కాంగ్రెస్ పార్టీ చిత్త‌శుద్ధి మ‌రోసారి స్ప‌ష్టం

మాజీ మంత్రి మెరుగు నాగార్జున ట్వీట్  

గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌.రాజశేఖరరెడ్డి 75వ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన సభలో వారి మాటలు చూసిన తర్వాత దివంగత నేతపట్ల వారికెలాంటి చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టంగా బయటపడింద‌ని మాజీ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోనిర్వ‌హించిన‌ వైయ‌స్ఆర్ 75వ జ‌యంతి వేడుక‌ల్లో ఆ పార్టీ నేత‌ల తీరును మాజీ మంత్రి ఎండ‌గ‌ట్టారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైయస్ఆర్‌ అనే పేరు లేకుండా చేయడానికి ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడ వైయస్ఆర్‌ విగ్రహాలు కనిపించినా వాటిని ధ్వంసం చేస్తున్నారు, అత్యంత అమానుషంగా నిప్పుపెడుతున్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఆ మహానేత జ్ఞాపకార్థం వివిధ సంస్థలకు పెట్టిన పేర్లను తొలగిస్తున్నారు.  ఆరోగ్యశ్రీ, ఫీజురియింబర్స్‌మెంట్‌ లాంటి పథకాలకు సృష్టికర్త అయిన వైయస్ఆర్‌ పేరును తొలగించడమో, వైయస్ఆర్‌ పేరుతో నడుస్తున్న పథకాలను ఎత్తివేయడమో చేస్తున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా, ఇవ్వాళ్టి కాంగ్రెస్‌ సభలో వాటిన ప్రశ్నించకపోవడం, ఖండించకపోవడం వైయస్ఆర్ పట్ల వారికి చిత్తశుద్ధిలేదని మరోసారి స్పష్టం అయ్యింది. వైయస్ఆర్ గారిని రాజకీయంగా వాడుకుని లబ్ధిపొందాలన్న ఆరాటమే కనిపించింది. కాంగ్రెస్‌ పేరుమీద టీడీపీతో నడుపుతున్న కుమ్మక్కు రాజకీయం ప్రస్ఫుటంగా బయటపడిందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ట్వీట్ చేశారు.

Back to Top