అమరావతి: రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి గౌతంరెడ్డి మరణంతో 2 రోజులపాటు సంతాప దినాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అధికార లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. సంతాప సూచకంగా జాతీయపతాకాన్ని అవనతంచేస్తారు. మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విషాదంలో మునిగిపోయారు. విషయం తెలియగానే అయన వివరాలు అడిగితెలుసుకున్నారు. హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వై.విసుబ్బారెడ్డి, చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శులు సాలోమన్ ఆరోకియా రాజ్, రేవు ముత్యాలరాజు, ధనుజంయ్ రెడ్డిలతో ముఖ్యమంత్రితో తన నివాసంలో సమావేశమయ్యారు. గౌతంరెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. చిన్ననాటి నుంచే తనకు బాగా పరిచయమంటూ ముఖ్యమంత్రి ఆవేదనలో మునిగిపోయారు. ఒక స్నేహితుడినే కాకుండా సమర్థుడైన మంత్రిని, విద్యాధికుడ్ని కోల్పోయానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారంటూ సీఎం గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ అభివృద్ధికి విశేష కృషిచేశారని. ప్రభుత్వ పారదర్శక పారిశ్రామిక విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంద్వారా రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకు వచ్చారని సీఎం అన్నారు. రెండుసార్లు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రజల ఆదరాభిమానాలతో గెలుపొంది ఉజ్వలభవిష్యత్తు ఉన్న నాయకుడ్ని కోల్పోయానని ఆవేదనవ్యక్తంచేశారు. గౌతం రెడ్డి మరణం తనకే కాదు, రాష్ట్రానికే తీరని లోటని అన్నారు. వెంటనే ఆయన గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. నేరుగా హైదరాబాద్ చేరుకుని మంత్రి మేకపాటి నివాసానికి చేరుకుంటారు. అక్కడే ఆయనకు నివాళులు అర్పిస్తారు.