తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని డొల్లతనాన్ని వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ లెక్కలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కనీసం దానికి సమాధానం చెప్పే ధైర్యం కూడా ప్రభుత్వంకు లేదని గుంటూరు జిల్లా వైయస్ఆర్సీపీఅధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పేరుతో మోసం చేస్తున్నారు, మైనింగ్, లిక్కర్, ఇసుక మాఫియాలతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని దోచేస్తున్నారని మండిపడ్డారు. అప్పులపై తండ్రీకొడుకులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. వీటిపై వైయస్ జగన్ గారు నిలదీస్తే సమాధానం చెప్పలేక దూషణలకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడానికి రూ. 80 వేల కోట్లు కావాల్సి ఉంటే, కేవలం రూ. 17,179 కోట్లే కేటాయించారు. ఇచ్చిన హామీలన్నింటినీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ చేస్తున్న మోసాలను వైయస్ జగన్ గారు ఎత్తి చూపితే బదులిచ్చే ధైర్యం వారికి లేదు. జగన్ గారి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పగలిగే పరిస్థితి అంతకన్నా లేదు. జగన్ గారి ప్రభుత్వంలో గ్రామస్థాయిలో ఏం జరిగినా దానిని మొత్తం ప్రభుత్వానికే అంటగట్టేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసినా దానికి అధికారులదే బాధ్యత అంటూ తప్పించుకుంటున్నారు. ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు, బడ్జెట్లో చేసిన కేటాయింపులు కలిపి చూస్తే కూటమి ప్రభుత్వానికి హామీలు నెరవేర్చే చిత్తశుద్ధి లేదని తేలిపోతోంది. హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు రాష్ట్రం అప్పుల్లో ఉందని, దానికి గత ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 143 హామీలిచ్చిన చంద్రబాబు బడ్జెట్లో వాటి అమలుకు అరకొర కేటాయింపులు చేశారు. కొన్నింటికి అసలు కేటాయింపులే లేవు. పథకాలకు తూట్లు పొడుస్తున్న ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పేరుతో ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 18 వేలు, నిరుద్యోగ భృతి పేరుతో ఒక్కొక్కరికి ఏడాదికిరూ. 36 వేలు ఈ ప్రభుత్వం ప్రజలకు బకాయి పడింది. తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు. గత ఏడాది బడ్జెట్ లో ఇందుకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఈ ఏడాది రూ.13,050 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ కేటాయించింది చూస్తే కేవలం రూ.8,278 కోట్లు మాత్రమే. అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు అన్నారు. గత ఏడాది అరకొర కేటాయింపులు చేసినట్లు చూపినా ఒక్క పైసా ఇవ్వలేదు. ఈ ఏడాది అన్నదాత సుఖీభవకు రూ.7200 కోట్లకు గానూ కేవలం రూ.6300 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది మోసం కాదా? ఉచిత బస్ పథకానికి బడ్జెట్లో అస్సలు కేటాయింపులే చేయలేదు. ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర కేటాయింపులు చేసి లబ్ధిదారులను మోసం చేయబోతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛన్ ఇస్తామన్న సంగతి మరిచారు. దీపం పథకానికి దాదాపు రూ. 3900 కోట్లు కావాల్సి ఉంటే బడ్జెట్లో కేవలం రూ. 2,601 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి నెలనెలా 66 లక్షల పింఛన్లు ఇస్తుండగా నేడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 9 నెలల్లోనే ఏకంగా 4 లక్షల పింఛన్లు తొలగించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూనే రాజధానికి రూ. 