వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల్లో నూత‌నోత్సాహం

ఢిల్లీలో వైయ‌స్ఆర్‌సీపీ ధర్నా సూపర్‌ సక్సెస్‌ 

గ‌న్న‌వ‌రంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం

 ఎన్టీఆర్ జిల్లా:  ఢిల్లీ నుంచి ఏపీకి వ‌చ్చిన‌ వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గ‌న్న‌వరం ఎయిర్‌పోర్టులో పార్టీ నేత‌లు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ కూటమి అరాచక పాలనపై చేపట్టిన ధర్నా సూపర్‌ సక్సెస్‌ కావడంతో  పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. రాష్ట్రానికి తిరిగి వ‌చ్చిన‌ వైయ‌స్ జగన్‌ను అభిమానులు చుట్టుముట్టగా.. ఓపికగా ఆయన సెల్ఫీలు దిగారు.
 
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరినప్పటి నుంచి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. హత్యలు, హత్యాచారాలు, దాడులు, వేధింపులు, విధ్వంస ఘటనలు పెరిగిపోయాయి. ప్రత్యేకించి వైయ‌స్ఆర్‌సీపీని లక్ష్యంగా చేసుకుని హింసాపర్వం కొనసాగింది. ఈ నరమేధాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. అదే సమయంలో.. వినుకొండ హత్యాఘటన, వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ..మాజీ ఎంపీలపై దాడి ఘటన రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆపై కూటమి పాలన అరాచకాలపై గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో.. 


ఈ పరిస్థితుల్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలని వైయ‌స్‌ జగన్‌ భావించారు. దేశ రాజధానిలోవైయ‌స్ఆర్‌సీపీ ధర్నాచేపట్టగా.. పలు జాతీయ పార్టీల సంఘీభావంతో అది విజయవంతం అయ్యింది. సమాజ్‌వాదీ పార్టీ, శివసేన ఉద్దవ్‌ థాక్రే వర్గం, ఆప్‌, అన్నాడీఎంకే.. తదితర పార్టీలు వైయ‌స్ఆర్‌సీపీ ధర్నాకు సంఘీభావం తెలిపాయి. ఆ సమయంలో చంద్రబాబు  బాధ్యతలు స్వీకరించిన తర్వాత  ఏపీలో జరుగుతున్న రాజకీయ హత్యలను వైయ‌స్‌ జగన్‌ దేశ రాజధానిలో ఎండగట్టారు. వీడియో, ఫోటో సాక్ష్యాలతో జాతీయ నాయకులకు ఏపీలోని అరాచక పరిస్థితులను వివరించారాయన. 

 
చంద్రబాబు గత నెలన్నర పాలనలో జరిగిన నేరాలను ఘోరాలను తెలుసుకుని  ఆ నేతలు నివ్వెరపోయారు. ‘‘ఏపీలో రాజ్యాంగబద్ధ పాలన జరుగుతోందా?’’ అని ప్రశ్నించిన ఆయా పార్టీల నేతలు.. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని.. జగన్‌ను మళ్లీ ఆశీర్వదించే అధికారం కట్టబెట్టే అవకాశం ఉందని అన్నారు. అలాగే.. శాంతిభద్రతలు నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ప్రభుత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో వైయ‌స్ జగన్ వెంటే ఉంటామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాయని ఆ పార్టీల నేతలు హామీ ఇచ్చారు. 

మరోవైపు.. నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని, కక్షపూరిత రాజకీయాల్ని జాతీయ మీడియా ముందు ప్రస్తావించిన వైయ‌స్‌ జగన్‌, ప్రజాస్యామ్య పరిరక్షణకు అంతా తమకు మద్దతు ప్రకటించాలని జాతీయ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి, ప్రధాని సహా కేంద్ర మంత్రులకూ ఏపీలో పరిస్థితులను వివరిస్తామని, రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేస్తామని వైయ‌స్ జగన్‌ చెబుతున్నారు. అపాయింట్‌మెంట్‌ దొరకగానే త్వరలో వైయ‌స్ జగన్‌ మరోసారి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.

Back to Top