తాడేపల్లి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి సృష్టించిన ప్రజా సంపదను చంద్రబాబు తన వాళ్లకు దోచిపెడుతున్నారని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మూడు పోర్టు పనులను నిలుపుదల చేసి చంద్రబాబు అమ్మకానికి పెట్టారని ధ్వజమెత్తారు. సందప సృష్టిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ..వైయస్ జగన్ హయాంలో సృష్టించిన సంపదను స్వప్రయోజనాల కోసం చంద్రబాబు తెగ నమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 50 శాతం పూర్తైన పోర్టు పనులకు మళ్లీ టెండర్లు పిలవడం ఎలా చూడాలని ప్రశ్నించారు. పెరుగుతున్న విద్యుత్ చార్జీలు ఒకపక్క, అలాగే నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలను అదుపు చేయలేక కూటమి సర్కార్ చేతులెత్తేసిందని విమర్శించారు. నయా పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచమని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు ఐదు నెలల్లోనే రూ.6072 కోట్ల భారం ప్రజలపై మోపనున్నారని పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పేర్ని నాని ఏమన్నారంటే.. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు ఇప్పటికే రూ.45 వేల కోట్లు అప్పు చేశారు. వైయస్ జగన్ సృష్టించిన ప్రజల సంపదను కూడా ఇవాళ తెగనమ్మే పరిస్థితి ఉంది. చంద్రబాబు తన సొంత మనుషులకు సంపద దోచిపెడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో వైయస్ జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తిగా, రాష్ట్ర సంపదగా మూడు కొత్త పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుడితే..రామయ్యపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను నిర్మించే పనులు చేపట్టారు. రామయ్యపట్నం పోర్టు రాష్ట్ర విభజన చట్టంలో పోర్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వమే చేయాలి. 2014లో ఇదే కూటమి ప్రభుత్వమే కదా రాష్ట్రంలో, కేంద్రంలో పాలించింది. రాష్ట్ర విభజన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి విభజించాయి కదా?. వైయస్ జగన్ రూ.3700 కోట్లతో రామయ్యపట్నం పోర్టులను శరవేగంగా ఒక బెర్త్ నిర్మాణం పూర్తి చేయించారు. కేంద్రం పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆలస్యమైంది. ఎన్నికల కోడ్ తరువాత ఇవాళ పర్మిషన్లు వచ్చాయి. అయినా ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. కార్యాకలాపాలు ప్రారంభించడం లేదు. మచిలీపట్నం పోర్టు చారిత్రాత్మక ప్రజల ఆకాంక్ష. ఇక్కడ పోర్టు నిర్మాణం చేయాలని కృష్ణా జిల్లా ప్రజలు అనేక సంవత్సరాలుగా ఆకాంక్షించారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో అన్ని రకాల అనుమతులతో టెండర్ల పిలిచారు. మహానేత మరణం తరువాత పనులు ఆగిపోయాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 22 గ్రామాలు ఖాళీ చేసి 33 వేల ఎకరాలు లాక్కున్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బందర్ పోర్టు నిర్మాణానికి రూ.5150 కోట్లతో పనులు ప్రారంభించారు. బెర్తుల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 46 శాతం పనులు పూర్తి అయ్యాయి. ఆర్థికంగా అత్యంత వెనుకబాటుతనానికి గురైన శ్రీకాకుళంలో మూలపేట పోర్టును వైయస్ జగన్ నిర్మాణ పనులు రూ.4500 కోట్లతో ప్రారంభించారు. ఈ పనులను కూడా చంద్రబాబు నిలుపుదల చేయించారు. ఇవాళ వైయస్ జగన్ సృష్టించిన సంపదను దోచుకునేందుకు చంద్రబాబు టెండర్లు పిలిచారు. మూడు పోర్టుల నిర్మాణాలను మూడు ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు తీసుకొని వైయస్ జగన్ నిర్మిస్తుంటే..చంద్రబాబు ప్రైవేట్కు ఇచ్చేందుకు టెండర్లు పిలిచారు. మూడు పోర్టులను అమ్మకానికి పెట్టిన చంద్రబాబు ఎలా సంపద సృష్టిస్తారు..వైయస్ జగన్ సృష్టించిన రాష్ట్ర సందనను చంద్రబాబు దోచుకునే దిశగా టెండర్లు పిలిచారు. ఎందుకు ఈ పోర్టులను ప్రైవేట్కు అప్పగిస్తున్నారు. ఇంత పాపానికి ఒడిగట్టడం తప్పుకదా? ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? . రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు కాలేజీలు అడ్మిషన్లకు సిద్ధంగా ఉంటే..