తాడేపల్లి: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుకునేవారిని కమ్యూనిస్టులు అంటారా..? నిజమైన కమ్యూనిస్టులు సింగపూర్ కావాలని కోరుకోరు.. సీపీఐ రామకృష్ణ కమ్యూనిస్టు సిద్ధాంతాలను పాటిస్తున్నారా..? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. నిజమైన కమ్యూనిస్టులు పేదల బాగుకోసం మాత్రమే ఆలోచిస్తారన్నారు. చంద్రబాబుకు రామకృష్ణ, నారాయణ అమ్ముడు పోయారని, అసత్యాలను నిజమని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజలు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారనే భయం ఉంది కాబట్టే దొంగలంతా ఒకే గొడుగు కిందకు వచ్చి కలిసి పోరాటం చేద్దాం రండి అంటూ కలవడం తప్ప.. ఈ రోజు జరిపిన రౌండ్ టేబుల్ సమావేశానికి వేరే అర్థం లేదన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పేర్ని నాని ఏం మాట్లాడారంటే.. చంద్రబాబు నాయుడు అంటే వల్లమాలిన ప్రేమ ఉన్న కొంత మంది వ్యక్తులు విజయవాడలో ఒక హోటళ్లో నాలుగు గోడల మధ్య కూర్చుని, ఓ సమావేశం పెట్టినట్లు నటించారు. బయటకు వచ్చి వారంతా మాట్లాడుతూ మేమంతా కూర్చుని గూడుపుఠాని చేశాం..దాని సారాంశం "స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం–సేవ్ డెమెక్రసీ" అంటూ నాలుగు కారుకూతలు కూశారు. అచ్చెన్నాయుడు వైయస్సార్సీపీ వచ్చాక ప్రజలు వాక్ స్వాతంత్య్రం కోల్పోయారంటూ వగలాడి మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంగా ఉన్న ఎల్లో టెర్రరిజం బ్యాచ్ వారే అక్కడ సమావేశమయ్యారు. నిజంగా వారికి వాక్ స్వాతంత్య్రం లేకపోతే మూడేళ్లుగా చంద్రబాబు, అచ్చెన్నాయుడుతో సహా అక్కడికి వచ్చిన నాయకులంతా ఎలా మాట్లాడగలుగుతున్నారో చెప్పాలి. మూడున్నరేళ్లుగా మీరంతా మాట్లాడే బాష సభ్యసమాజం ఒప్పుకునే బాషేనా..? మళ్లీ వారంతా వాక్ స్వాతంత్య్రం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరెందుకు పారిపోయారు..? మీరు అంటున్నట్టు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డికి ఓట్లేసి ప్రజలు తప్పుచేశారనే భావన ఉంటే... స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ వారు ఎందుకు పారిపోయారో సమాధానం చెప్పాలి. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకపు పాలన సాగుతుందని మీరు వాగుతూనే ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లకి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మీరెందుకు పారిపోయారో చెప్పాలి. మున్సిపల్ ఎన్నికల్లో మీ స్థానం ఏమిటి..? మీకు ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోవాలి. దేవుడు వీరికి సిగ్గు కాస్త కూడా పెట్టలేదు. అసలు మీలో కమ్యూనిజం ఉందా నారాయణ, రామకృష్ణా..? సీపీఐ నారాయణ, రామకృష్ణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటారు..అసలు వారిలో కమ్యూనిజం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. కమ్యూనిస్టులు సింగపూర్ లాంటి సిటీ కావాలని కోరుకోరు కానీ, రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు, రెండు పూట్లా భోజనం కావాలని నిజమైన కమ్యూనిస్టులు కోరుకుంటారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ కమ్యూనిస్టులు శభాష్ అంటూ ఒక్క రోజన్నా మాట్లాడారా..? అమరావతి ప్రాంతంలో 54 వేల మంది పేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే...