తాడేపల్లి: సింహాచలంలో స్వామి వారి నిజరూప దర్శనం కోసం వచ్చి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దేవాదాయ శాఖ అధికారుల అవినీతి కారణంగానే ఈ దారుణం జరిగిందని ఆమె ఆక్షేపించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలకు బదులు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. లక్ష్మీపార్వతి ఏం మాట్లాడారంటే..: చంద్రబాబుకి దేవుడంటే భక్తి లేదు: ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన రోజునే దేవుని మీద తనకు నమ్మకం లేదని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పాడు. ఇలాంటి వాడు కనుకనే ఆలయాలను భ్రష్టు పట్టిస్తున్నాడు. దేవుడంటే భయం, భక్తి లేదు కాబట్టే చంద్రబాబు నిర్భీతిగా విజయవాడలో 40 గుళ్లను కూలగొట్టాడు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి లోకేష్ కోసం విజయవాడ అమ్మవారి గుడిలో, శ్రీకాళహస్తిలో తాంత్రిక పూజలు చేయించింది. కోట్లాది మంది ప్రజలు పవిత్రంగా భావించే ఆలయాలను కలుషితం చేస్తున్నారు. దేవుడికే కలంకం తెచ్చేలా చేస్తున్న చర్యలను ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే అర్హత లేనివారు అందలాలు ఎక్కుతారో, ప్రజలంటే గౌరవం లేనివారు, అపవిత్రులు అధికారంలోకి వస్తారో అక్కడ సమాజంలో జరగకూడని దారుణాలు జరుగుతాయి. గౌరవించదగిన వ్యక్తులు ఎన్టీఆర్, వైయస్సార్, వైయస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. దేవుడు బలమైన సంకేతాలు పంపుతున్నాడు: వైయస్ జగన్ మతాలకు అతీతంగా ప్రజలకు సేవలందిస్తుంటే ఆయన మీద క్రిస్టియన్ ముద్ర వేసి అసత్య ప్రచారం చేశారు. హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి చంద్రబాబు చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. వైయస్సార్సీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయడానికి ఆలయాలను వాడుకున్నాడు. ఆఖరుకి ప్రతిపక్షంలోకి వచ్చినా వదిలిపెట్టకుండా వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా, రాజకీయంగా లేకుండా చేయాలనే కుట్రతో తిరుపతి లడ్డూను కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకున్నాడు. ఇంకా పవన్కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి లక్ష కల్తీ లడ్డూలను అయోధ్య రామ మందిరానికి పంపించారని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. వీరు ఆరోపణలు చేసినంత మాత్రాన భగవంతునికి మలినం అంటదు. వీరు చేస్తున్న నేరాలన్నీ చూస్తూనే ఉన్నాడు. వారి స్వార్థం కోసం తనను ఎలా వాడుకుంటున్నారో దేవుడే గ్రహించినట్టుగా కొన్ని బలమైన సంకేతాలు పంపిస్తున్నాడు. ఆ ఇద్దరూ వాటిని అర్థం చేసుకోకుండా దేవుడ్ని వాడుకుంటామంటే రాబోయే రోజుల్లో తీవ్రంగా నష్టపోతారు. ఆ ఇద్దరూ చీడపురుగులు: చంద్రబాబు, పవన్కళ్యాణ్.. ఇద్దరూ చేస్తున్న అపచారాలకు అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదైనా ఉంటే అపచారాలకు కారకులైన దుర్మార్గుల మీదనే చూపిస్తే పీడ విరగడ అవుతుంది. వీరిద్దరూ సమాజానికి పట్టిన చీడ పురుగులు. తిరుపతిలో తొక్కసలాట, పుష్కరాల్లో ఒకేసారి 29 మంది చనిపోవడం, తిరుపతిలో గోశాలలో వందల సంఖ్యలో గోవుల మరణాలు, శ్రీకూర్మంలో విష్ణుమూర్తి అవతారంగా భావించే నక్షత్ర తాబేళ్లు చనిపోవడం.. ఇలా వరుస ఘటనల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవడం లేదు. అది ప్రజల దురదృష్టకరం: చట్టాలంటే గౌరవం లేదు. దేవుడంటే భక్తి లేదన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు మొక్కుబడిగా, తూతూమంత్రంగా విచారణ జరిపి కింది స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేసేసి చేతులు దులిపేసుకుంటున్నారు. పదేపదే అబద్ధాలతో బతుకుతున్న చంద్రబాబుతో పాటు, ఆయన కొడుకు లోకేష్ను కూడా అదే దారిలో తీసుకెళ్తున్నాడు. నారా కుటుంబం వల్ల రాష్ట్రం సర్వనాశనం అవుతోంది. ప్రజల దురదృష్టం కొద్దీ నాలుగు సార్లు అడ్డదారిలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. పవన్ కళ్యాణ్ కూడా పగటి వేషాలు మానేసి తనను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేసే విధంగా ఆలోచించాలి. ప్రజల భద్రతంటే చంద్రబాబుకు పట్టదు. ఆయన వంటి వ్యక్తి అధికారంలో ఉన్నంతకాలం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. చంద్రబాబు మీటింగులు పెట్టినా ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండటం లేదు. కూటమి పాలనపై హిందువుల్లో వ్యతిరేకత: హిందువుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వీరు అడుగుపెట్టిన నాటి నుంచి హిందూ ధర్మం నాశనం అయ్యిందని చెబుతున్నారు. ధర్మాన్ని ఎవరూ కాపాడాల్సిన పనిలేదు. హిందూ ధర్మాన్ని ఎవరూ పరిరక్షించాల్సిన పనిలేదు. ధర్మం తనను తానే కాపాడుకుంటుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కరోజైనా మనుషుల్లా బతకడానికి ప్రయత్నించాలి. అలాగే పవన్కళ్యాణ్ సనాతన వేషాల్ని పక్కన పెట్టి మనిషి అనే మానవత్వంతో పనిచేయాలని నందమూరి లక్ష్మీపార్వతి సూచించారు.