మిగతా నిర్మాణంలో ఉన్న కాలేజీలను అమ్మకానికి పెట్టారు. వైయస్ జగన్ మాత్రం రాష్ట్ర ప్రజల ఆస్తిగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే ఇవాళ తెగ నమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఇదా సంపద సృష్టి అంటే..? ప్రజల ఆస్తులను అమ్మడంలో చంద్రబాబును మించిన వారు ఎవరు లేరు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన తరువాత 56 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్కు అమ్మేశారు. నిన్ననే విశాఖలో భూముల అమ్మకానికి పెట్టారు. రాష్ట్రంలో ఎక్కడక్కడ అమ్మకానికి ఉన్నవో వాటన్నింటినీ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ రాజకీయ ఆరోపణలు కావు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, ప్రజల సంపదను దొడ్డిదారిన చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టే దుస్థితికి వచ్చారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు, భూములు అమ్మకానికి పెట్టడం ఏంది? ఇవాళ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టే పరిస్థితిని ఎండగడుతాం. పోరాటం చేస్తాం. చంద్రబాబు చేస్తున్న పాపాలను వీధి వీధిన వివరిస్తాం. వైయస్ జగన్ సృష్టించిన సంపదను ఏ రకంగా కొల్లగొడుతున్నారో ప్రజలకు వివరిస్తాం. కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని పేర్ని నాని హెచ్చరించారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నేన్ని మాట్లాడారు. వైయస్ జగన్ బాదుడే బాదుడు అన్నారు. అన్ని రేట్లు పెరిగిపోతున్నాయని అన్నారు. ఐదేళ్లలో నయా పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచమని చంద్రబాబు ప్రచారంలో ఊకదంపుడు ఉపన్యాసం చేశారు. ఐదు నెలలు పూర్తి కాకుండానే రూ.6072 కోట్లు విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్ధమయ్యారు. సుప్రీం కోర్టు చెప్పినట్లు దగా కోరు మాటలు మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని మీ అనుకూల మీడియాలో రాయించండి. ఒకాయన పచ్చచొక్కా విప్పకుండా ఉంటారు. ఆయనేమో అప్పట్లో తోపుడు బండ్లపై ఇసుక పెట్టి అమ్మారు. ఇప్పుడు అలాగే అమ్మవచ్చు కదా?. వైయస్ జగన్ ప్రభుత్వంలో ఇసుక కొరత అంటూ గోల చేశారు. నిర్మాణ రంగంపై ఎన్ని మాటలు చెప్పారు. ఉచిత ఇసుక అన్నారు. ఏమాత్రం సిగ్గు లేకుండా మాట్లాడారు. ఇవాళ బంగారం ఇచ్చినా ఇసుక దొరకడం లేదు. ఇష్టారాజ్యంగా దోపిడికి పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే టెండర్లు వేసుకోవాలా?. ఇలాంటివి రాయడానికి ఒక వర్గం మీడియాకు చేతులు రావడం లేదు. ఈ బాదుడు ఎవరిది?. చంద్రబాబు, లోకేష్, పవన్, పురందేశ్వరి..ఇలా నలుగురు కలిసి బాదుడుతుంటే జనాలు అల్లాడుతున్నారు. ఇసుక ఉచితమంటారు..డబ్బులు పెట్టినా ఇవాళ దొరకడం లేదు. కిరాణా సరుకులు, నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. కాకినాడలో రేషన్బియ్యం దోపిడి అన్నారు. ఏమైంది. విద్యుత్ చార్జీలపై చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. వైయస్ జగన్ చేసిన అప్పుల వల్ల కరెంటు చార్జీలు పెంచుతున్నారట. ఎన్టీఆర్ను ఎలాగైతే అసత్యాలు, తప్పుడు మాటలతో కీర్తిని మసకబారించారో?. ఈ రోజుకూ అవి ఆపడం లేదు. ఇప్పటినా నిజాయితీగా రాజకీయం చేద్దామన్న ఆలోచన రావడం లేదు. 2014-2015లో చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసినప్పుడు రెండు విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఉండేవి. రెండు డిస్కమ్స్లో రూ. 6628 కోట్ల నష్టాల్లో ఉండేవి. రూ.22,892 కోట్లు నష్టానికి అప్పులను చంద్రబాబు నెట్టారు. వైయస్ జగన్ సీఎంగా ప్రమాణం చేసే నాటికి రూ.29,552 కోట్లు అప్పులు ఉన్నాయి. 23.88 శాతం అప్పులు పెరిగి చంద్రబాబు హయాంలో రూ.56,256 కోట్లకు అప్పులు పెరిగాయి. ఐదేళ్లలో అప్పులు, నష్టాలు లక్ష కోట్లకు చంద్రబాబు తీసుకెళ్తే.. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలపై మోపిన పాత అప్పుల భారం కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే. చంద్రబాబు కరెంటు చార్జీలు పెంచనని ఎన్నికల్లో చెప్పి, ఇవాళ రూ.6 వేల కోట్లు ప్రజలపై భారం మోపనున్నారు. అంటే ఇంకా నాలుగున్నరేళ్లలో ప్రజలపై ఎంతభారం మోపనున్నారు. విద్యుత్ సంస్థలు ఇబ్బందుల్లో ఉంటే కూటమి ప్రభుత్వమే భరించాలని కానీ ప్రజలపై భారం మోపడం ఎందుకు?. ఇదీ అబద్ధాల ప్రభుత్వం, దోపిడి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? ఆ రోజు చెత్త పన్ను అన్నారు..ఇవాళ మీ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? ఇవాళ చెత్త ఎత్తేవాడు లేడు. బండ్లు మూలనపడ్డాయి. చంద్రబాబును డిమాండు చేస్తున్నాం..నయా పైసా విద్యుత్ చార్జీలు పెంచనని చెప్పావు. విద్యుత్ చార్జీల పేరుతో రూ.6 వేల కోట్ల భారం మోపుతున్నావు. విద్యుత్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని వైయస్ఆర్సీపీ డిమాండు చేస్తోంది. అలాగే మూడు పోర్టులను ప్రభుత్వమే నిర్మాణం పూర్తి చేసి ప్రజల సంపదను ప్రజలకే చెందేలా చూడాలని, ఈ మూడు పోర్టులను అమ్మకుండా పనులను శరవేగంగా పూర్తి చేయాలని పేర్నినాని డిమాండు చేశారు సంపద సృష్టిస్తామన్న తప్పుడు చర్యలను పేర్ని నాని ఖండించారు.