న్యూఢిల్లీ: తన తండ్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై దర్యాప్తు జరుగుతున్న విధానంగా సరిగా లేదని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసినట్టు ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి తెలిపారు. శుక్రవారం హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబాను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తన తండ్రి హత్యకు కారకులెవరో నిగ్గు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరినట్టు సునీతారెడ్డి మీడియాకు తెలిపారు. హైకోర్టులో ఇప్పటికే కేసు వేశారు కాబట్టి, హైకోర్టు నిర్ణయం వచ్చేంతవరకు వేచి చూడాలని తమకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి సూచించారని ఆమె వెల్లడించారు. తన తండ్రి హత్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నందున దర్యాప్తు సక్రమంగా జరిగేలా చూడాలంటూ అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆమె కోరారు. ఈ కేసులో తమ కుటుంబ సభ్యులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు.