గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం నిరసన దీక్ష చేస్తాం

వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

చోడవరం:  గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేస్తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటే సరిపోదని, రాష్ట్రంలోని రైతుల సమస్యలు కూడా పట్టించుకోవాలని  మండిపడ్డారు. రైతులు మన రాష్ట్రానికి సంబంధించిన వారు కాదా? అని బొత్స నిలదీశారు. ఈ రోజు చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీని బొత్స సందర్శించారు. ఈ సంద‌ర్భంగా  ఆయన మాట్లాడుతూ.. ‘గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల స‌మ‌స్య‌లు  శాసనమండలలో లేవనెత్తుతాం. రైతుల బకాయిలను ఆణా పైసాతో సహా చెల్లించాలి. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో లక్ష 70 వేల టన్నుల చెరకు పండింది. ఇప్పటి వరకు కనీసం 70 టన్నుల చెరకు కూడా క్రస్సింగ్ చేయలేదు. 

షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు రైతులకు బకాయిలు చెల్లించలేదు. ప్రతి ఏడాది నవంబర్ డిసెంబర్ నెలలో క్రసింగ్ జరిగేది. కానీ ఇప్పుడు సంక్రాంతి దాటిన  క్రసింగ్ జరగ లేదు. జనవరిలో క్రాసింగ్ జరగడం వలన చెరుకు ఎండిపోతుంది.  గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులను వైయ‌స్ జగన్ రూ. 90 కోట్లతో ఆదుకున్నారు.

షుగర్ ఫ్యాక్టరీ కష్టాల నుంచి తక్షణం గట్టెక్కాలంటే 35 కోట్లు అవసరం. ప్రభుత్వం వెంటనే రూ. 35 కోట్లు విడుదల చేయాలి. ఉద్యోగులకు జీతాలు వెంటనే చెల్లించాలి. టన్ను చెరుకుకు రూ. 2500 ఇస్తే ఏమి సరిపోతుంది?, రైతులు మన రాష్ట్ర ప్రజలు కాదా?, దివంగత నేత వైయ‌స్ హయాంలో షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నతమైన దశలో ఉన్నాయి. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు రైతులను ఆదుకోవాలి. రాజకీయాలు కోసం నేను రాలేదు.. రైతుల బాధలు చూసి మాట్లాడుతున్నాను.’ అని బొత్స స్పష్టం చేశారు.

Back to Top