నెల్లూరు: విషయ పరిజ్ఞానం లేకుండా విచిత్ర, వింత వార్తలు రాస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. వృద్ధి రేటుకు సాగు విస్తీర్ణం ఒక్కటే ప్రామాణికమా? కనీసం ఈ పరిజ్ఞానం కూడా నీకు లేదా రామోజీ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నీవు పేపర్ నడుపుతున్నావా? అని నిలదీశారు. ప్రభుత్వంపై నిత్యం బురద చల్లడమే మీ ధ్యేయమా అని ప్రశ్నించారు. వార్త రాసిన విలేకరికి, రాయించిన రామోజీకి నా జోహార్ అంటూ ధ్వజమెత్తారు. నెల్లూరు క్యాంప్ ఆఫీస్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. వారికి నా జోహార్: – వాస్తవాలు లేకపోయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాయడం పచ్చ మీడియాకు రెగ్యులర్ పనిగా మారింది. – సాగు తగ్గితే వృద్ధి పెరుగుతుందా? అని ఈనాడు పత్రికలో ఒక వార్త రాశారు. – ఆ వార్త రాయించిన రామోజీరావుకు, వార్త రాసిన విలేకరికి నా జోహార్. – కనీస విలువలు, విషయ పరిజ్ఞానం లేకుండా ఏమిటా వార్తలు? – వృద్ధి రేటు పెరుగుదల, తరుగుదల అనేది సాగు విస్తీర్ణంపైనే ఆధారపడి ఉండవు. – సాగు విస్తీర్ణంతో పాటు అనేక అంశాలపై వృద్ధి రేటు ఆధారపడి ఉంటుంది. – అలాగే ఉత్పత్తి అంటే కూడా అనేక అంశాలుంటాయి. రేటు, దిగుబడి, అంతర్ పంటలు, మంచి వ్యవసాయ పద్దతులు కలిపితే ఉత్పత్తి వస్తుంది. – వ్యవసాయం అంటే సాగు విస్తీర్ణం ఒక్కటే కాదు. మత్స్య సంపద, అటవీ, పశుగణాభివృద్ధి వంటి అనేక అంశాలుంటాయి. – కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా మీరు ఓ పత్రిక నడపడం హాస్యాస్పదం. వాస్తవ వృద్ధి రేటు: – 2022–23కి సంబంధించి రాష్ట్రంలో వ్యవసాయ రంగం, అనుబంధ రంగాల్లో 13.18 శాతం వృద్ధి రేటు నమోదైంది. – అదే సమయంలో జాతీయ స్థాయిలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు కేవలం 11.20 శాతం. – అంటే జాతీయ సరాసరి కంటే రాష్ట్రంలో వృద్ధి రేటు 2 శాతం ఎక్కువ. – దీనికి కారణం దిగుబడులు పెరిగాయి. విలువ ఆధారిత ఉత్పత్తులు పెరిగాయి. ధరలూ పెరిగాయి. ఆనాడు గుర్తుకు రాలేదా రామోజీ?: – చంద్రబాబు హయాంలో రామోజీరావుకు ఇవన్నీ గుర్తుకు రావు. – చంద్రబాబు సక్రమంగా సాగు నీరు అందించని కారణంగా పంటలు ఎండిపోయి వృద్ధి రేటు పడిపోయింది. – కానీ అవేవీ ఆనాడు రామోజీరావుకు కనిపించలేదు. ఇప్పుడు ఆయనకు అవి అసలు గుర్తు కూడా లేవు. – ఆనాడు చంద్రబాబు నిర్వాకంపై వార్తలు ఎందుకు రాయలేదో రామోజీ సమాధానం చెప్పాలి. అప్పటి కంటే ఇప్పుడన్నీ ఎక్కువే: – చంద్రబాబు హయాంలో కన్నా ఇప్పుడు వృద్ధి రేటు పెరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరిగింది. – ఆనాడు చంద్రబాబు హయాంలో సగటు ఆహార ధాన్యాల ఉత్పత్తి 153 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. 2019–22 మధ్య సగటు ఆహార ధాన్యాల ఉత్పత్తి 166 లక్షల మెట్రిక్ టన్నులు. – బిందు సేద్యం కింద 4.75 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి తీసుకొచ్చాం – బొప్పాయి, ఆయిల్ పామ్, టమోటా, కొబ్బరి ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉంది – కమలాలు, వంకాయలు, మిరప, అరటి ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉంది. – మామిడి, ఉల్లి, జీడిమామిడి ఉత్పత్తిలో రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. – అలాగే పశుగణాభివృద్ధిలో రాష్ట్రంలో 7.32 శాతం వృద్ధి రేటు నమోదైంది. – దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి 5 గుడ్లలో 1 గుడ్డు మన రాష్ట్రానిదే. – 1.13 వృద్ధి రేటుతో 2,674 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తితో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. – మాంసం ఉత్పత్తిలో రెండో స్థానం, పాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో నిల్చాం. – వీటన్నిటినీ వక్రీకరిస్తూ రామోజీ రకరకాల కథనాలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. అడుగడుగునా రైతులకు అండగా: – నీటి యాజమాన్య పద్ధతులపై శిక్షణ తరగతులతో పాటు, పొలం బడి వంటి కార్యక్రమాల ద్వారా రైతులను విద్యావంతులను