అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ప్రాణాలకు హాని ఉందని చెప్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వైయస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాపు మహేష్రెడ్డి, కావటి మనోహర్ నాయుడు పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఘటనలను పరిగణలోకి తీసుకుని వెంటనే కేసులు నమోదు చేసి, కారకులను వెంటనే అరెస్టుచేయాలని, దీనికోసం తగిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు డీజీపీని కోరారు. మేరకు డీజీపీకి వారు బహిరంగ లేఖ రాశారు. నిర్లిప్తంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైనా శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు డిమాండు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 రోజులు కావొస్తోంది. ఈ 15 రోజుల్లో రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన అమానుషంగా దాడులు చేస్తున్నారు. వారి ఆస్తులకు తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు. ఈ కేసులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పోలీసులు తగిన రీతిలో చర్యలు తీసుకోవడంలేదు. మా ప్రాణాలకు హాని ఉందని చెప్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఘటనలను పరిగణలోకి తీసుకుని వెంటనే కేసులు నమోదు చేసి, కారకులను వెంటనే అరెస్టుచేయాలని, దీనికోసం తగిన చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లోకి టీడీపీ, జనసేన మంత్రులు, నాయకులు, కార్యకర్తలు అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇవ్వాళ్టికి రాష్ట్రంలోని 14 చోట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లోకి చొరబడ్డారు. మా పార్టీ ఆస్తుల్లోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యాలకు పాల్పడి చట్టాన్ని ఉల్లంఘించారు. ఉద్రిక్తతులు రెచ్చగొట్టి, ఘర్షణలు రేపేందుకు ప్రయత్నించారు. టీడీపీ, జనసేన నాయకులు అక్రమంగా ప్రవేశించినా, బెదిరింపులకు దిగినా పోలీసులు ఎక్కడా వారిని నియంత్రించలేదు, సరికదా వారి అక్రమాలకు దన్నుగా నిలబడ్డారు. శాంతిభద్రతలను కాపాడి, రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఈ ఘటనల్లో నిర్వీర్యంగా వ్యవహరించారు. దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకార్యాలయాలకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులకు తావివ్వడంద్వారా శాంతిభద్రతలను ప్రమాదంలో పడేశారని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు రక్షణలేకుండాపోయిందని తెలియజేసుకుంటున్నాం. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. నిర్లిప్తంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైనా శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. (లేళ్ళ అప్పిరెడ్డి) శాసనమండలి సభ్యులు (అంబటి రాంబాబు) మాజీ మంత్రివర్యులు (గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి) మాజీ శాసనసభ్యులు (కావటి మనోహర్ నాయుడు) మేయర్, గుంటూరు