కూటమి నేతలు ‘సూపర్‌సిక్స్‌’ మరచిపోయారు

ఎంపీ మిథున్‌రెడ్డి

తిరుపతి: కూటమి నేతలు ప్రజాసమస్యలు గాలికి వదిలేసి డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారని వైయ‌స్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విమర్శించారు. అన్ని ఫైల్స్ ఆన్‌లైన్‌లో  ఉన్నా మదనపల్లి ఘటనలో తమపై తప్పుడు ప్రచారం  చేశారని మండిపడ్డారు.

ఇటీవల కూటమి నాయకుల కుట్రతో పార్టీ మారిన పుంగనూరు మున్సిపల్‌ చైర్మన్ అలీం బాష, కౌన్సిలర్లు తిరిగి సోమవారం(సెప్టెంబర్‌2) వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ‘డీజీపీని హెలికాప్టర్‌లో మదనపల్లికి పంపించారు. వరద సహాయక చర్యలకు ఎందుకు హెలికాప్టర్  పంపించ లేదు అని ప్రశ్నిస్తున్నా. 

ఎవరైనా పార్టీ మారక పోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్‌ను, కౌన్సిలర్‌లను బెదిరిస్తున్నారు. సూపర్ సిక్స్ అనే మాట ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు మరచిపోయారు. వారు కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. అభివృద్ధిపై దృష్టిపెట్టాలి’ అని మిథున్‌రెడ్డి సూచించారు. కొన్ని కారణాల వల్ల తాము రాజీనామా చేసి వెళ్ళామని, ఇప్పుడు తిరిగి వెనక్కి వచ్చామని మున్సిపల్‌ చైర్మన్‌ అలీంబాష తెలిపారు. పెద్దిరెడ్డి కుటుంబంతోనే తాము ఎల్లప్పుడూ ఉంటామని స్పష్టం చేశారు.

Back to Top