26 వేల కోట్లు అప్పులు తెచ్చారు. బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటాయించారు. చంద్రబాబు నేరాలను ఆ మూడు ఆత్మలే చెబుతాయి ఆత్మలతో మాట్లాడుతున్నారంటూ మంత్రి నారా లోకేష్ ఒక మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారు. ఇలా మాట్లాడటానికి లోకేష్ ఏ మాత్రం సిగ్గు పడటం లేదు. మూడు ఆత్మల కథ ఏపీ ప్రజలు ఎప్పుడో విన్నారు. అందులో ఒక ఆత్మ ఎన్టీఆర్ గారు అయితే ఇంకో ఆత్మ నందమూరి హరికృష్ణ. మూడో ఆత్మ లోకేష్ బాబాయ్ నారా రామ్మూర్తినాయుడు. ఈ మూడు ఆత్మలు చంద్రబాబు తన రాజకీయ జీవితంలో చేసిన నేరాలు, ఘోరాల గురించి తెగ చెప్పాయి. సీఎం, డిప్యూటీ సీఎంల వ్యాఖ్యలు అర్థరహితం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అందర్నీ సమానంగా చూడాల్సింది పోయి వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు పనులు చేయొద్దని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. వైయస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వాల్సి ఉందని చట్టాల్లో స్పష్టంగా ఉందని చెబితే, దానికి సమాధానం చెప్పలేక జర్మని వెళ్లాలని పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడారు. అందుకే ఆయన్ను ఉద్దేశించి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని వైయస్ జగన్ అన్నారు. వైయస్ జగన్ ఎవరి ప్రాప్తంతోనో సీఎం కాలేదు. ఆయన స్వశక్తితో రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఢిల్లీ కోటను ఢీ కొట్టి ఆయన పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు దౌర్జన్యాలు, అరాచకాలపై ఇప్పటికీ ఎన్టీఆర్, రామ్మూర్తి నాయుడు, హరికృష్ణ ఆత్మలు ఘోషిస్తున్నాయి. గాలివాటంతో లోకేష్ మొదటిసారి గెలిచాడు. ఇప్పుడెంత మెజారిటీతో గెలిచాడో రాబోయే ఎన్నికల్లో అంతే ఓట్లతో లోకేష్ ఓడిపోవడం ఖాయం. నాదెండ్ల మనోహర్ ఒక పీడీఎస్ బియ్యం దొంగ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక పీడీఎస్ రైస్ దొంగ. బతుకంతా రేషన్ సీజ్పేరుతో లంచాలు తీసుకోవడమే. బియ్యం దగ్గర రూ. కోట్లు లంచాలు తీసుకునే నాదెండ్ల మనోహర్ కి వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి లేదు. పులివెందులలో 24 మంది కౌలు రైతులను ఆదుకున్నామని నాదెండ్ల మనోహర్ చెబుతున్నాడు. పబ్లిసిటీ పిచ్చితో ఎవరెవరికి ఎంత దానం చేశామో మీలాగా చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు పట్టలేదు. 100 శాతం స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ సింగిల్ గా వచ్చి తన కెపాసిటీ నిరూపించుకోవాలి. మూడు పార్టీలు కలిసొస్తే తప్ప ఒక్కడిపై గెలవలేని దుస్థితి. మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్కి దమ్ముంటే బడ్జెట్పై వైయస్ జగన్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. బంధుప్రీతితోనే నాగబాబుకి పదవి పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు లాగా బంధుప్రీతికి అతీతం కాదు. అందుకే పార్టీలో ఎంతోమంది సీనియర్లున్నా వారందర్నీ పక్కనపెట్టి తన అన్న నాగబాబుని ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. ఆ బంధుప్రీతితోనే మొన్నటిదాకా కత్తులు దూసుకున్న తోడళ్లుల్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు ఇప్పుడు కలిసిపోయారు. టీడీపీలో తండ్రీకొడుకులు, జనసేనలో అన్నాదమ్ములు కలిసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. జమిలి ఎన్నికలు రాకపోతే ఈ దౌర్భాగ్యాన్ని మరో నాలుగేళ్లు భరించాలి. పవన్ కళ్యాణ్ అందరిపైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. వాటికి ఎవరైనా సరే ధీటుగా బదిలిస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు.