తిరువూరు: ఎన్నికల్లో గెల్చిన నాటి నుంచే తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు రాక్షసంగా వ్యవహరిస్తున్నారని, దౌర్జన్యం చేస్తున్నారని తిరువూరు వైయస్ఆర్సీపీ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ వెల్లడించారు. యథేచ్ఛగా దాడులు. ఆస్తుల విధ్వంసం చేస్తూ,వైయస్ఆర్సీపీ నాయకులు లక్ష్యంగా వేధిస్తున్నారని ఆయన తెలిపారు. ఏకంగా ప్రొక్లెయిన్లతోనే ఇళ్లపై దాడులు చేస్తున్న కొలకపూడి, చివరకు మీడియానూ వదలడం లేదని చెప్పారు. గురువారం స్వామిదాస్ మీడియాతో మాట్లాడారు. కూటమి 100 రోజుల పాలనపై, తమది మంచి ప్రభుత్వం అంటూ.. తిరువూరులో ఇంటింటా స్టిక్కర్లు వేస్తున్నారన్న స్వామిదాస్, అసలు ఇన్ని రోజుల్లో ఏ మంచి చేశారో చెప్పాలని, సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని నిలదీసిన ఆయన, ధైర్యం ఉంటే చెప్పాలని అన్నారు. చంద్రబాబు గురించి తనకు బాగా తెలుసని, ఆయన ఏనాడూ మాట నిలబెట్టుకోడని తెలిపారు. తిరువూరు నియోజకవర్గ చరిత్రలో కొలికపూడి శ్రీనివాసరావు లాంటి ఎమ్మెల్యే ఎవరూ లేరన్న స్వామిదాస్, ఆయన దాడులు, దౌర్జన్యాలు మితిమీరాయని, మీడియానూ బెదిరిస్తున్నారని వెల్లడించారు. ‘బట్టలూడదీసి ఇంటికొచ్చి కొడతాను’ అంటూ మీడియా ప్రతినిధులను బెదిరిస్తున్నాడని గుర్తు చేసిన ఆయన, ఇకనైనా ఎమ్మెల్యే తన భాష మార్చుకోవాలని, ఇలాంటి సంస్కృతి మంచిది కాదని హితవు చెప్పారు. అలాగే అధికారులు కూడా ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తే, వారు భవిష్యత్తులో ఇబ్బందుల్లో పడతారన్న స్వామిదాస్, చట్టవిరుద్దంగా వ్యవహరించే వారికి వత్తాసు పలకొద్దని సూచించారు.