నెల్లూరు: రైతులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టకున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. ఐదేళ్ల పాటూ రైతులకు రైతు భరోసాను చెప్పిన దానికంటే అధికంగా ఇచ్చారన్నారు. ఐదేళ్లలో రైతులకు ప్రభుత్వం అందించిన సేవలపై పుస్తకాన్ని విడుదల చేశామని ఆయన తెలిపారు. రైతులపై భీమా ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే చెల్లించిందని, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామని మంత్రి కాకాణి చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే వరి ధాన్యానికి మద్దతు ధర కంటే 30 శాతం అధికంగా ఇచ్చామని చెప్పారు. నెల్లూరులోని మంత్రి కార్యాలయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే: దేశానికే ఆదర్శంః ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రైతులకు అమలు చేస్తున్న పథకాలు- సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. 2019 ఎన్నికల సమయంలో రూ.12,500 చొప్పన నాలుగు విడతల్లో రూ.50 వేలు రైతాంగానికి అందిస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక దాన్ని రూ.12,500లు నుంచి రూ.13,500లకు పెంచి.. ఐదేళ్లలో రూ.67,500 రైతుల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్ఆర్-పీఎం కిసాన్ పథకం కింద ఐదేళ్లలో రూ. 34,288 కోట్లు రైతులకు సీఎం జగన్ ఆర్థిక సాయం అందజేశారు. తద్వారా ఒక్కో రైతుకు రూ.67,500 అందింది. చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా వదిలి వెళ్లిన బకాయిలను సైతం రైతులకు చెల్లించటంతో పాటు ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో నష్టపరిహారంతో పాటు.. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం.మేం రైతు భరోసా కేంద్రాలు తెచ్చాం. ఉచిత పంటల బీమా తెచ్చాం. ఈ- క్రాప్ బుకింగ్ ద్వారా పారదర్శకమైన వ్యవసాయ విధానాన్ని తెచ్చాం. ఉచిత పంటల బీమాతో పాటు వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేశాం. సున్నా వడ్డీకే పంట రుణాలు ఇచ్చాం. డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు ఇచ్చాం. కేంద్రం ప్రకటించని పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తోంది. ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు. చంద్రబాబు హయాం కన్నా రెట్టింపుకు ధాన్యం ధరః గతంలో ధాన్యం కొనుగోళ్లు ఎలా సాగేవో అందరికీ తెలుసు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకెళ్లే.. రకరకాల కారణాలతో రెండు, మూడు రోజులు ఆపేవారు. బాడుగకు తెచ్చిన ట్రాక్టర్లు, లారీలు ధాన్యాన్ని దింపేసి వెళ్లిపోవటంతో.. రైతులు ఎంతో కొంత ధరకు ధాన్యాన్ని అమ్ముకునేవారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాల్లో లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీ, కోతలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు హయాంలో పుట్టీ రూ.12,500కు అమ్మారు. కానీ, ఇవాళ పుట్టీ గిట్టుబాటు ధర రూ.18000 ఉంది. అయితే.. రూ.23,500 నుంచి రూ.24,000 వరకు పుట్టీ ధాన్యం అమ్ముడు అవుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కన్నా 30% అధికంగా అమ్ముతోంది. గత ప్రభుత్వంలో 30% తక్కువకే అమ్మితే..