పలాస: కూటమి ప్రభుత్వ నాలుగు నెలల పాలనలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిందని, మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని.. మరోవైపు పోలీసులు కూడా తమ బాధ్యతను విస్మరిస్తున్నారని వైయస్ఆర్సీపీ సీనియర్ నేతలు.. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. పోలీసులు ఇకనైనా మేల్కొని, చట్టబద్దంగా వ్యవహరించక పోతే చూస్తూ ఊర్కోబోమని వారు హెచ్చరించారు. పలాసలో మైనర్ బాలికలపై అత్యాచార ఘటనలపై ఫిర్యాదు కోసం పోలీస్స్టేషన్ వెళ్తే, అక్కడ టీడీపీ నాయకులు వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేశారని, చోద్యం చూసిన పోలీసులు కనీసం వారిని అడ్డుకోలేదని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. పైగా తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆక్షేపించిన ఆయన, వారు ఒకవేళ అధికార పార్టీ తొత్తులుగా ఉండాలనుకుంటే, వెంటనే యూనిఫామ్ తీసేసి, టీడీపీలో చేరాలని తేల్చి చెప్పారు. పలాస పోలీసులు తమ వైఖరి మార్చుకోకపోతే, పోలీస్ స్టేషన్కు పసుపు రంగు వేస్తామని, అక్కడ కేవలం టీడీపీ నాయకులకు మాత్రమే అనుమతి అని బోర్డు కూడా పెడతామని వెల్లడించారు. పలాస స్టేషన్లోనే తమ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేస్తే, పోలీసులు కనీస చర్యలు ఎందుకు తీసుకోలేదో జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. వీటన్నింటినీ ప్రశ్నిస్తే తన ఇంటి చుట్టూ 50 మంది పోలీసులను కాపలా పెట్టి, తనను గృహ నిర్భంధం చేశారని తెలిపారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సభ్యత, సంస్కారం లేని రాజకీయాలు చేస్తున్నారని, బాలికలపై అత్యాచార నిందితులను తన కార్యాలయానికి రప్పించుకుని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. తాను పశు సంవర్థక శాఖ మంత్రిగా పని చేస్తే.. తనను పశువుల మంత్రి అని సంబోధిస్తు్తన్నారన్న డాక్టర్ సీదిరి అప్పలరాజు.. ఇప్పటి ప్రభుత్వంలో ఆ పదవిలో ఉన్న అచ్చెన్నాయుడు కూడా పశువుల మంత్రేనా? అని ప్రశ్నించారు. పోలీసులు మేల్కొని ఇకనైనా కేసుల విషయంలో పునరాలోచన చేయాలని, టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన తమ కార్యకర్తలను పరామర్శించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. వాటాలు, కమిషన్ల కక్కుర్తితో నిర్మాణంలో ఉన్న మూడు పోర్టులను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్నారన్న డాక్టర్ సీదిరి అప్పలరాజు, అది అత్యంత దారుణమని అభివర్ణించారు. మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం పోర్టుల ప్రైవేటీకరణ కోసం నియమ, నిబంధనలు మార్చారని ఆయన దుయ్యబట్టారు. ‘చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ జరగాలి అన్నట్లు.. ఇప్పటికే జరుగుతున్న పోర్టు పనులను మంత్రి అచ్చెన్నాయుడు మళ్లీ ప్రారంభిస్తారట’.. అని ఎద్దేవా చేశారు. మూలపేట పోర్టు కోసం జిల్లా రైతులు భూములిచ్చి త్యాగం చేస్తే, దాన్ని అమ్మేయాలన్న నిర్ణయం సరికాదని.. హార్బర్లు, పోర్టుల జోలికొస్తే మత్స్యకారులంతా రోడ్డ మీదకు వస్తారని డాక్టర్ సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను ఎంత వేధించినా సరే, భయపడేది లేదని.. తిరిగి లేచి నిలబడి పోరాడతామని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలీసులు తమ వైఖరి, విధానాలను మార్చుకోకపోతే, ఒక్క పలాస పీఎస్ మాత్రమే కాకుండా.. జిల్లాలోని అన్ని పీఎస్లకు పసుపు రంగు వేస్తామని ఆయన ప్రకటించారు. బాధితుల పక్షాన వినతిపత్రం ఇస్తామంటే కలెక్టర్, ఎస్పీ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అలా ఎంత కాలం సాగదీస్తారని నిలదీశారు. బాధితుల పరామర్శకు వెంటనే అనుమతి ఇవ్వాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మాజీ స్పీకర్ హెచ్చరించారు.