రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది

పోలీస్ యంత్రాంగాన్ని కక్షసాధింపులకు వాడుకుంటున్నారు

తప్పుడు కేసులతో వల్లభనేని వంశీపై వేధింపులు

వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ ఆగ్రహం

తాడేపల్లి:  ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పాలన సాగుతోందని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ మండిపడ్డారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై రాజకీయ కక్షసాధింపులకే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికార దుర్వినియోగంతో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ మీడియాతో మాట్లాడారు.

ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించేందుకే..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంతోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమ కేసులో ఇరికించి పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల కిందట సత్యవర్థన్ ఎస్సీ, ఎస్టీ జడ్జీ ముందు హాజరై తనతో బలవంతంగా పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో వల్లభనేని వంశీ పేరును చెప్పించి ఫిర్యాదు చేయించారంటూ వాగ్మూలం ఇచ్చారు. దీనితో ఈ కేసు పూర్తిగా నీరుగారింది. వెంటనే సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కక్షపూరితంగా సత్యవర్థన్ ఇంటికి టీడీపీ నేతలను పంపి ఆయన కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేసి వారితో మళ్ళీ వల్లభనేని వంశీపై  ఫిర్యాదు చేయించారు. ఇటువంటి దుర్మార్గమైన విధానాలకు ప్రభుత్వంలోని పెద్దలే పాల్పడుతుంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం జరుగుతుందా? ఎన్నికల వాగ్ధానాలను ప్రజలు ప్ర‌శ్నిస్తార‌నే భయంతో ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఈ రకమైన తప్పుడు కేసులను బనాయిస్తున్నారు. దీనికి వల్లభనేని వంశీపై బనాయించిన కేసే ఒక నిదర్శనం. 

కూటమి ప్రభుత్వంలో నిత్యం అరాచకాలే: 
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇదే తరహాలో దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు బనాయించడం, వేధించడం, బెదిరించడం తోనే కాలం గడుపుతోంది. వైయస్ఆర్ సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి సొంత నియోజకవర్గాల్లోనే వారిపై టీడీపీ నేతలు దాడులుకు తెగబడినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. మాజీ ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలను వారి నియోజకవర్గాల్లోకే రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. అనేక మంది వైయస్ఆర్ సీపీ నేతలు దాడుల కారణంగా గ్రామాలను వదిలి పెట్టారు. మాజీ ఎంపీ నందిగామ సురేష్ పై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారు. మాజీ మంత్రి రజనీ, అంబటి రాంబాబు, పేర్ని నానిలపై తప్పుడు కేసులు పెట్టి కక్షసాధింపులకు పాల్పడ్డారు. ఇటీవల మున్సిపల్ ఉప ఎన్నికల్లో మెజార్టీ లేకపోయినా దాడులు, కిడ్నాప్ లతో భయబ్రాంతులకు గురి చేసి మరీ పదవులు దక్కించుకున్నారు. అనేక ఆరోపణలు ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు వంటి మాజీ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వంలో పదవులు ఇచ్చి, వారి కనుసన్నల్లో అక్రమ కేసులకు పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. తెలుగుదేశం అవలంభిస్తున్న ఈ అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారు. తగిన గుణపాఠం తప్పక నేర్పుతార‌ని ర‌వికుమార్ హెచ్చ‌రించారు.

Back to Top