గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఘటన ప్రభుత్వ వైఫల్యం

వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ ధ్వజం

గర్ల్స్‌ హాస్టల్‌లో హిడెన్‌ కెమెరా అత్యంత దారుణం

తీవ్ర ఆందోళనలో విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు

కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థ సర్వనాశనం

వెంటనే దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి

ప్రెస్‌మీట్‌లో శివశంకర్‌ స్పష్టీకరణ

తాడేపల్లి: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఘటన ప్రభుత్వ వైఫల్యం అని, కాలేజ్‌ గర్ల్స్‌ హాస్టల్‌ వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమెరాలు పెట్టడం అత్యంత దారుణమని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ ధ్వజమెత్తారు. దీని వల్ల తీవ్ర ఆందోళనలో విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు ఉన్నారన్న ఆయన, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థ సర్వనాశనం అయిందని చెప్పారు. వెంటనే దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్‌ చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద  పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మీడియాతో మాట్లాడారు.

    గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలో గత అర్ధరాత్రి (గురువారం) నుంచి 300 మంది విద్యార్ధినులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ ఆక్షేపించారు. వారం రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నా, దీనిపై విద్యార్థినిలు ఫిర్యాదు చేసినా కళాశాల యాజమాన్యం ఎందుకు తొక్కిపెట్టిందో చెప్పాలని కోరారు. అంతేకాక విషయం తెలియగానే  పోలీసులకు ఎందుకు చెప్పలేదని? ఒకవేళ చెప్పినా వారు స్పందించలేదా? అని ప్రశ్నించారు. విద్యార్థినిల హాస్టల్‌లో కనీస సెక్యూరిటీ లేకపోతే ఎలా అని నిలదీశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో జనసేన పోస్టర్‌లు ఉన్నాయని తెలిపారు.
    ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నామని ఒకవైపు ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు పోలీసులు ఇప్పటికే కేసు నిగ్గు తేల్చినట్లు మాట్లాడుతున్నారని, అక్కడ అలాంటిదేమి జరిగినట్లు ఆధారాలు లేవని చెబుతున్నారని శివశంకర్‌ గుర్తు చేశారు. 
    రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తర్వాత విద్యావ్యవస్ధ సర్వనాశనం అయిందని, నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో దాదాపు వెయ్యి మంది విద్యార్ధులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలైనా, ప్రభుత్వం పట్టించుకోలేదని శివశంకర్‌ ఆక్షేపించారు.

Back to Top