ఇవ్వవద్దనే వారికి కొమ్ముకాస్తున్న మీరు కమ్యూనిస్టులు అని చెప్పుకోడానికైనా సిగ్గుపడండి. నిజమైన కమ్యూనిస్టు మిమ్మల్ని చూసి కన్నీరు కారుస్తాడు. ఈ ఇద్దరు నాయకులు మాత్రం కమ్యూనిస్టు పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టిన మాట వాస్తవం. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అండగా మేమున్నాం అని వీళ్లు చెప్తున్నారు. 54 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఇవ్వొద్దని అడ్డుపడినప్పుడు మీరు పేదల పట్టాల కోసం ధర్నాలు చేయాలి కదా..? అది కదా నిజమైన కమ్యూనిజం అంటే. అది మానేసి ఇవాళ ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు. అధికారం లేనప్పుడు చంద్రబాబు కుహనా మేధావుల్ని వాడుకుంటున్నాడు. ఆ సమావేశానికి హాజరైన వారిలో జడా శ్రావణ్ కుమార్ ది ఒక రాజకీయ పార్టీ అట... లక్ష్మణరెడ్డి అనే గోడలు దూకే వ్యక్తి ఉన్నారు. వీళ్లు ప్రజాస్వామ్యం, ప్రజల గురించి నీతులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకొకాయన బెజవాడలో మీటింగులు పెట్టేవాడు. అప్పట్లో నాకు అనుమానం ఉండేది. అది రాష్ట్ర ప్రభుత్వ మీటింగా...కమ్మ సంఘం మీటింగా అనే అనుమానం కలిగేది. తన కులజాఢ్యాన్ని ప్రజలు కనిపెట్టారని, కొత్తగా కొంతమందికి ముసుగులు వేసి చంద్రబాబు ఇప్పుడు వీళ్లందర్నీ కిరాయికి తెచ్చకున్నట్లున్నాడు. సీపీఐ రామకృష్ణ ...చంద్రబాబు ఎక్కడ చిందేయమంటే అక్కడ చిందేస్తాడు. ఇదే రామకృష్ణ అమరావతి రాజధానికి పనికిరాదు..ఒక కులానికి చెందిన రాజధాని అని మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడు ఏ మాత్రం సిగ్గు, బిడియం లేకుండా జై అమరావతి అంటున్నాడు. ఇప్పుడు వీళ్లంతా ఒక చోటికి చేరారు. సీపీఐ రామకృష్ణ, సీపీఐ నారాయణ, పవన్ కళ్యాణ్, జడా శ్రావణ్ కుమార్ లాంటి వాళ్లంతా చంద్రబాబు పంచన చేరారు. అధికారం లేనప్పుడల్లా కుహనా మేథావుల్ని వాడుకుంటున్నాడు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికంటూ వీళ్లంతా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు, అచ్చెన్నాయుడు అవినీతి గురించి మాట్లాడటంవింతగా ఉంది. ప్రతిరోజూ ఎల్లో మీడియా, చంద్రబాబు టీమ్.. సీఎం వైయస్ జగన్ని అవినీతి పరుడంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు. మీ విషం చిమ్మే మాటలు రాష్ట్ర ప్రజలకు కొత్తేమీ కాదు. ప్రజలు వైయస్ జగన్ వెంట.. వైయస్సార్సీపీకి ఒక్క సీటు కూడా రాదని మాట్లాడుతున్న వారు పోటీకి రండి..ఒక సీటు మీకు వస్తుందా...మాకు వస్తుందా తేలుతుంది కదా. వైయస్ జగన్పై అంతగా వ్యతిరేకత ఉందని మీరు భావిస్తే మీరంతా కలిసి పోటీ చేయాలనుకుంటున్నారు ఎందుకు?. మీ మనసులో భయం ఉంది. ప్రజలు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారనే భయం ఉంది కాబట్టే దొంగలంతా ఒకే గొడుగు కిందకు వచ్చి కలిసి పోరాటం చేద్దాం రండి అంటూ కలవడం తప్ప ఈ రోజు మీ రౌండ్ టేబుల్ సమావేశానికి వేరే అర్ధం లేదు. చంద్రబాబు, సోనియా గాంధీ కలిసి తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జైళ్లో పెట్టినా మీ కుట్రలను ఛేదించుకుని ప్రజల గుండెల్లో సీఎం వైయస్ జగన్ సుస్థిర స్థానం సంపాదించారు. అలాంటి వ్యక్తి గురించి పదేళ్లుగా అవాకులు, అసత్య దూషణలు చేస్తూనే ఉన్నారు. మీలాంటి వారు చేసే ధర్నాలకు, సంధి ప్రేలాపణలకు జడిసే మనిషి కాదు వైయస్ జగన్. మీరంతా ఒక పందిరి కిందకు వచ్చినంత మాత్రాన వైయస్సార్సీపీలోని