కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ఉర‌వ‌కొండ వైయ‌స్ఆర్ సీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి

ఉర‌వ‌కొండ ఎస్కే జూనియర్ కళాశాల్లో రూ.1.53 కోట్లతో `మనబడి నాడు-నేడు` పనులకు భూమిపూజ

ఉరవకొండ: రాష్ట్రంలో కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించాలన్నదే ప్రభుత్వ ల‌క్ష్య‌మ‌ని, ఆ దిశ‌గా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అడుగులు వేస్తున్నార‌ని ఉరవకొండ నియోజకవర్గ వైయ‌స్ఆర్ సీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఉరవకొండ ఎస్కే బాలిక, బాలుర జూనియర్ కళాశాలలో "నాడు నేడు" పథకం రెండో దశ కింద వివిధ నిర్మాణాలకు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి విశ్వేశ్వరరెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి విద్య, వైద్యం, సంక్షేమం అత్యంత ప్రధానమైన అంశాలు అని అన్నారు. ఆ అభివృద్ధిలో భాగంగానే రూ. 1.53 కోట్లతో మనబడి నాడు-నేడు పనులకు శంకుస్థాపన చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో సీఎం వైయ‌స్ జగన్ రాష్ట్రంలో ముందుకు వెళుతున్నాడన్నారు.పేదవాడి చదువు కోసం ముఖ్య‌మంత్రి ప్రత్యేక శ్రద్ద పెట్టారని చెప్పారు. కార్పొరేట్ స్కూల్స్ దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. 

గతంలో పాఠశాలల అభివృద్ధి లేక విద్యార్థుల డ్రాపవుట్స్ శాతం అధికంగా ఉండేవ‌ని, వైయ‌స్ఆర్ సీపీ  అధికారంలోకి వచ్చాక  కార్పొరేట్ బడులకు తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ ఫుల్ బోర్డు పెట్టాల్సివస్తుందన్నారు. రాష్ట్రంలో మన బడి నాడు-నేడు కార్యక్రమంలో 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మమత, ఎస్ఎస్ఏ డిఈ జయరామ్, ఏఈ అబ్దుల్ గఫుర్, ఎన్ఎస్ఎస్ ఖాదర్ ఖాన్, శివప్రసాద్, పద్మావతి,ఇతర అధ్యాపకులు, వైయ‌స్ఆర్ సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top