విశాఖపట్నం: ప్రజలు కరోనా బారిన పడకుండా వ్యక్తిగతంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. కోవిడ్–19 విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అతిగా భయపడొద్దని, అలా అని అజాగ్రత్తగా కూడా ఉండొద్దన్నారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైల్వే, బస్సు స్టేషన్లలో స్కీనింగ్ నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పాడేరు, అరుకులో ఐసోలేషన్ వార్డులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. అంతేగాక ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఇక కరోనా వైరస్ నిర్ధారించే యంత్రం కేజీహెచ్ను త్వరలో ఏర్పాటు చేయనున్నామన్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.