మత్స్యకారులకు చంద్ర‌బాబు మోసం

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్ర‌హం

నెల్లూరు జిల్లా:  మ‌త్స్య‌కారుల‌కు సీఎం చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా మోసం చేశార‌ని నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కృష్ణపట్నం పంచాయతీలోని ఆర్కాట్‌పాళెంలో ఆయన పర్యటించారు. మత్స్యకార కుటుంబ పెద్దలతో మాట్లాడారు. మత్స్యకార కుటుంబాలకు ఇచ్చిన హామీలను మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామని హామీని చంద్రబాబు ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. మత్స్యకార భరోసా కింద రూ.20 వేలకు ఇస్తానని, డీజిల్‌పై 50 శాతం సబ్సిడీ ఇస్తామని ఓట్లు దండుకుని మొండి చెయ్యి చూపారని గుర్తు చేశారు. వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రూ.4 వేల నుంచి రూ.10వేలకు పెంచి ఇస్తామని 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని గుర్తు చేశారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని అందించారని తెలిపారు. ప్రస్తుతం ఏ పథకాలు మత్స్యకారులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి భ‌రోసా క‌ల్పించారు. అనంతరం స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నేత అక్కయ్యగారి అంకయ్య తల్లి లక్ష్మమ్మ ఇటీవల మృతి చెందగా ఆ కుటుంబాన్ని కాకాణి పరామర్శించారు. ఆయ‌న వెంట పార్టీ మండల అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్‌, స్థానిక ఉపసర్పంచ్‌ రాగాల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
 

Back to Top