తాడేపల్లి: బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా.. రాష్ట్రాన్ని అడవి పందుల్లా దోచుకు తిన్నారని, రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారని పచ్చి అసత్యాలతో నిందించడం మీ స్థాయికి భావ్యమా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రశ్నించారు. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని దయచేసి వెంటనే ఆపాలని ఆయన హితవు పలికారు. ఇవాళ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటనలో రాష్ట్ర అప్పులపై గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబునాయుడు చేసిన దుష్ప్రచారంపై ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. రాష్ట్ర అప్పులపై సీఎం చంద్రబాబునాయుడు మరోసారి అసత్య ప్రచారం ప్రజలకు నిజం తెలియాలంటే మీరు బడ్జెట్ పుస్తకంలో వాల్యూమ్–6 (బడ్జెట్ ఇన్ బ్రీఫ్)లో అప్పుల వివరాలు ప్రతి సంవత్సరం మాదిరిగా తెలపాలని బుగ్గన డిమాండ్ చేశారు. బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఏమన్నారంటే.. రాష్ట్ర అప్పులపై నాటి నుంచి టీడీపీ కూటమి అదేపనిగా వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోంది. ఇష్టానుసారం మాట్లాడుతూ, వైయస్సార్సీపీ హయాంలో రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరాయంటూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. మళ్లీ ఈరోజు కూడా చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు గారు, గత పాలకులు రాష్ట్రాన్ని అడవి పందుల్లా దోచుకు తిన్నారని, రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారని నిందిస్తూ, వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కానీ, నిజానికి ఏనాడూ రాష్ట్ర అప్పులు ఆ స్థాయిలో లేవు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, 2024 నవంబరులో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో రాష్ట్ర అప్పులను రూ.6.46 లక్షల కోట్లుగా చూపారు. అందులో 2019లో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికే ఉన్న రాష్ట్ర అప్పు రూ.3.10 లక్షల కోట్లు. అదే 2024లో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.6.46 లక్షల కోట్లు. అందులో మీరు 2019లో దిగిపోయే నాటికి రూ.3.10 లక్షల కోట్ల అప్పులు కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు మీ తొలి బడ్జెట్లో చూపినవే. ఎవరి హయాంలో అప్పులు పెరిగాయి? అనేది ఆధారాలతో సహా చాలాసార్లు మాట్లాడాం. స్పష్టంగా చూపాం. 2014–19 మధ్య చంద్రబాబు గారి పాలనలో అప్పుల పెరుగుదల సీఏజీఆర్ 19.54 శాతం కాగా, 2019–24 మధ్య వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పుల పెరుగుదల సీఏజీఆర్ 15.61 శాతం మాత్రమే. అంటే మీ హయాంలోనే రాష్ట్ర అప్పులు దారుణంగా పెరిగాయి. మా ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయి, ఖర్చులు పెరిగినా కూడా, అప్పుల పెరుగుదల తక్కువే. అవన్నీ గణాంకాలతో సహా చెప్పాం. కానీ, మీరు ఏనాడూ దానికి సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే, అవన్నీ వాస్తవాలు కాబట్టి. మరి అలాంటప్పుడు మళ్లీ ఈరోజు గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని అంత అన్యాయంగా ఎలా మాట్లాడారు?. ఇక ఈ ఏడాది బడ్జెట్లో మీరు అప్పులు చూపలేదు. బడ్జెట్లో వాల్యూమ్–6 (బడ్జెట్ ఇన్ బ్రీఫ్)లో రాష్ట్ర రుణాలపై అన్ని వివరాలు చూపడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ, సంప్రదాయం. కానీ, మీరు ఆ సంప్రదాయాన్ని కాలరాసి, ఈ ఏడాది బడ్జెట్లో మీరు రాష్ట్ర అప్పులను చూపలేదు. వాటి వివరాలు వెల్లడించలేదు. దీన్ని బట్టి మీ ఉద్దేశం ఏమిటన్నది ప్రజలు అర్ధం చేసుకోవాలి. బడ్జెట్లో వాల్యూమ్–6 (బడ్జెట్ ఇన్ బ్రీఫ్)లో రాష్ట్ర రుణాల వివరాలు ప్రకటిస్తే, వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఎవరి హయాంలో ఎంత అప్పు చేశారన్న వివరాలు తెలుస్తాయి అని, దాని వల్ల మీ అసత్య ప్రచారం బయట పడుతుంది అని అర్ధమవుతుంది. ఈ ఉద్దేశంతోనే ఈ బడ్జెట్లో అప్పుల వివరాలు వెల్లడించకుండా, యథావిథిగా గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ, పచ్చి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అలా ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. కానీ, కాగ్ నివేదిక ఆధారంగా ప్రజలకు ఎలాగూ రాబోయే కాలంలో నిజం తెలుస్తుంది. మీరు నిజంగా ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే వాల్యూమ్–6 (బడ్జెట్ ఇన్ బ్రీఫ్)లో ఆనవాయితీగా, సంప్రదాయబద్ధంగా దశాబ్దాల నుంచి వచ్చే పద్ధతిలో అన్ని వివరాలతో అప్పుల వివరాలు ప్రింట్ చేయాలి. అప్పుడు నిజమేదో బయట పడుతుంది.