తాడేపల్లి: వైయస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పవన్ తాను ఏం చేస్తానో కూడా చెప్పలేకపోతున్నారని, చంద్రబాబు ఏజెంట్గా పని చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో 50 లక్షల మంది సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నారు. కోటి మందికి పైగా డ్రాక్వా మహిళలకు రూ.26 వేల కోట్లు వైయస్ఆర్ ఆసరా ద్వారా లబ్ధి పొందారు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు 40 లక్షల మందికి వైయస్ఆర్ చేయూత ఇస్తున్నారు. 30 లక్షల మంది మహిళలకు అమ్మ ఒడి ఇస్తున్నారు. మూడున్నరేళ్లలో 62 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నారు. వీరంతా వైయస్ జగన్ ఇచ్చేది మాకొద్దు అంటే అప్పుడు ఆలోచన చేయాలి. వైయస్ జగన్ ఏ సభకు వెళ్లినా కూడా దేవుడి దయ, మీ చల్లని దీవెనలు కావాలని, మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతిపక్ష నేత మాత్రం అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. వైయస్ జగన్ను మళ్లీ అధికారంలోకి రానివ్వం, ఓట్లు చీలనీవ్వమని అంటున్నారు. వీరి మాటలు అర్థం చేసుకోండి. ఎన్నికల ఫలితాలను ప్రజలు నిర్ణయిస్తారు అన్న స్పృహ పవన్ కల్యాణ్కు లేదని ఎద్దేవా చేశారు.. వైయస్ జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసేది పవన్, చంద్రబాబు కాదు.. లబ్దిదారులైన రైతులు, వృద్ధులు, మహిళలు, డ్వాక్రా మహిళలు వద్దనుకుంటే అప్పుడు వైయస్ జగన్ అధికారంలోకి రాకుండా ఆపగలుగుతారన్నారు.. వైయస్ జగన్ కుడా నేను చేసిన సేవ బాగుంటేనే ఓటు వేయమని అడుగుతున్నారు.. ఒక్కోసారి పవన్ ఒక్కోలాగా మాట్లాడతారు.. కానీ, టీడీపీని మాత్రం ఎప్పుడూ ఒక్క మాట అనరు అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా? అని అడుగుతున్నారు.. లక్షకు పైగా సచివాలయ ఉద్యోగాలు, వైద్య ఆరోగ్య శాఖ లో 40 వేల ఉద్యోగాలు పవన్కు కనిపించటం లేదా?.. అపరిపక్వత, మూర్ఖత్వం, అజ్ఞానంతో పవన్ మాట్లాడుతున్నారు.. పవన్ ఎవరి తరపున మాట్లాడుతున్నారో అర్థం అవుతుంది.. చంద్రబాబు తరపున మాట్లాడుతున్నట్లు పవన్ కల్యాణ్ ధైర్యంగా చెప్పాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును పవన్ కల్యాణ్ పల్లెత్తు మాట అనడం లేదు.. సినిమా అభిమానులతో చప్పట్లు కొట్టించుకునేందుకు పవన్ ఏదేదో మాట్లాడుతున్నారు. పవన్.. చంద్రబాబు ఏజెంటు.. చంద్రబాబు తయారు చేసిన స్క్రిప్టు పవన్ చదువుతున్నారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా సీఎం సాయం అందిస్తున్నారని స్పష్టం చేశారు. ఇక, రాష్ట్రంలో పాల్ రావచ్చు.. పవన్ కల్యాణ్ రావొచ్చు.. ఎవరైనా పోటీ చేయవచ్చు. అవినీతికి హాలిడే ఇచ్చారని పవన్ కల్యాణ్ పంచ్ డైలాగ్ లు మాట్లాడుతున్నారు.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను పవన్ చూసి ఇలా మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. 7 హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న బ్రహ్మా రెడ్డిని చంద్రబాబు ఎందుకు మాచర్లలో తెచ్చిపెట్టారు? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మాచర్లలో దాడులను చంద్రబాబు రెచ్చగొట్టి చేయించారు.. పిన్నెల్లి కుటుంబం రెండు దశాబ్దాలుగా రాజకీయంగా ఉన్నా ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు లేవన్న ఆయన.. మాచర్ల చంబల్ లోయ అయిందని ప్రచారం చేయడం సరైంది కాదన్నారు.. వైయస్ఆర్ సీపీ కార్యకర్తలే తగుల బెట్టారని ఎలా అనుకుంటారు? నిజాలు విచారణలో తేలుతాయని స్పష్టం చేశారు. అసలు పిన్నెల్లి ఆ రోజు సీఎంవోలోనే ఉన్నారు.. గడప గడపకు కార్యక్రమం వర్క్షాపులో ఉన్నారని పేర్కొన్నారు. మాచర్లలో గొడవలను టీడీపీ వారే రెచ్చగొట్టారని సజ్జల పేర్కొన్నారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలే ప్రధాన లబ్దిదారులుగా సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.. టీడీపీ హయాంలో ట్రైబల్ కమిటీ కూడా వేయలేదని విమర్శించిన ఆయన.. దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉన్న పథకాలు రద్దు చేసే ఉండొచ్చు అన్నారు. ప్రభుత్వంలో ప్రొవిజన్ ఉంది కాబట్టే వైయస్ఆర్సీపీ కార్యాలయానికి ప్రభుత్వ భూములు కేటాయించారని క్లారిటీ ఇచ్చారు. పార్టీ కార్యాలయానికి ఆర్టీసీ స్థలం తీసుకుంటే అవసరమైతే ఆర్టీసికి పరిహారం ఇవ్వవచ్చా అనేది చూస్తామన్న ఆయన.. ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు.. పెండింగ్ లో ఉన్న సమస్యలనూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం.. ఉద్యోగులు, నేతలు ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.