బందరు పోర్టు కు వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకొంటోంది. భూ సేకరణ వద్దని వాదిస్తున్న రైతుల మీద పోలీసులు దాడులకు దిగుతున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.ప్రభుత్వం నిర్వహిస్తున్న మీ ఇంటికి.. మీ భూమి కార్యక్రమంలో బాగంగా రెవిన్యూ అధికారులు పోతేపల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడకు వచ్చిన రైతులు, తాము బందరు పోర్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని చెప్పారు. కానీ, బందరు పోర్టు పేరుతో అనుబంధ పరిశ్రమల కోసం అంటూ 25 వేల ఎకరాల భూమిని లాక్కొనే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నామని విన్నవించారు. భూములు లాగేసుకొంటే, కుటుంబంతో సహా తాము రోడ్డున పడాల్సి వస్తుందని వాపోయారు.ఈ లోగా కొందరు రైతులు నినాదాలు చేయటంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతుల్ని అక్కడ నుంచి దూరంగా ఈడ్చేశారు. దీంతో కొందరు రైతులు రెవిన్యూ అదికారుల వాహనాలకు అడ్డంగా నిలిచి నినాదాలు చేశారు. పోలీసులు మరింత దురుసుగా ప్రవర్తించారు. ఎక్కడికక్కడ రైతుల్ని దూరంగా తోసేశారు. పెద్ద సంఖ్యలో రైతుల్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.