తాడేపల్లి: రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ఎక్కడికక్కడ అంతులేని అవినీతి జరుగుతోందని, వాటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదని, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే కొనసాగుతోందని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో శ్రీ వైయస్ జగన్ గుర్తు చేశారు. వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే..: అవే మన పనితీరుకు గీటురాయి: ప్రజలకు అండగా పలు కార్యక్రమాలు చేయాలి. ఆ కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి దృష్టిని కూడా ఆకర్షిస్తాయి. ఇంకా వాటి ద్వారానే మీ పనితీరు కూడా బయట పడుతుంది. ఈ ప్రక్రియలో పార్టీ జిల్లా అధ్యక్షులది చాలా కీలక బాధ్యత. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిల్చేది ఎప్పుడైనా మనమే. ప్రతి సమస్యలోనూ మనం బాధితులకు తోడుగా ఉంటాం. తొలి నుంచి అలా నిలుస్తోంది, ఆ పని చేస్తోంది ఒక్క వైయస్ఆర్సీపీనే. చొరవతో ముందుకు కదలాలి: రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఆయన చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో మీ జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీదే. అందుకే ప్రజా సంబంధిత అంశాల్లో చొరవ చూపాలి. అంతేకానీ, ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్ఛార్జిని స్వయంగా కలవాలి. అలా వారితో కలిసి మొదట కదలాల్సిందే మీరే అన్న విషయం గుర్తుంచుకొండి. కమిటీలు. కచ్చితమైన లక్ష్యాలు: మే నెలాఖరులోపు పార్టీ మండల కమిటీలు ఏర్పాటు కావాలి. జూన్, జూలైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీల్లో డివిజన్ కమిటీలు పూర్తి చేయాలి. అలాగే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్ కమిటీలన్నీ ఏర్పాటవాలి. ఇదే లక్ష్యంగా మీరంతా పని చేయాలి. అలాగే పార్టీని జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ తీసుకువెళ్లే బాధ్యత మీకు కూడా ఉంది. ఆ దిశలోనే పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. పార్టీలో జిల్లా అధ్యక్షుల పాత్ర చాలా కీలకమైంది. గ్రామస్థాయి బూత్ కమిటీలు, ఇంకా గ్రామ కమిటీల ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. అందుకే పార్టీలో సమర్థులు ఎవరు? ప్రతిపక్షంలో ఎవరు లీడ్ చేయగలరు? అన్న ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మీరే పార్టీ.. పార్టీయే మీరు: మీమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషి చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది. పార్టీకి జిల్లాల్లో మీరే సర్వం. ‘మీరే పార్టీ.. పార్టీయే మీరు’. జిల్లాల్లో అన్ని స్థానాల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మేణా అదే తలంపుతో పార్టీని నడపాలి. జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించడంలో మీదే కీలక పాత్ర. దీని కోసం ఏం చేయాలన్న దానిపై వ్యూహంతో కదలండి. గట్టిగా పని చేయండి. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పరిస్థితి మారకపోతే, ప్రత్యామ్నాయం చూడాలి. అక్కడా మీ భాగస్వామ్యమే కీలకం. పార్టీలో ఎక్కడైనా ఇద్దరి మధ్య వివాదం తలెత్తితే, వారిని పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో 7కు ఏడు గెలిపించాల్సిన బాధ్యత మీది. అందుకే ఆ బాధ్యత, అధికారం రెండూ తీసుకోండి. మీరు సమర్థులు అని భావించి, మీకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ కమిటీ నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి. వాటి వల్లనే ఎలివేట్ అవుతాం: ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయట పడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్మన్ ప్రతిభ బయట పడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్మెన్ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇదికూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనుల వల్ల మనం ఎలివేట్ అవుతాం. ఇంకా ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ కూడా పెరుగుతుంది. మన పనితీరు వల్లే మనం మన్ననలను పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. అప్పుడే మీ జిల్లాల్లో ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలవగలుగుతాం. జిల్లాల్లో ఏం జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి. చురుగ్గా కార్యక్రమాలు చేయాలి. ప్రజా వ్యతిరేక అంశాల మీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే. అప్పుడే ప్రజలకు దగ్గరవుతాం: బాధితులకు మనం ఎప్పుడూ అండగా ఉండాలి. మనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాల కోసం పెట్టామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలి పెట్టకూడదు. జిల్లాస్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకు వస్తేనే ప్రజలకు దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి. ఏడాదిలోపే కూటమి ప్రభుత్వంపై..: మామూలుగా రెండు, మూడేళ్ళైతే కానీ ప్రభుత్వ వ్యతిరేకత బయటకు కనిపించదు. కాని ఏడాదిలోపే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తి చేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తిగా పని ఉంటుంది. అందరం కలిసికట్టుగా పార్టీపరంగా కార్యక్రమాలు బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అందుకే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. రైతులకు అండగా పోరాటం: ఈ ప్రక్రియలో గ్రామస్థాయిలో కూడా కమిటీలు, బూత్ కమిటీలు ఏర్పాటు అయితేనే మనం పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్లు అవుతుంది. ప్రతి జిల్లాల్లో పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12వేల మంది, మన పార్టీ కార్యక్రమాల కోసం మీకు అందుబాటులో ఉంటారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 1500 మంది ఉంటారు. ఇప్పుడు మద్దతు ధరలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే మనం రైతుల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు జిల్లాల్లో రైతులకు అండగా ఉండాలని, వారి డిమాండ్ల సాధనకు పోరాడాలని, పార్టీ జిల్లా అధ్యక్షులకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో వైయస్ఆర్సీపీ జిల్లాల అధ్యక్షులతో పాటు, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిధున్రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, జి.శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.