కుటుంబ తగాదాలు రాజకీయం చేయొద్దు

ప్రజలు తరిమి తరిమి కొడతారు

చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ హెచ్చరిక

ప్రజల సంపదను ఎవరు దోచుకున్నారు?

దాచుకున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసు

రాష్ట్ర సంపదను వైయ‌స్ జగన్  పేదలకు పంచారు

అదే చంద్రబాబు తన కుటుంబీలుకు దోచిపెట్టారు

మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ వెల్లడి

నాలుగు నెలలుగా పాలన గాలికొదిలే«శారు

డైవర్షన్‌ పాలిటిక్స్‌తో కాలం వెళ్లదీస్తున్నారు

కూటమి ప్రభుత్వం.. ఫ్యామిలీ పాలన అయింది

ఇకనైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి

ప్రజలకు మంచి చేసే విషయం ఆలోచించండి

ప్రెస్‌మీట్‌లో చంద్రబాబుకు జూపూడి సూచన

ఒంగోలు: కుటుంబ తగాదాలు రాజకీయం చేయొద్దని, అలా చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్  సీఎం చంద్రబాబును హెచ్చరించారు. ప్రజల సంపదను ఎవరు దోచుకున్నారు?. దాచుకున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు. రాష్ట్ర సంపదను వైయ‌స్ జగన్‌గారు పేదలకు పంచగా, అదే చంద్రబాబు తన కుటుంబీలుకు దోచిపెట్టారని ఆక్షేపించారు. శుక్ర‌వారం ఒంగోలులో వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి జూపూడి ప్ర‌భాక‌ర్  మీడియాతో మాట్లాడారు.

    నాలుగు నెలలుగా పాలన గాలికొదిలేసి, ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌తో కాలం వెళ్లదీస్తున్నారని, కూటమి ప్రభుత్వం కాస్తా.. ఫ్యామిలీ పాలన అయిందని స్పష్టం చేశారు. ఇకనైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, ప్రజలకు మంచి చేసే విషయం ఆలోచించాలని సీఎం చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్సీ జూపూడి సూచించారు.
    వైయ‌స్ జగన్‌గారిని ఉద్దేశించి సీఎం చంద్రబాబు అన్న మాటలను ప్రస్తావించిన జూపూడి ప్రభాకర్‌.. ప్రజల సంపద దోచుకుని, పరిపాలనలో అడుగడుగునా వైఫల్యం చెందుతున్నందుకు చంద్రబాబు సిగ్గు పడాలని అన్నారు. ఎదురిళ్లు, పొరుగిళ్లలోకి తొంగి చూసి స్వార్థ రాజకీయాలు చేస్తున్నందుకు ఆయన సిగ్గుపడాలని.. అంతేతప్ప వైయ‌స్ జగన్‌గారితో రాజకీయాలు చేస్తున్నందుకు కాదని స్పష్టం చేశారు. 
    ఎక్కడా వివిక్ష, అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా పథకాలు అమలు చేస్తూ.. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా గత 5 ఏళ్లలో వైయ‌స్ జగన్‌గారు నిరుపేదల ఖాతాల్లో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారని గుర్తు చేశారు. అదే చంద్రబాబు, నాడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన రామోజీరావుకు 2 వేల ఎకరాల భూమిని కేవలం ఒక్క రూపాయికి కట్టబెట్టారని గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్సీ.. అది దోచుకోవడమా లేక, పేద ప్రజలకు అండగా నిలబడడాన్ని దోచుకోవడం అంటారా? అని నిలదీశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల నాటికి అన్ని ఇసుక స్టాక్‌ పాయింట్లలో 87 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేస్తే, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే దోపిడి మొదలుపెట్టిన అధికారపక్ష నాయకులు సగానికి పైగా ఇసుక దోచుకున్నారని తెలిపారు.
    పరిపాలన పూర్తిగా వదిలేసిన సీఎం చంద్రబాబు, ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ తెలిపారు. తొలుత రుషికొండపై ప్రభుత్వ నిర్మాణాలు, ఆ తర్వాత వరదల్లో బోట్లతో ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టి కూల్చే ప్రయత్నం చేశారని దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ పేరిట డ్రామాలు ఆడి ప్రజలు దృష్టి మరల్చాలని చూశారని విమర్శించారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆక్షేపించారు.
    రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో వివాదాలు, తగాదాలు ఉంటాయన్న మాజీ ఎమ్మెల్సీ.. వైయ‌స్ జగన్‌ కుటుంబంలో వివాదాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని గుర్తు చేశారు. తన భర్తను చంపేసి, ఆస్తిని కాజేశారన్న లక్ష్మీపార్వతికి, చంద్రబాబు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. అలాగే హైదరాబాద్‌లోని తన ఆస్తిని ఎన్ని వాటాలు చేశారని.. తమ్ముడు రామ్మోహన్‌నాయుడు, చెల్లెళ్లుకు ఎన్ని వాటాలు పంచారో చంద్రబాబు చెప్పాలని జూపూడి ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

Back to Top