తిరుపతి: కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ..మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ ప్రజలు ఉద్యమ బాట పట్టారు. తిరుపతిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శనలో పెద్ద ఎత్తున విద్యార్థులు,యువకులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని నినదించారు. మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గుండె చప్పుడు వినిపిస్తూ మహా ప్రదర్శన చేపట్టడంతో తిరుపతినగరం జనసంద్రంగా మారింది. స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద నుంచి ప్రారంభమైన మహా ప్రదర్శన.. గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు మీదుగా నగర పాలక సంస్థ కార్యాలయం వరకు వేలాదిమందితో కొనసాగుతోంది. తిరుపతి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. రాయలసీమకు బాబు చేసిందేమీ లేదు. రాయలసీమను రతనాలసీమగా మార్చే సత్తా సీఎం వైయస్ జగన్కే ఉందంటూ ఉద్ఘాటించారు. కర్నూలును న్యాయరాజధాని చేయడం ద్వారా మరింత ప్రగతి సాధించవచ్చు. మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారు. వికేంద్రీకరణతోనే అని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే భూమన పేర్కొన్నారు. చంద్రబాబు గుండెల్లో నిద్రపోయేలా తిరుపతి సీమ ఆత్మ గౌరవ సభ జరిగిందన్నారు భూమన.. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తిరుపతి ప్రజలవాణి సీమ ఆత్మ గౌరవ సభ వినిపించిందన్నారు.. ఈ గడ్డపై పుట్టిన చంద్రబాబు సీమకు అన్యాయం చేశారని ఆరోపించిన ఆయన.. సొంత మామకు.. గద్దెను ఎక్కించిన సీమకు ఆయన వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.. పోతిరెడ్డిపాడుకు పెంచిన కృష్ణాజలాలు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు.. అమరావతి రాజధాని కావాలని జగన్ సమర్ధించలేదు.. అందుకే రాజధాని శంకుస్థాపనకు దూరంగా ఉన్నారని తెలిపారు.. అయితే, శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుకు కట్టుబడి ఉంటానని ఆనాడే వైఎస్ జగన్ చెప్పారని గుర్తుచేశారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి..