విశాఖపట్నం: కేసీఆర్ను, హరీష్ రావును, టీఆర్ఎస్ను చూసి నేర్చుకోవాల్సిన దుస్థితి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. హరీష్ రావు కేసీఆర్ మనిషా.? లేక రామోజీరావు మనిషా.? అని ప్రశ్నించారు. హరీష్ రావుకు ఆయన మేనమామతో ఏమైనా గొడవులు ఉంటే.. నేరుగా ఆయన్ను తిట్టాలని ఉంటే ఆయనే తిట్టవచ్చు కదా.. మమ్మల్ని ఏదైనా అంటే, మేము వాళ్ల మామ, అక్కడ ముఖ్యమంత్రిని తిడితే ఆయన ఆనందపడలానా..?. కేసీఆర్ ను మా చేత తిట్టించాలనే విధంగా హరీష్ రావు తీరు కనిపిస్తోందన్నారు. కేసీఆర్కు, హరీష్ రావుకు మధ్య ఏమైనా గొడవలు ఉంటే వాళ్లూవాళ్లూ చూసుకోవాలి.. అంతేకానీ మా రాష్ట్రం మీద ఎందుకు పడతారు?. మమ్మల్ని తిడితే మీకు అక్కడ ఏమైనా మార్కులు పడతాయా? అని ప్రశ్నించారు. విశాఖలో మంత్రి అమర్నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్రావు వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ నగరం వారికి ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుందన్నారు. ఆ రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు బాగున్న క్రమంలో.. ఆ రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో గవర్నమెంట్ అధికారులను ఏ రకంగా ట్రీట్ చేశారో ప్రజలంతా చూశారన్నారు. నోటికొచ్చిన తిట్లు తిట్టి, బూటు కాళ్లతో తన్నిన సందర్భాలూ చూశామన్నారు. హరీష్ రావు ఒక అధికారిని బూటు కాలుతో తన్నారని, అటువంటి వ్యక్తి మాకు నీతులు చెబుతారా..? అని ప్రశ్నించారు. మామ, అల్లుళ్లకు ఏమైనా తగువులు ఉంటే వారూవారు చూసుకోవాలని, ఆంధ్రరాష్ట్రానికి నీతులు చెప్పే అవసరం కానీ, సూచనలు ఇచ్చే అర్హత కానీ ఆ ప్రాంతంలో ఉన్న నాయకులకు, ఆ పార్టీకి, ఆ ప్రాంత మంత్రులకు, ముఖ్యమంత్రికి లేవని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.