అనంతపురం: తాడిపత్రికి చెందిన వైయస్ఆర్సీపీ మైనారిటీ నేత ఫయాజ్ బాషా కు భద్రత కల్పించాలని వైయస్ఆర్సీపీ నేతలు అనంతపురం ఎస్పీ జగదీష్ను కోరారు. ఈ మేరకు శనివారం వైయస్ఆర్ సీపీ నేతల బృందం జిల్లా ఎస్పీని కలి తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఇటీవల తాడిపత్రి లో మైనారిటీ నేత, వైయస్ఆర్సీపీ కౌన్సిలర్ ఫయాజ్ బాషా ఇంటిపై జేసీ వర్గీయుల దాడిని ఎస్పీ దృష్టి కి తీసుకెళ్లారు. బాధితుడు ఫయాజ్ బాషా ను తాడిపత్రి కి వెళ్లకుండా ఆంక్షలు విధించటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ పండుగ సమయంలో తాడిపత్రిలోని ఆయన ఇంటిలో ఉండనివ్వకుండా రెండు రోజుల క్రితం ఫయాజ్ బాషను పోలీసులు అనంతపురానికి తరలించారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. ఫయాజ్ కుటుంబానికి రక్షణ కల్పించాలని, తాడిపత్రిలో శాంతిభద్రతలు నెలకొల్పాలని, జేసీ ప్రభాకర్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు కోరారు. జిల్లాలో ఆటవిక పాలన: మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆటవిక పాలన సాగుతోందని వైయస్ఆర్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా విమర్శించారు. తాడిపత్రి లో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలు తీవ్రమయ్యాయని మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి... లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాడిపత్రి వైయస్ఆర్సీపీ కౌన్సిలర్ ఫయాజ్ బాషా ఇంటిపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దాడి చేస్తే.... వైయస్ఆర్సీపీ నేత ఫయాజ్ బాషాపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ఫయాజ్ బాషా తాడిపత్రి లో ఉండొద్దని ఆంక్షలు విధించటం సరికాదన్నారు. ఫయాజ్ బాషాకు భద్రత కల్పించి తాడిపత్రి పంపుతామని ఎస్పీ హామీ ఇచ్చారని అంజాద్బాషా తెలిపారు. ఎస్పీ ని కలిసిన వారిలో వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్, మాజీ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం, హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసుల్ అజమ్, మైనార్టీ విభాగం నాయకులు పాల్గొన్నారు.