తాడేపల్లి: ప్రతీ నియోజకవర్గంలోనూ వైయస్ఆర్సీపీ కమిటీలు వెంటనే పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ఇతర ముఖ్యనేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రస్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకూ కమిటీల నియామకంలో ఏ మాత్రం జాప్యం జరగడానికి వీల్లేదు. ఈ విషయంలో మన అధినేత వైయస్ జగన్ ఇప్పటికే స్పష్టమైన దిశానిర్ధేశం చేశారు, కమిటీల నియామకానికి సంబంధించి ఏమైనా సహాయం కావాలంటే పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్లు అందుబాటులో ఉంటారన్నారు. అన్ని జిల్లాల అధ్యక్షులు ఈ విషయంలో సీరియస్ గా దృష్టిపెట్టాలన్నారు. కమిటీల నియామకం పూర్తయితే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా మంచి స్పందన వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, పార్టీకి సంబంధించి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం సమిష్టిగా పనిచేసి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అధినేత వైయస్ జగన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారన్నారు.