చిన్న కార్యకర్తను కూడా భయపెట్టలేదు. జేబులు నింపుకోడానికే ఆనాడు డిప్యుటేషన్లు వచ్చారు... ఏ ఒక్క నెలలోనైనా జీతం పడని నెల ఉందా..? ఎవరికి జీతం పడలేదో వాళ్లు చెప్పాలి. చంద్రబాబు అసత్యాలను పది సార్లు మాట్లాడి అది నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి నెలా జీతాలు ఠంఛనుగా ఉద్యోగుల ఖాతాల్లో పడుతున్నాయి. లేదంటే ఉద్యోగ సంఘాలు ఊరుకుంటాయా అనేది ఆలోచించాలి. అప్పట్లో బాగా తినేద్దామని పోటీపడి డిప్యుటేషన్లపై వచ్చే వారు..కానీ ఇప్పుడు డబట్ ద్వారా రూ.1.85 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఎకౌంట్లలోకి వెళ్తుంటే ఇక వారు దోచుకోవడానికి అవకాశం లేదు కాబట్టే డిప్యుటేషన్లకు రావడం లేదు. చంద్రబాబు హయాంలో డిప్యుటేషన్ పై వచ్చిన వారంతా యనమల అల్లుడు, చంద్రబాబు, బాలకృష్ణ, దేవినేని ఉమా, కామినేని, సుజనా చౌదరి బంధువులే. వైయస్ జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టే రావడం లేదు. చంద్రబాబు సమయంలో కేంద్రం నుంచి మన రాష్ట్రానికి ఎందుకు డిప్యుటేషన్లపై వచ్చారో విమర్శ చేసే గోడదూకుడు రెడ్డి తెలుసుకుంటే మంచింది. కోర్టుకు కట్టమన్న లక్ష రూపాయలు ఎక్కడ పవన్ కళ్యాణ్..? వైజాగ్లో పవన్ కళ్యాణ్ కారెక్కి ఊరేగిన మరుసటి రోజు జనవాణి పెట్టారు. జనవాణిని ఎవరూ అడ్డుకోలేదు..కారెక్కి ఊరేగితే ప్రజలకు ఇబ్బంది అని చెప్పారు. కారెక్కి ఊరేగడానికి అనుమతి తీసుకోవాల్సింది. ప్రజలు అంతా ఇబ్బంది పడుతున్నారు...త్వరగా వెళ్లమని చెప్తే దానికి నొప్పిగా ఉందా..? తప్పుడు సంతకాలతో ఇప్పటంలో పవన్ కళ్యాణ్ ప్రజలను కష్టాల్లోకి నెట్టాడు. కోర్టు కట్టమన్న లక్ష కూడా వీళ్లు కట్టడం లేదట. అదన్నా కట్టి ఇప్పటం ప్రజలను ఆదుకోవాలి. పవన్ పర్యటనలో ముళ్లకంచెలు పెట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. వారం వారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ని తిట్టడానికి ఒక అడ్డగాడిద రాష్ట్రానికి వచ్చిపోతోంది. మరి అప్పుడు వాక్ స్వాతంత్య్రం, ప్రజా స్వామ్యం ఆయనకు ఎలా దక్కింది...? సినిమా రైటర్లు రాసిచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడటం మంచిది కాదు. ముసుగులు వేసుకుని తప్పుడు రాజకీయాలు చేసే బదులు మేమంతా ఒకటే...జగన్మోహన్రెడ్డిని విడివిడిగా ఏమీ చేయలేకపోతున్నాం..చంద్రబాబు వల్ల ఏమీ కావడం లేదని చెప్పండి. చంద్రబాబు దగ్గర పోటీ చేయడానికి మనిషి కూడా దొరకడం లేదని, అందుకే పవన్కళ్యాణ్ సహా మేమంతా చంద్రబాబు వెనుక ఉంటున్నామని ధైర్యంగా చెప్పండి. ఎన్టీఆర్ పట్ల చేసిన పాపాలే చంద్రబాబుకు శాపాలు ఇవన్నీ చంద్రబాబు డ్రామాలు. వయసుకూడా 70 ఏళ్లు కాబట్టి పాత సినిమాల్లో రాజనాల, ముక్కామల లాంటి కుట్రలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ కు మీరు చేసిన పాపాలు శాపాలై చంద్రబాబును చుట్టుకున్నాయి. వాటిని చంద్రబాబు అనుభవించక తప్పదు. ఇప్పుడు అనుభవిస్తుంది కూడా అదే. భవిష్యత్తులో కుప్పం కూడా గెలుస్తానో లేదో అనే అనుమానంతో ఇళ్లు కట్టుకోవాలనే భయం వచ్చింది. ఆ భయం వైయస్ జగన్ వల్లే వచ్చింది. వీళ్లందరికీ ముసుగేసి మేథావులైనట్లు, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వీళ్లే మొనగాళ్లు అయినట్లు మాస్కులు పెట్టి బజారుకు వదిలినంత మాత్రాన ప్రజలు అమాయకులు కాదు. దమ్ముగా ముసుగు తీసి రాజకీయం చేయమని సీపీఐ, జనసేన వారిని కోరుతున్నా.