టీడీపీ అరాచ‌కాల‌పై గవర్నర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. వైయ‌స్ఆర్‌సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ నేతల అక్రమ చొరబాట్లపై పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో వైయ‌స్ఆర్‌సీపీ బృందం గవర్నర్‌ను కలిసింది.

  ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం: వైవీ సుబ్బారెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 రోజులుగా తెలుగుదేశం, జనసేన పార్టీల వాళ్లు వాళ్ల నాయకుల ఆధ్వర్యంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను అటాక్‌ చేయడం, దారుణంగా అవమానించడం, ఇళ్ల మీద దాడులు చేయడం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ప్రాపర్టీలను కూడా వాటిపై వైయస్సార్‌ గారి పేరు ఉందని, పార్టీకి సంబంధించిన శిలా ఫలకాలు ఉన్నాయనే కారణంతో వాటిని ధ్వంసం చేస్తున్నారన్నారు. అప్పటికీ పోలీసులు స్పందించకపోవడంతో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లి, రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశామన్నారు. అయినప్పటికీ నేటికీ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అదే విధంగా ఉందన్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు యథావిధిగా జరుగుతున్నాయన్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేసిన దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్‌ వైయస్సార్‌ గారి విగ్రహాలను కూడా తగలబెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇంత విధ్వంసకర కార్యక్రమాలు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప కనీసం కేసులు కూడా బుక్‌ చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో గవర్నర్‌ గారు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరామన్నారు. 

మా పార్టీ ఆఫీసుల్లోకి ప్రవేశించి బెదిరింపులు
ఒక వారం రోజులుగా మరో అడుగు ముందుకేసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసుల్లోకి అక్రమంగా ప్రవేశించి, అక్కడున్న నాయకులు, కార్యకర్తలను బెదిరించి మీ కార్యాలయాలను ధ్వంసం చేస్తామంటూ బెదిరిస్తున్నారన్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అన్ని జిల్లాల్లో ఉండే టీడీపీ నాయకులు, శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఇలా జరుగుతోందన్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భవనాలను నిబంధనల ప్రకారం ప్రభుత్వం స్థలాలు కేటాయించిన తర్వాత భవనాలు నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ల పార్టీ భవనాలకు, బీజేపీ పార్టీ ఆఫీసులకు, కమ్యూనిస్టు పార్టీల ఆఫీసులకు ఏ విధంగా స్థలాలు మంజూరు చేశారో అదే విధంగా నిబంధనల ప్రకారమే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసులకు స్థలాలు తీసుకున్నామన్నారు. అన్ని అనుమతులు తీసుకున్నాక బిల్డింగులు కడుతున్నామన్నారు. నిర్మాణం పూర్తయ్యే వాటి వద్దకు వెళ్లి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు అక్కడున్నమా కార్యకర్తలను, సిబ్బందిని బెదిరించి భవనాలను కూలగొడతామంటున్నారని, వీటన్నింటినీ అడ్డుకోవాలని గవర్నర్‌ గారిని కోరామన్నారు. ఏ విధంగా ఇవన్నీ జరుగుతున్నాయో ఫొటోల ద్వారా చూపించామన్నారు. కొన్ని ఫొటోలను చూసి గవర్నర్‌ గారు ఇంత దారుణంగా పరిస్థితి ఉందా అని చాలా ఆశ్చర్యపోయారన్నారు. 

హింసాత్మక ధోరణి కొనసాగరాదు: ఆళ్ల అయోధ్యరామిరెడ్డి
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వాళ్లు విజయాన్ని ఆస్వాదిస్తూ ఒక పద్ధతిలో ఓడిన వారికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేలా ఉండాలని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. ప్రతిపక్షంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని గవర్నర్‌ గారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. వైయస్సార్‌ సీపీ సానుభూతిపరులపై దాడులు చేస్తున్నారని, వీటిని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో గవర్నర్‌ గారి దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తున్న ఈ హింసాత్మక ధోరణి కొనసాగరాదని, ఇలాంటి దుశ్చర్యలను ఏ పార్టీ అయినా ఖండించాలన్నారు. 

పార్టీ ఆఫీసుల నిర్మాణంపై దుష్ప్రచారం వద్దు
ఏ పార్టీ అయినా పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి 2014–19లో ఏరకమైన జీవో చంద్రబాబు తెచ్చారో అదేవిధంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ కూడా కేటాయించిందని అయోధ్యరామిరెడ్డి అన్నారు. నిబంధనల ప్రకారమే పార్టీ ఆఫీసుల నిర్మాణం జరుగుతోందని, ఇవి అక్రమ నిర్మాణాలు కాదని స్పష్టం చేశారు. కానీ ఎవరంటే వారు వెళ్లిపోయి పార్టీ ఆఫీసులను స్వాధీనం చేసుకుంటామని, వేలకోట్ల ప్రజాధనం వృధా అయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఒక్కో ఆఫీసు 10 వేల చదరపు అడుగులు ఉంటుందని, ఈరోజు నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.2000 నుంచి రూ.2500 వరకు ఉందన్నారు. అంటే రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఒక్కో ఆఫీసు నిర్మాణ ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటి వరకు 18 ఆఫీసులు నిర్మాణం అయ్యాయని, దాదాపు రూ.60 కోట్ల వరకు ఖర్చు పెట్టామన్నారు. కానీ రూ.500 కోట్ల నుంచి రూ.5000 కోట్ల దాకా ప్రజాధనం దుర్వినియోగమైనట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆపించాలని, మేం కట్టుకుంటున్న పార్టీ ఆఫీసులపై దాడులు జరగకుండా వ్యవస్థను అదుపులో ఉంచాలని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు. దాడులను ఆపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు. 

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నారాయణ మూర్తి, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.

 

Back to Top