వైయ‌స్ఆర్‌సీపీ కేడరే కూటమి టార్గెట్‌

తప్పుడు కేసులు, దొంగ సాక్ష్యాలతో అరెస్టులు 

అరెస్టయిన వారు సీసీ టీవీ ఫుటేజిల్లో కూడా లేరు 

ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది  

రైతులు, ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం  

మాజీ ఎంపీ సురేష్ ను ములాఖత్‌లో కలిసిన మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు

 గుంటూరు: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు అంటూ గుంటూరు, కృష్ణా జిల్లాలోని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను కూటమి ప్రభు­త్వం టార్గెట్‌ చేస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో అక్రమంగా అరెస్టయి, గుంటూరుజిల్లా కారా­గారంలో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్‌ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని పేర్ని నాని, ఎమ్మెల్సీ బొమ్మి ఇశ్రాయేల్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, గుంటూరు ప్రత్తిపాడు ఇన్‌చార్జి బలసాని కిరణ్‌కుమార్, నందిగం సురేష్‌ కుటుంబ సభ్యులు శుక్రవారం ములాఖత్‌లో విడివిడిగా కలిశారు. 

అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని ఆరో­పిం­చారు. వైయ‌స్ఆర్‌సీపీలో క్రియాశీలకంగా ఉన్న నా­య­కులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి జైళ్లకి పంపిస్తున్నారని, టీడీపీ కార్యకర్తలతో దొంగ సాక్ష్యాలు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయం బాత్రూంలు, పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, సీసీటీవీల ఫుటేజీ పోలీసుల వద్ద ఉందని టీడీపీ నాయకులు చెబుతున్నారని,  ఆ పుటేజీల్లో ఎక్కడా లేని మాజీ ఎంపీ నందిగం సురేష్‌, శ్రీనివాసరెడ్డిని ఎలా అరెస్ట్‌ చేస్తారని నిలదీశారు. 

ఈ కేసులో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్రియాశీలకంగా ఉన్న 171 మందిని తీసుకువచ్చారని, వారెవరూ సీసీ టీవీ ఫుటేజీల్లో లేరని తెలిపారు. తప్పుడు కేసులతో వైయ‌స్ఆర్‌సీపీ నాయ­కులు, కార్యకర్తలను కుంగదీయాలనే కూటమి పెద్దలు ఇలా చేస్తున్నారని, వారి ఆశలు నెరవేరవని స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ జైళ్లలో వేసినా తమ పార్టీకి ఏమీ కాదని, వారంతా తమ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. ఓవైపు వరదలతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నా, అనేక మంది మృత్యు­వాత పడుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడంలేదని అన్నారు. 

కేవలం వైయ‌స్ఆర్‌సీపీ వారిపై కక్ష సాధించాలన్న తపనే ప్రభుత్వంలో కనపడుతోందన్నారు. ప్రభుత్వ పెద్దల తప్పుడు చర్యలే వరదలకు, భారీ నష్టానికి కారణమన్నారు. వరద బాధితులను కాపాడేందుకు, వారికి ఆహారాన్ని అందించేందుకు పోలీసులను పంపడంలేదని, వైయ‌స్ఆర్‌సీపీ మాజీ మంత్రి జోగి రమేష్‌ను పట్టుకునేందుకు ఓ వంద మంది, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆచూకీ కోసం మరో 200 మంది పోలీసులను పంపించడం కూటమి ప్రభుత్వ నీచత్వానికి పరాకాష్ట అని అన్నారు. 

Back to Top