ఈ ప్రభుత్వంలో 30% అధిక ధరకు రైతులు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. అంటే రైతులు దాదాపు రెట్టింపు లాభం పొందుతున్నారు. గతంలో అమ్ముడుపోయిన రూ.12 వేలు ఎక్కడ? ఇప్పుడు రూ.24 వేలు ఎక్కడ? దాదాపు 100% ధర పెరిగి రైతులు లబ్ధి పొందుతున్నారు. పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాంః విద్యుత్ రంగంలో.. ఫీడర్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయగలిగాం కాబట్టి.. వ్యవసాయానికి సాఫీగా పగటి పూట 9 గంటలు ఇస్తున్నాం. ఇవాళ యూనిట్ ఎంత అయినా కొనుగోలు చేసి ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాము. చంద్రబాబు హయాంలో విద్యుత్ బకాయిలు రూ.8,840 కోట్లు పెట్టి పోతే వాటినీ చెల్లించాం. క్రమం తప్పకుండా రూ.43,744 కోట్లు చెల్లించాం. అక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50లకే అందజేస్తున్నాం. ఆయిల్ ఫాం రైతులకు సబ్సిడీ ఇచ్చాం. గతంలో ఫాం మెకనైజేషన్ పేరుతో రైతు రథాలు తెచ్చి కమీషన్లు కొట్టేశారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ యంత్రసేవా పథకం క్రింద ట్రాక్టర్లు, పనిముట్లు అందజేశాం. ప్రకృతి వైపరీత్యాలు జరిగితే 80% విత్తనాలు సబ్సిడీ ఇచ్చాం. వైఎస్ఆర్ సున్నావడ్డీ కింద పంట రుణాలు ఇచ్చాం.అందుకే ధైర్యంగా వ్యవసాయం సుసంపన్నం చేశాం అని చెబుతున్నాం. రాష్ట్రానికి సౌభాగ్యం అనే పుస్తకాన్ని ముద్రించాం. రాష్ట్ర రైతాంగానికి వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏమైతే హామీ ఇచ్చారో దాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకోగలిగారు. రైతు రుణమాఫీ పేరుతో బాబు దగాః గతంలో చంద్రబాబు బేషరుతుగా రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పారు. దానికి రూ.24 వేల కోట్ల వడ్డీ కలిపితే.. సుమారుగా రూ.1,11 లక్షల కోట్లు రైతు రుణమాఫీ చెల్లించాల్సి ఉండగా.. దాన్ని ఎగగొట్టడానికి కోటయ్య కమిటీని చంద్రబాబు వేశాడు. కోటయ్య కమిటీ కాస్త కోతల కమిటీ అయిపోయింది. ఐదు విడతల్లో రూ.1.50 లక్షలు ఇస్తా.. కుటుంబానికి ఒకరికే ఇస్తా.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇస్తానని చెప్పాడు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్న పేరుతో గతంలో రైతు సాధికార సంస్థ ద్వారా రుణ ఉపశమన అర్హత పత్రాలు ఇచ్చాడు. ఈ రుణ ఉపశమనల అర్హత పత్రాల మీద టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలి. పోనీ రుణం మొత్తం ఇచ్చాడా అంటే..అదీ లేదు. రుణాలకు సంబంధించిన వడ్డీలు ఏమో 24 వేల కోట్లుపైనే ఉంటే.. ఐదు విడతల్లో కలిపి చంద్రబాబు ఇచ్చింది కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే. అదీ వడ్డీలకు కూడా చాలలేదు. చంద్రబాబు పాదం పడితే.. రాష్ట్రంలో కరువు కాటకాలేః చంద్రబాబు తన హయాంలో వ్యవసాయానికి తిరుగులేదని డబ్బా కొట్టుకోవటం ఏమిటి? అసలు.. ఆ దరిద్రపాదం మోపినప్పుడల్లా రాష్ట్రం కరువు కాటకాలతో రాష్ట్రం అల్లాడింది. బాబు హయాంలో రాష్ట్రంలో ఎక్కడైనా వర్షాలు పడ్డాయా? రైతులు వర్షాలు లేక అల్లాడారు. రైతులకు ప్రకృతి వల్ల జరిగిన నష్టం కంటే.. చంద్రబాబు విధానాల వల్ల ఎక్కువగా నష్టపోయారు. అనంతపురంలో రైన్ గన్ లు వాడి కరువును జయించానని అన్నాడు. మరోసారి తుపానును జయించానని