తాడేపల్లి: కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం పట్ల సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతికి గురయ్యారు. ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ట్వీట్ చేశారు. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది. ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నామని ట్వీట్లో సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. చిక్కబళ్లాపుర్లో ఆగి ఉన్న ట్యాంకర్ను టాటా సుమో వాహనం ఢీకొట్టగా.. 12 మంది మరణించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పొగ మంచు వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతులంతా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కూలీ పనుల కోసం బెంగళూరు వెళ్తుండగా ఘటన జరిగింది.