కర్నూలు: అవినీతికి పాల్పడి అరెస్టయిన చంద్రబాబుకు సానుభూతి వచ్చేలా టీడీపీ నేతలు సరికొత్త నాటకానికి తెరలేపారని కర్నూలు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేయర్ బి.వై. రామయ్య ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన అవినీతి కుంభకోణాలు మెల్లగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. బాబు చేసిన కుంభకోణాలు ప్రజలకు అర్థమవుతున్నాయని, దిక్కుతోచని స్థితిలో టీడీపీ నాయకులు నయా నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. శనివారం కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో బీ.వై. రామయ్య విలేకరులతో మాట్లాడారు. జైలులో చంద్రబాబుకు మాన్యువల్లోని నిబంధనల ప్రకారం వీఐపీ ఖైదీకి కల్పించాల్సిన వసతులన్నీ కల్పిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆయన ఆరోగ్యం, వసతులపై టీడీపీ కుట్రపూరితంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జైళ్ల శాఖ అధికారుల వివరణతో అది దుష్ప్రచారం అని తేటతెల్లం అయిందని, దీంతో టీడీపీ నేతల, ఎల్లో మీడియా సానుభూతి ఎత్తుగడ బెడిసికొట్టిందన్నారు. దోచుకున్న కోట్ల రూపాయల ప్రజాధనంతో రాష్ట్రానికి దేశంలోనే పేరుమోసిన న్యాయవాదులను తీసుకొచ్చినా ప్రయోజనం శూన్యమని దుయ్యబట్టారు. తప్పు చేయకుంటే అరెస్టు చేసే ఉద్దేశం ఎవరికి లేదన్నారు. చంద్రబాబును అవినీతి కేసుల్లో నుంచి కాపాడుకోవడానికి టీడీపీని ఎవరి కాళ్ళ దగ్గరైనా తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యే లోకేష్ ఢిల్లీ తిరుగుతున్నారని ఆరోపించారు.