలో అరాచకాలు, అన్యాయాలు, విధ్వంసాల పర్వం కొనసాగుతోందని దుయ్యబట్టారు.

ఆడపిల్లల రక్షణ పట్టదా?
    ఆడపిల్లల రక్షణ అనేది మీ కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యత లేని అంశమా? అని శ్రీమతి వరుదు కళ్యాణి నిలదీశారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేష్‌ లాంటి వారు అంబానీ ఇంట పెళ్లికి వెళ్లారని, రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతుంటే వాళ్ల ఇంటికి పరామర్శకు వెళ్లాలని ఎందుకు అనిపించలేదని సూటిగా ప్రశ్నించారు.
    కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని హోం మంత్రి అనిత చెప్పారన్న.. శ్రీమతి వరుదు కళ్యాణి, సాక్షాత్తూ ఆమె నియోజకవర్గంలో జరిగిన ఘటనలను ప్రస్తావించారు.
    హోం మంత్రి నియోజకవర్గంలో ఇద్దరు మహిళల బట్టలు చించిన టీడీపీ నాయకులు వారిని రోడ్డుపై ఈడ్చారని, అదే అనకాపల్లి జిల్లాలోని  రాంబిల్లి మండలంలో దర్శిని అనే అమ్మాయిని గొంతు కోసి చంపేశారని, ఆ చంపిన సురేష్‌ అనే వ్యక్తి పోక్సో కేసు కింద అరెస్టయ్యి విడుదలైతే దర్శిని కుటుంబ సభ్యులు మూడుసార్లు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు చేశారన్నారు. కనీసం అక్కడ పోలీసులు స్పందిచని పరిస్థితి ఉందన్నారు. దాన్ని అలుసుగా తీసుకుని ఆ దుర్మార్గుడు ఇంటికొచ్చి మరీ గొంతు కోసి చంపేశాడంటే రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
    అదే జిల్లాలో సన్మానానికి వెళ్లిన హోంమంత్రి అనిత.. ఈ బాధితురాలి పోస్టుమార్టం పక్కనే జరుగుతుంటే కనీసం కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. 

కక్ష సాధింపులపైనే దృష్టి:
    ఎంతసేపూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులపై కక్ష సాధింపులు, కేసులు పెట్టడంపైనే దష్టి పెట్టారు తప్ప వివక్ష లేకుండా పాలన చేయడంపై దృష్టి పెట్టని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు అని, గంజాయి మీద ఉక్కు పాదం మోపుతామని హోం మంత్రి స్టేట్‌ మెంట్‌ ఇచ్చారన్నారు. ఉత్త స్టేట్‌ మెంట్లు తప్ప ఎక్కడా కార్యాచరణ లేదేమని హోంమంత్రిని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోజూ మూడు హత్యలు, ఆరు రేప్‌లు అన్నట్లుగా గత 40 రోజులుగా పరిస్థితి కొనసాగుతోందన్నారు. 

దిశ యాప్‌తో ఆడబిడ్డలకు రక్షణ కల్పించిన జగనన్న
    ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఆరోజు జగన్‌మోహన్‌రెడ్డి గారు దిశ చట్టం, దిశ యాప్‌ ను తీసుకొచ్చారన్నారు. దిశ యాప్‌ ద్వారా 1.30 కోట్ల మంది డౌన్‌ లోడ్‌ చేసుకున్నారని, కేంద్రం వద్ద పెండింగ్‌ లో ఉన్నా అన్ని అంశాలనూ అమలు చేశామన్నారు. 18 దిశ పోలీస్‌ స్టేషన్లు, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు, పోక్సో కోర్టులు, దిశ కాల్స్‌ కోసం 3 వేల వాహనాల వినియోగం, ఎవరైనా కాల్‌ చేస్తే 10 నుంచి 15 నిమిషాల్లో రక్షించిన పరిస్థితి ఉండేదన్నారు. రాష్ట్రంలో 2,800 మంది మహిళలను, ఆడపిల్లలను దిశ యాప్‌ ద్వారా రక్షించామని, జీరో ఎఫ్‌ఐఆర్‌ కూడా జగన్‌ మోహన్‌ రెడ్డి గారు తీసుకొచ్చారని గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో దిశ ఘటన జరిగితే మన రాష్ట్రంలో అలాంటి ఘటనలు జరగకూడదని జగన్‌ గారు ఈ చట్టం తెచ్చారన్నారు. కూటమి ప్రభుత్వంలో దిశ చట్టం పూర్తిగా నిర్వీర్యం చేసేశారని, ఇలాంటి దుర్మార్గులు పేట్రేగి పోతున్నారన్నారు. 

రాష్ట్రంలో చోటు చేసుకున్న అనేక ఘటనలను ఈ సందర్భంగా శ్రీమతి వరుదు కళ్యాణి వివరించారు.
– జూన్‌ 4న కూటి గెలిస్తే, జూన్‌ 10న అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మోదుకొండమ్మ జాతర సందర్భంగా అక్కడికి తల్లిదండ్రులతో వచ్చిన చిన్నారిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. 
–  జూన్‌ 21న చీరాల మండలం ఈపురుపాలెంలోని సీతారాంపురంలో 21 ఏళ్ల యువతిపై అత్యాచారం, హత్య జరిగిందన్నారు. అదేరోజు ఉదయం ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్‌ వరకు టాయిలెట్‌ కోసం వెళ్లిన యువతి ఎంత సేపటికీ రాకపోవడంతో కుటుంబీకులు వెతికితే రైల్వే ట్రాక్‌పై మృతదేహం కనిపించిందన్నారు. 
– జూన్‌ 27న విజయనగరంలో యువతిని ప్రేమించానంటూ వెంట పడిన ఓ ఉన్మాది. ఆ ప్రేమను అడ్డుకున్నారంటూ యువతి తండ్రిని దారుణంగా నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపారు. 
– అదే జూన్‌ 27న అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం దివిటిపాలెంలో వివాహిత దారుణ హత్య. ఇంట్లో ఉన్న ఆమెను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసం హత్య చేశారు. 
– జూన్‌ 27న విజయవాడలోని ఓ మదర్సాలో 15 ఏళ్ల కరిష్మా అనే విద్యార్థిని అనుమానాస్పద మృతి
– జూన్‌ 30న హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గంలోని కోటవురట్లలో ఇద్దరు మహిళలు లక్ష్మి అనే మహిళ, తన తోటి కోడలుపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేసి బట్టలు చించేస్తే ఎవరు బాధితులో వారిపైనే కేసులు పెట్టారని, అంత దారుణంగా కూటమి పరిపాలన, శాంతిభద్రతలు ఉన్నాయన్నారు. 
– హోం మంత్రి పక్క నియోజకవర్గం రాంబిల్లిలో దర్శిని అనే అమ్మాయిని చంపేస్తే, హత్య చేసిన సురేష్‌ అనే వ్యక్తిని వెతకడానికి 12 బృందాలను పెట్టామన్నారని, ఇంటి వెనకే 200 మీటర్ల దూరంలో సురేష్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని పడి ఉన్నాడన్నారు.
అది కూడాపోలీసులు కనిపెట్టలేదని, ఆ ఊరి ప్రజలు చెబితే బాడీ దొరికిందన్నారు. కనీసం దర్శిని కుటుంబానికి ఆర్థిక సాయం, పరామర్శ కూడా చేయలేదన్నారు. 
– జూన్‌ 30న విశాఖ నగరంలోని మధురవాడ, అల్లయ్యపాలెంలో 5 ఏళ్ల చిన్నారిపై 19 ఏళ్ల యువకుడి లైంగిక దాడి. 
– జూన్‌ 6న అనకాపల్లి రాంబిల్లి మండలంలో దర్శిని అనే అమ్మాయిని గొంతు కోసి చంపారు.
– జూన్‌ 7న నంద్యాల జిల్లా ముచ్చు మర్రిలో మైనర్‌ బాలికను హత్య చేసి నదిలో పడేసి 12 రోజులు గడిచినా ఈరోజుకూ నిందితులను పట్టుకోలేదు. 
– జూన్‌ 12న గుంటూరు జిల్లాలో ఒకే రోజు రెండు సంఘటనలు. ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడులో 13 ఏళ్ల దళిత బాలికపై ఆటో డ్రైవర్‌ లైంగిక దాడి. అలాగే ఫిరంగిపురం మండలంలో యువకుడి వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య. 
– జూలై 15న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో 12 ఏళ్ల దళిత బాలిక అనుమానాస్పద మృతి. 
–  ఆదోనిలో దళిత మహిళను పచ్చపార్టీ ఉన్మాదులు ట్రాక్టర్‌ తో గుద్ది చంపేశారు. 
–  శ్రీకాకుళం జిల్లా బొడ్డుపల్లిలో రాజేశ్వరి అనే మహిళను ఆటో డ్రైవర్‌ హత్య చేశాడు. 
– విజయనగరం జిల్లా రామభద్రాపురంలో కేవలం 5 నెలల చిన్నారినిఓ వ్యక్తి అత్యాచారం చేశాడంటే  లోకం ఎటువైపు వెళ్తోంది? పోలీసు వ్యవస్థ ఏం పని చేస్తోంది? రాష్ట్రంలో శాంతిభద్రతలు పని చేస్తున్నాయా? అనే అనుమానం కలుగుతోందన్నారు. 
– నిన్ననే విశాఖపట్నం ఉడా కాలనీ సమీపంలో శ్యామల అనే యువతిపై కత్తితో దాడి చేయడానికి దుర్మార్గుడు ప్రయత్నించాడు. తల్లి అడ్డు వస్తే ఆమెపై దాడి చేశాడు. 

ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనకపోతే..:
    ఇలా రోజుకు ఎన్ని వింటాం.. ఎంత దారుణంగా ఉన్నాయి ఘటనలు.. వీటికి అంతం లేదా? ప్రభుత్వం చర్యలు తీసుకోదా? అని శ్రీమతి వరుదు కళ్యాణి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు రిలీజ్‌ చేస్తున్నారని, మరి మహిళలు, ఆడ పిల్లల మీద ఈ హత్యలు, అత్యాచారాలపై ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఆడపిల్లల రక్షణ అనేది మీకు ప్రాధాన్య అంశం కాదా? కఠిన మైన చట్టాలు తీసుకురారా? అని ప్రశ్నించారు.
    ఎంతసేపూ లోకేష్‌ రెడ్‌ బుక్‌ అమలు చేయడంపై ఉన్న ధ్యాస మహిళల రక్షణపై పెట్టి ఉంటే బాగుండేదన్నారు. ముచ్చుమర్రి ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ప్రభుత్వంలో మాత్రం చలనం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలన్నారు. కనీసం బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం, పరామర్శ ఇవ్వాలన్నారు. హోంమంత్రి స్పందించి బాధితులకు బాసటగా నిలవాలన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని, దర్యాప్తు సక్రమంగా జరగాలన్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం స్పందించకపోతే, ప్రజా పోరాటాలకు సిద్ధం అవుతామని వరుదు కళ్యాణి ప్రకటించారు.

Back to Top