చంద్రబాబు అంటాడు. ఈ దరిద్రపు మాటలు, దరిద్రపు పాదంతో తిరగటం తప్ప.. చంద్రబాబు హయాంలో ఎవరైనా రైతులు సంతోషంగా ఉన్నారా? చంద్రబాబు సీఎం అయితే రైతులు సంతోషంగా ఉంటారా? బాబు హయాంలో రైతులకు ఏం మేలు జరిగిందో ఒక్కసారి లెక్క చెప్పమనండి. ఆనాడు నష్టాల ఊబిలో ఉన్న రైతులను మరింత కుంగదీసేలా చంద్రబాబు చర్యలు ఉన్నాయి. ప్రాజెక్టుల మీద ఖర్చు తప్ప రాబడి రాదన్నది చంద్రబాబుః ప్రాజెక్టుల మీద పెట్టుబడులు పెడితే.. ఖర్చు తప్ప రాబడి రాదన్న చంద్రబాబు ఇవాళ ఎన్నికల సమయంలో రైతు జపం జపిస్తున్నారు. ఇరిగేషన్కు రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టానని చంద్రబాబు గాలి లెక్కలు చెబుతున్నారు. అందులో రూ.50 వేల కోట్లు పైగా నీరు - చెట్టు కింద పచ్చ చొక్కాల కార్యకర్తలు, చంద్రబాబు దోచుకున్నారు. ప్రాజెక్టులపై వాస్తవంగా రూ.18 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు, సంగం ప్రాజెక్టులు చంద్రబాబు హయాంలో పూర్తి కాలేదు. జగన్ ప్రభుత్వంలో రైతుల ఖాతాల్లోకి నిధులుః చంద్రబాబు హయాంలో నీరు - చెట్టు, రైతు రథం, ధాన్యం కొనుగోళ్లలో చిలక్కొట్టుడు, అవినీతి జరిగింది. కానీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కితే డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. మిగ్జాం తుపానులో దెబ్బతిన్న రైతులకు నారుమళ్లకు 80% సబ్సిడీ విత్తనాలు ఇచ్చాం. ఈ సీజన్ ముగిసేలోపు రైతుల ఖాతాల్లో పంట నష్టపరిహారం జమ చేయబోతున్నాం. నేడు ఇంటి ముంగిటకే ఎరువులు వస్తున్నాయి. ఎరువుల డీలర్ల దగ్గర మార్జిన్లు, కమిషన్లు తీసుకుని సొసైటీల్లో కాకుండా.. బ్లాక్లో అధిక ధరలకు రైతులకు అమ్మేవారు. కాంప్లెక్స్ ఎరువులు కొంటే యూరియా ఇస్తామని డీలర్లు చెప్పేవారు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఆర్బీకేల ద్వారా రైతుల ముంగిటకే ఎరువులు తెచ్చాం. ఇది సాయం కాదు.. సంస్కరణలు. పిచ్చి, ఉన్మాదాన్ని మించి పవన్ భాషః వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేశాం. ఈ కార్యక్రమం అమలులో అధికారుల భాగస్వామ్యం ఉంది. వారి అందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధి అందుకున్న రైతు సోదరులు అందరికీ హృదయపూర్వక అభినందనలు. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. పార్టీలో ఇమడలేని వారు రాజీనామాలు చేసి వెళ్లిపోవటం చాలా సహజం. ఎంపీ అభ్యర్థిని త్వరలో పార్టీ అధిష్టానం ఫైనల్ చేస్తుంది. పవన్ కల్యాణ్... నిన్నటి దాకా పిచ్చోడు, ఉన్మాదపోడు అని అనుకున్నాం. అది దాటి మాట్లాడుతున్నాడు. జనం రాకపోయే సరికి ఏం మాట్లాడాలో అర్థంగాక ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. నిన్న తాడేపల్లిగూడెం సభ ద్వారా నేను నాయకుడిని కాదు.. పిచ్చోడిని నమ్మి తనకు ఓట్లు వేయొద్దని చెప్పకనే చెప్పాడు. పవన్ ద్వారా ఓట్లు బదిలీ అవుతాయని చంద్రబాబు భావిస్తే అంతకంటే పిచ్చి మరొకటి ఉండదు. స్థాయిలేని వ్యక్తుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారి గురించి మాట్లాడటమే దండగ. ఇప్పుడు నేను వామన అవతారం ఎత్తి వస్తానని పవన్ అంటున్నాడు. చంద్రబాబు ఏమో పవన్ను తొక్కితే... పవన్ తన పార్టీ నాయకులను, కార్యకర్తలను లెగవకుండా తొక్కాడు. ఇవీ వారిద్దరి వామన అవతారాలు.