రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచకాలపై ఆగ్ర‌హ జ్వాల‌లు

వినుకొండలో దారుణ హత్య‌, పుంగ‌నూరులో ఎంపీ కారుపై రాళ్ల దాడిని ఖండించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

అమ‌రావ‌తి:  రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కొన‌సాగుతున్న అరాచ‌కాల‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హ జ్వాల‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా వినుకొండలో పార్టీ కార్యకర్త దారుణహత్య. పుంగనూరులో ఎంపీ పి.మిధున్‌రెడ్డిపై రాళ్లతో దాడి. వాహనాల ధ్వంసం ఘటనలను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ముక్త కంఠంతో ఖండించారు.
అధికారం చేపట్టిన టీడీపీ తొలి రోజు నుంచి పాలన గాలికి వదిలేసి, కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, ఎక్కడికక్కడ దాడుల చేస్తోందని వారు ఆక్షేపించారు.
ఇకనైనా టీడీపీ తన వైఖరి మార్చుకోకపోతే, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని వైయస్సార్‌సీపీ నేతలు, నాయకులు హెచ్చరించారు.

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు.. ఎవరు, ఏమన్నారంటే..:

పి.మిధున్‌రెడ్డి. రాజంపేట ఎంపీ.
– ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం సృష్టించారు. రాళ్ళతో, మారణాయుధాలతో దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ డైరెక్షన్‌లోనే పుంగనూరు ఘటన చోటు చేసుకుంది. పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకోవాలన్న కుట్రలో భాగమే ఈరోజు అక్కడ రాళ్ల దాడి, వాహనాల ధ్వంసం జరిగింది. రూ.5 వేల కోట్లతో ఎలక్ట్రిక్‌ కార్ల ఫ్యాక్టరీ పుంగనూరులో ఏర్పాటవుతుంటే, దాన్ని ఎలాగైనా ఆపాలన్న కుట్ర చేస్తున్నారు. ఎల్లకాలం మీ ఆటలు సాగవు. ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నా సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా ఉండాలని చూస్తున్నారు. అందుకే మా వాహనాలు ధ్వంసం చేశారు. నాపై రాళ్ల దాడి చేశారు.

రెడ్డప్ప. చిత్తూరు మాజీ ఎంపీ.
– పుంగనూరు నా ఇంటికి వచ్చిన ఎంపీ పి.మిధున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. మారణాయుధాలు, రాళ్లతో ఎంపీ మిథున్‌రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. నా వాహనాలతో పాటు, మిథున్‌రెడ్డి వాహనాలు కూడా ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా, పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. వారు టీడీపీ తొత్తులుగా వ్యవహరించారు.

గొల్ల బాబురావు. ఎంపీ (రాజ్యసభ సభ్యుడు).
– ఎంపీ మిధున్‌రెడ్డిపై రాళ్ళ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దాడులు హత్యలు దారుణంగా పెరిగిపోయాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదు. 
దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. దాడులు చేస్తున్న వారికి ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారు.

ఇస్సాక్‌ బాషా, వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ 
– చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద ఎంపీ మి«ధున్‌రెడ్డిపై దాడి అమానుషం. ఎంపై రాళ్ల దాడి చేసి, వారి వాహనాలు« ధ్వంసం చేయడం అత్యంత హేయం. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో రాక్షస, ఆరాచక పాలన సాగుతోంది. ఈ దాడులపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రజలు అధికారాన్ని ఇస్తే, సభ్య సమాజం తలదించుకునేలాగా టీడీపీ నాయకులు ప్రవర్తించడం సిగ్గుచేటు.

బొల్లా బ్రహ్మనాయుడు. మాజీ ఎమ్మెల్యే  (వినుకొండ)
– రేపు (19వ తేదీ, శుక్రవారం) ఉదయం మా పార్టీ అధ్యక్షుడు   వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వినుకొండలో పర్యటిస్తారు. టీడీపీ కార్యకర్త చేతిలో దారుణ హత్యకు గురైన రషీద్‌ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఆ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పడానికే, ఆయన రేపు వినుకొండలో పర్యటించనున్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది, వందలాది ప్రజలు, పోలీసులు చూస్తుండగానే, వినుకొండ నడిరోడ్డులో మా పార్టీ కార్యకర్తను నరికి చంపడం అంటే.. అంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా?.
ప్రజలు మీకు అధికారం ఇచ్చింది.. ఇలా పార్టీ కార్యకర్తలను నరికి చంపడానికా?. వినుకొండలో తెలుగుదేశం పార్టీ కొత్త సాంప్రదాయానికి బీజం వేసింది. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చురుకుగా పని చేస్తున్నాడన్న కారణంతోనే రషీద్‌ను దారుణంగా నరికి చంపారు. 

సి.అనిల్‌కుమార్‌ యాదవ్‌. మాజీ మంత్రి.
– వినుకొండ టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్‌ ఘటన.. మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. అంత కిరాతకమైన దృశ్యాలు ఆ వీడియోలో కన్పిస్తున్నాయి. రషీద్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్‌ను అత్యాచారప్రదేశ్‌గా మార్చొద్దు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పాలన కొనసాగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ కనిపించడం లేదు. కేవలం నారా లోకేష్‌ ఆర్డర్‌ కనిపిస్తో్తంది. 
వినుకొండ లాంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. 
వాటన్నింటిపై ప్రధాని మోదీ గారు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాగారు దృష్టి పెట్టాలి. అలాగే రాష్ట్రంలో ఈ ఒకటిన్నర నెలల్లో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి.

ధర్మాన కృష్ణదాస్‌. మాజీ మంత్రి. 
– వినుకొండలో జరిగిన హత్య ఒక రాజకీయ హత్య. అలాగే ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి అత్యంత హేయం. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. వినుకొండలో మా పార్టీ కార్యకర్తను అత్యంత పాశవికంగా హత్య చేసి, దాన్ని వ్యక్తిగత హత్యగా చిత్రీకరించడం దారుణం. టీడీపీ దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరు వెళ్లిన ఎంపీ మిధున్‌రెడ్డిపై రాళ్లతో దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యుడికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం, సామాన్య కార్యకర్తలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తుంది?. 
ఏకంగా ఒక ఎంపీపైనే రాళ్లతో దాడి చేస్తున్నా, రక్షణ కల్పించకుండా పోలీసులు చోద్యం చూశారంటే, ఇక్కడ ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలి. గతంలో ఎన్నడూ లేనటువంటి సంçస్కృతిని ఇప్పుడు చూస్తున్నాం. అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుంది. 

కోరుముట్ల శ్రీనివాసులు. మాజీ ఎమ్మెల్యే (రైల్వే కోడూరు).
– రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన తాలిబన్ల పాలనను తలపిస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌పై దృష్టి పెట్టకుండా సూపర్‌ మ్యాజిక్‌ చేసి మోసం చేస్తున్నారు. కూటమి నాయకులు దళితులనే టార్గెట్‌ చేసి దాడులు చేయడం హేయమైన చర్య. ఈ కూటమి తాలిబన్లను తరమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. మీ దాడులపై మా పార్టీ ప్రతి దాడులకు దిగితే తట్టుకోలేరు. 

జక్కంపూడి రాజా. మాజీ ఎమ్యెల్యే. (తూ.గో.జిల్లా)
– రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. చంద్రబాబు మార్క్‌ రాజకీయాలు నడుస్తున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. హత్యలు, దొమ్మీలు ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. ఈ తరహా పద్ధతి మారకపోతే తిరగబడాల్సి వస్తుంది. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి దారుణం. వెంటనే రాజ్యాంగ వ్యవస్థలు జోక్యం చేసుకోవాలి. ఇకనైనా చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలి.

కాసు మహేష్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే (గురజాల).
– కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచకం నడుస్తోంది. టీడీపీ నాయకులు దాడులు, మర్డర్లు ,మానభంగాలతో చెలరేగిపోతున్నారు. ఇందుకేనా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది?. మీ పాలనలో గ్రామాలలో ఎన్నో కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. వినుకొండలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మా పార్టీ కార్యకర్తను నరికి చంపడం దారుణం.

– తెలుగుదేశం నాయకులు అసలు ఎందుకు దాడులు చేస్తున్నారు?. మర్రి రాజశేఖర్‌. ఎమ్మెల్సీ.

నడిరోడ్డుపైన పోలీసులు ఉండగానే రషీద్‌ను అత్యంత దారుణంగా చంపడం దుర్మార్గపు చర్య. గతంలో జిల్లా ఎస్పీగా మల్లికాగార్గ్, నెల రోజులపాటు పని చేసినప్పుడు, ఈ తరహా దాడులు కాస్త తగ్గాయి. 
జిల్లాకు చెందిన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, సీఎం చంద్రబాబును కలిసి, ఎస్పీని మార్చమని కోరారు. ఆయన వెంటనే ఆ పని చేశారు. ఇప్పుడు వినుకొండలో మా పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. ఘటన జరిగిన వెంటనే, ఎలాంగి దర్యాప్తు చేయకుండానే, అర్ధరాత్రి మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ, అది వ్యక్తిగత, పాత కక్షల వల్లనే జరిగిందని చెప్పడం దారుణం.
మరోవైపు రషీద్‌ను నరికి చంపిన జిలానీ, వాస్తవానికి టీడీపీకి చెందినవాడైనా, అతడు తమ పార్టీ కార్యకర్త అంటూ, తెలుగుదేశం పార్టీ  సోషల్‌ మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో జిలానీ, టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు కోసం పని చేశారు.

గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే (నర్సారావుపేట)
– చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై దాడులు చేయటమే తెలుగుదేశం కార్యకర్తలు పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వారు గాలికి వదిలేశారు. హత్య జరిగిన తరవాత అర్ధరాత్రి ప్రెస్‌మీట్‌ పెట్ని ఎస్పీ, పాతకక్షల వల్లే రషీద్‌ హత్య జరిగిందని చెప్పడం దారుణం.

కనుమూరు రవిచంద్రారెడ్డి, వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి.
– పక్కా ప్లాన్‌తో  రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గడిచిన 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న హింస ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. 31 హత్యలు, 35 మంది ఆత్మహత్యలు జరిగాయి. ఏకంగా 2,750 కుటుంబాలు ప్రాణభయంతో వలస పోయాయి. ప్రతిపక్షాన్ని టెర్రరైజ్‌ చేస్తున్నారు. ఎమర్జెన్సీ ని తలపిస్తున్నారు. గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకోవాలి. హైకోర్టు కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి. వినుకొండ హత్యకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి.
అటు పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి చేశారు. ఇందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది?. వారం లోగా పరిస్థితిని చక్కదిద్దాలి. లేకపోతే రాజీనామా చేయాలి. మా ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుంది.

అకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి. రాజంపేట ఎమ్మెల్యే.
– రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల కూడా గడవక ముందే మా పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలపై టీడీపీ దాడులు తీవ్రమయ్యాయి. ఎంపీ మిధున్‌రెడ్డిపై పుంగనూరులో రాళ్లదాడిని ఖండిస్తున్నాం. సౌమ్యుడిగా, మంచి వ్యక్తిగా పేరున్న మిథున్‌రెడ్డిపై టీడీపీ దాడి ఎంత వరకు సబబు?. తమ నియోజకవర్గంవలో పర్యటించే హక్కు, ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధికి, ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. ఆ హక్కును కాలరాయాలని టీడీపీ చూడడం దారుణం. 

కాకాణి గోవర్థన్‌రెడ్డి. మాజీ మంత్రి.
– రాష్టంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. గుంటూరు జిల్లాలో వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వారి దాడులు తీవ్రమవుతున్నాయి. వినుకొండలో నడి రోడ్డుపై రషీద్‌ను దారుణంగా నరికి చంపారు. వ్యక్తిగత వివాదాలు, పాతకక్షల వల్లే ఆయన హత్య జరిగిందని, అర్థరాత్రి హడావిడిగా ఎస్పీ చెప్పడం దారుణం. అలాంటి ఎస్పీకి రాష్ట్రంలో పని చేసే అర్హత లేదు. 
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాడులు పెరిగాయి. దాదాపు 3 వేల కుటుంబాలు ఇళ్లు, ఊళ్లు వదిలి వెళ్లాయి. మరోవైపు  మహిళలు, మైనర్‌ బాలికలపై అఘాయిత్యాలు అధికమయ్యాయి. మా పార్టీ వారిపై నానాటికీ దాడులు పెరుగుతున్నా, పోలీసులు అస్సలు  పట్టించుకోవడం లేదు. చంద్రబాబు 40 రోజుల పాలనలో అనేక దారుణాలు జరిగాయి. ఆడపిల్లల జోలికి వస్తే.. భయపడేలా చేస్తామన్న పవన్‌కళ్యాణ్‌.. ఇప్పుడు నోరు మెదపడం లేదు. 

జి.శ్రీకాంత్‌రెడ్డి. వైయ‌స్ఆర్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు.
– పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాల ధ్వంసం హేయమైన చర్య. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంట్‌ సభ్యుడు మిథున్‌రెడ్డి. పుంగనూరులో మాజీ ఎంపీ ఇంటికి వెళ్లిన ఆయనపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేయడం, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం పిరికిపంద చర్య. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వరుసగా జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసం, కూల్చివేతల సంఘటనలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. గతంలో ఏనాడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు.
నెల రోజులుగా వరుసగా పసిపిల్లలపై అత్యాచారాలు జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం. నంద్యాల జిల్లా నందికొట్కూరు  ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారానికి గురై, హత్యకు గురైనా, ఇప్పటికీ ఆ బాలిక మృతదేహం కనుక్కోక పోవడం దారుణం. 

గురుమూర్తి. ఎంపీ (తిరుపతి).
– రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిపై దాడి అత్యంత హేయం. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏవిధమైన రక్షణ కల్పిస్తుంది. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏవిధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంçస్కృతిని ఇప్పుడు చూస్తున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి. అధికారం శాశ్వతం కాదు.

Back to Top