తాడేపల్లి: గిట్టుబాటు ధరల్లేక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, వారిని తక్షణమే ఆదుకోవాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలకు సిద్దమయ్యారన్నారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రైతుల తరుపున మరోసారి వైయస్ఆర్సీపీ పోరాడి వారికి అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. లేళ్ళ అప్పిరెడ్డి ఇంకా ఏమన్నారంటే... రాష్ట్రంలో రైతాంగం భవిష్యత్ అయోమయంలో పడింది, రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, ధాన్యం, పత్తి, మినుములు, పొగాకు, మిర్చి ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతాంగం గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు గత నెలలో రైతాంగం సమస్యలపై గుంటూరు మిర్చి యార్డ్కు వెళ్ళి వారిని పరామర్శించారు, అప్పటివరకూ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదు, సీఎంగారు గుంటూరు జిల్లాలోనే ఉంటారు, వ్యవసాయ మంత్రి, మంత్రులు కూడా పట్టించుకోలేదు, కానీ వైయస్ జగన్ గారి పర్యటన తర్వాత హడావిడిగా మిర్చి రైతులను ఆదుకుంటామన్నారు, క్వింటాల్ రూ.11,781 కి కొనుగోలు చేస్తామని చెప్పి 60 రోజులవుతోంది, ఎక్కడైనా ఒక్క మిర్చి టిక్కీ కొనుగోలు చేశారా, అసలు కొనుగోలు విధివిధానాలు కూడా రిలీజ్ చేయలేదే...కానీ ఎల్లో మీడియాలో మాత్రం పుంఖానుపుంఖాలుగా రైతుల ఖాతాల్లో డబ్బులే డబ్బులని రాస్తున్నారు ఇవాళ గుంటూరులో రైతులంతా రోడ్లెక్కి గిట్టుబాటు ధర కోసం ధర్నాలు చేస్తున్నారు, ఉద్యమిస్తున్నారు. రైతు కంట కన్నీరు వస్తే ఆ రాష్ట్రం పరిస్ధితి తిరోగమనమే, రైతాంగం పట్ల ప్రభుత్వానికి ఎందుకు చిత్తశుద్ది లేదు, నాడు జగన్ గారు రూ. 3,000 కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే మీ కూటమి ప్రభుత్వం రూ. 300 కోట్లు కేటాయిస్తారా, ప్రభుత్వ యంత్రాంగం అంతా గుంటూరు జిల్లాలోనే ఉంది, గుంటూరు జిల్లాలో సుమారు 150 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో 4 లక్షల పైచిలుకు ఎకరాల్లో మిర్చి సాగు జరుగుతోంది, 2 లక్షలమందికి పైగా రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారు, వారి మనుగడపై ప్రభుత్వం దయచేసి ఆలోచించాలి. ప్రతి రోజూ యార్డ్కు లక్ష నుంచి 1.5 లక్షల టిక్కీలు యార్డ్కు వస్తున్నాయి, రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోదా, మేం రాజకీయాలు మాట్లాడడం లేదు, రైతుల ఇబ్బందులపై మిమ్మల్ని తట్టిలేపడమే మా కర్తవ్యం. గుంటూరు యార్డ్కు పక్క రాష్ట్రాల మిర్చి రైతులు సరుకు తెస్తున్నారు. రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలిచి వారిని తక్షణమే ఆదుకోవాలి, లేనిపక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి రైతుల పక్షాన నిలిచి వారి తరుపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తుంది. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు ఇక్కట్లే, గతంలో జగన్ గారు రైతులకు అండగా నిలిచి వారిని అన్ని విధాలుగా ఆదుకున్నారు. వైయస్ఆర్సీపీ విధానం రైతుకు అండగా నిలవడమేనని లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు.