నాలుగేళ్ల పాలన.. 51% జనాదరణ ఒక్క వైయ‌స్ఆర్ సీపీకే సాధ్యం

టైమ్స్‌ నౌ నవభారత్ స‌ర్వేతో సుస్ప‌ష్టం

జనసంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం

వైయ‌స్ఆర్ సీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి: ఏ రాష్ట్రంలోనైనా 4 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా అక్కడి పాలకపక్షానికి 51 శాతం ప్రజాదరణ సాధ్యమేనా..? అనే ప్రశ్నకు జనరంజకంగా ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి ఇది సంభవమేనని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నిరూపిస్తోంద‌ని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్య‌ద‌ర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని మతాలు, కులాల ప్రజల మద్దతుతో జనసంక్షేమమే ఏకైక లక్ష్యంగా 2019 నుంచీ ముందుకుసాగుతున్న వైయ‌స్ఆర్ సీపీకి 51 శాతం ప్రజల మద్దతు లభిస్తుందని తాజా సర్వేలో తేలింద‌న్నారు. ప్రసిద్ధ మీడియా సంస్థ టైమ్స్‌ నౌ నవభారత్‌ ఈటీజీతో కలిసి ఈ జనాభిప్రాయసేకరణ జరిపింద‌ని చెప్పారు. ఈ మేర‌కు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి త‌న ఫేస్‌బుక్ ఖాతాల్లో ఓ స్టోరీని పోస్టు చేశారు.

``లోక్‌ సభ ఎన్నికలకు ఏడాది ముందు దేశవ్యాప్తంగా జరిపిన ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్‌ వరకూ చూస్తే.. పాలకపక్షమైన వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలోని మొత్తం 25 సీట్లలో 24-25 వరకూ రావొచ్చని స్పష్టమైంది. అంతేగాక, పోలయ్యే మొత్తం ఓట్లలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైయ‌స్ఆర్ సీపీకి 51 శాతం ఓట్లు వస్తాయని కూడా ఈ సర్వే సూచిస్తోంది. 

ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి కేవలం 36 శాతం ఓట్లే వస్తాయని ఈ సర్వే వివరించింది. నాలుగేళ్ల క్రితం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ సీపీకి 49.95% ఓట్లు లభించాయి. టీడీపీకి 39.17% ఓట్లు దక్కాయి. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌ లో ఏ ఎన్నికల్లో కూడా పాలకపక్షానికి దాదాపు 50% ఓట్లు రాలేదు. అలాంటిది వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ 49.95 శాతం ఓట్లు కైవసం చేసుకోవడం ఓ రికార్డు అయితే, పై సర్వే ప్రకారం ఇప్పుడు ఏపీ పాలకపక్షానికి 51 శాతం ఓటర్ల ఆమోదం లభించడం మరో ఘనవిజయం. 

సాధారణంగా ఎంతటి గొప్ప రాజకీయ పార్టీ అయినా నాలుగేళ్లు అధికారంలో ఉన్న తర్వాత జనాదరణను స్వల్ప స్థాయిలోనైనా కోల్పోతుంది. కానీ, ఇలాంటి సిద్ధాంతాలు, ఆనవాయితీలు వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వర్తించవని తెలుగునాట రుజువైంది. అలాగే, అతి తక్కువ సీట్లతో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన పూర్వపు పాలకపక్షం టీడీపీ రోజురోజుకూ జనం మద్దతు పోగొట్టుకోవడం పాలకపక్షం పనితీరుకు, సామర్థ్యానికి తార్కాణం.

ప్రాంతీయ పక్షాలకు పార్లమెంటు కన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు!
టౌమ్స్‌ నౌ–నవభారత్‌ ఈటీజీలు కేవలం 2024 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ సర్వే నిర్వహించాయి. ఈ లెక్కన మరో తొమ్మిది నెలల్లో లోక్‌ సభతోపాటు ఏపీ శాసనసభకు జరిగే ఎన్నికల్లో వైయ‌స్ఆర్ సీపీకి ఓట్ల శాతం ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువ. దేశంలో ప్రాంతీయపక్షాలకు లోక్‌ సభ ఎన్నికల్లో కంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు సాధించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఈ సూత్రానికి భిన్నంగా పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఏపీ పాలక పార్టీ 50 శాతానికి మించి ఓట్లు సాధించబోతోందని ఈ సర్వే సూచిస్తోంది. 

వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ ఏడాది పాలన పూర్తి చేసుకున్నప్పటి నుంచి ప్రతి ఏటా ఏదో ఒక ప్రముఖ మీడియా సంస్థ జరిపించిన ప్రతి సర్వేలోనూ ఈ పార్టీకి మంచి జనాదరణ ఉందనే సర్వేల ఫలితాలు తెలిపాయి. ఇలా వరుసగా ప్రతి సర్వేలోనూ మెజారిటీ ప్రజల ఆదరణ పొందిన ఏకైక రాజకీయపక్షం కూడా వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయే. ఎప్పటి మాదిరిగానే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వానికి, పాలకపక్షానికి మద్దతు ఇవ్వడంలో మహిళలు ముందున్నారని కూడా అనేక ఓపీనియన్‌ పోల్స్, సర్వేలు తేల్చిచెబుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌ లో అమలవుతున్న వివిధ పథకాలు మ‌హిళ‌ల‌కు గరిష్ఠ స్థాయిలో ప్రయోజనాలు అందించడమేగాక, మహిళా సాధికారితకు దోహదం చేయడం దీనికి కారణం. కొద్దిమంది పురుష ఓటర్లకయినా ఎప్పుడైనా తమ సామాజికవర్గం ఏమిటనే స్పృహ ఉండవచ్చేమో గానీ, పాలకపక్షం సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా ఆంధ్రా మహిళలు కులాలు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎక్కువగా అభిమానిస్తున్నారని కూడా వరుసగా అనేక సర్వేలు చెబుతున్నాయి.

Back to Top