చేస్తున్నాం. – రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా విత్తనం మొదలు పంటల అమ్మకం వరకు ప్రతి అడుగులో రైతులకు అండగా నిలుస్తున్నాం. – 10,778 ఆర్బీకేల ద్వారా 62.12 లక్షల మంది రైతులకు విత్తనాలు అందించాం. – 22.39 లక్షల మంది రైతులకు 8.43 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేశాం. – అంతర్ పంటలను ప్రోత్సహిస్తున్నాం. ఆయిల్ పామ్ సాగులో కోకో పంటను అంతర్ పంటగా వేయిస్తున్నాం. – రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా–పీఎం కిసాన్ కింద రూ.27 వేల కోట్ల సాయం చేశాం. – ఉచిత పంటల బీమా కింద రూ.6,684 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1912 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణాల కింద రూ. 1442 కోట్లు ఇచ్చాం – రైతుల అవసరాలను ముందుగానే గుర్తించి, అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. అదే వారి దుష్ట ఉద్దేశం: – వర్షాభావ పరిస్థితి ఉన్నా కరువు మండలాలను గుర్తించ లేదని రాస్తున్నారు. – నిజానికి ఆనాడు చంద్రబాబు హయాంలో 1623 కరవు మండలాలు ప్రకటించారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ పరిస్థితి రాలేదు. అందుకే ఒక్క కరవు మండలాన్ని ప్రకటించలేదు. – అసలు ఏ ప్రాతిపదికన కరువు మండలాలు ప్రకటిస్తారు రామోజీ?. – 21 రోజులు వర్షం లేకపోతే ఇక అది కరువు ప్రాంతమేనా?. – రిజర్వాయర్లలో నీరు, భూగర్భ జలాలు, భూమిలో తేమ ఉందా? లేదా? అనే అంశాలను పరిగణలోకి తీసుకోరా?. – కనీస విషయ పరిజ్ఞానం లేకుండా.. ఎంత సేపు వర్షాభావ పరిస్థితి వచ్చింది కాబట్టి కరువు మండలాలు ప్రకటించ లేదంటారు. – అంటే ఈ రాష్ట్రానికి కరవు రావాలి. కరవుతో రైతులు విలవిల్లాడాలి. అదే వారి దుష్ట ఉద్దేశం. కోతికి కొబ్బరి చిప్పలా!: – కోతికి కొబ్బరి చిప్పలా చంద్రబాబుకు టిడ్కో ఇళ్లు కనిపించాయి. అందుకే వాటి దగ్గర నిలబడి సెల్ఫీ తీసుకున్నాడు. – తన ఐదేళ్ల పాలనలో చేసింది ఒక్కటి కూడా చెప్పుకోవడానికి లేక, టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ తీసుకున్నావా?. – ఎవరైనా చూస్తే ముఖాన ఉమ్మేస్తారనే సిగ్గన్నా ఉండాలి కదా? మనం చేయలేక పోయాం. కానీ ఈరోజు ప్రభుత్వాన్ని ఎలా అడుగుతున్నాం అన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఆ ఫోటో చూపి సిగ్గుపడాలి: – నువ్వు ఒకరిని ఛాలెంజ్ చేయడం కాదు. నిన్ను నువ్వు ఛాలెంజ్ చేసుకోవాలి. – నీ పాలనలో ఏం చేశావన్నది యోచించు. ఆనాడు ఇళ్లు, ప్రాజెక్టులు కట్టనందుకు సిగ్గు పడు. – ఆ ఇళ్ల దగ్గర సెల్ఫీ కాదు చంద్రబాబూ. ప్రతి ఇంటికి వచ్చి ఆ ఇంటి ఇల్లాలు, మీ గురించి ఏ మాట్లాడుతుందో అన్నది సెల్ఫీ తీయ్. – నీకు ఏ మాత్రమైనా సిగ్గుంటే నేను కట్టలేకపోయాను.. అని ఆ ఫోటో చూపించి సిగ్గు పడాలి. – అందుకే నీ ఛాలెంజ్లు ఇక్కడేం పనికి రావు. నాదొక ఆఫర్: – నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఏ ఇంటికైనా వెళ్దాం. నీ హాయంలో ఎన్ని పథకాలు ఇచ్చావ్? మేం వచ్చాక ఎన్ని ఇచ్చామన్నది ఆ ఇల్లాలు చెబుతుంది. – నువ్వు ఉన్నప్పుడు ఎన్ని చెప్పి మోసం చేశావ్? మేం వచ్చి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాం అనేది చూపుతాం. – అసలు ఛాలెంజ్ అంటే అదే కదా? చంద్రబాబూ. అందుకే ఇకనైనా వైఖరి మార్చుకో. నెగటివ్ పబ్లిసిటీ బతుకు: – నెగిటివ్ పబ్లిసిటీ మీదే చంద్రబాబు రాజకీయ బ్రతుకంతా. అసలు ఆయనకు పాజిటివ్ ఓటు అనేది ఎక్కడుంది? – అందుకే ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారం చేసి ప్రజల్లో వ్యతిరేకత తీసుకు రావాలన్న ప్రయత్నం. – తాను బ్రహ్మాండంగా పాలించానని, ప్రజలకు ఈ మేలు చేశానని చెప్పుకోవడానికి ఒక్కటీ లేకపోవడంతో, చంద్రబాబుకు అసలు పాజిటివ్ ఓట్ అనేది లేనే లేదు. – ఎంతసేపూ మీడియా మీద ఆధారపడడం. నిత్యం ప్రభుత్వంపై బురద చల్లడం. అసత్య ప్రచారం చేయడం. ఇదే చంద్రబాబు రాజకీయం. బాబు రాజకీయం అందుకే: – కేవలం డబ్బు సంపాదనకే చంద్రబాబు రాజకీయాలు. – చంద్రబాబుకు రాబడి తగ్గింది. ఖర్చులు పెరిగాయి. అందుకే ఆయన కొడుకు యాత్ర అంటూ తిరుగుతున్నాడు. – రోజూ యాత్రకు వచ్చే కూలి జనానికి డబ్బులివ్వాలి. ఆ డబ్బు సంపాదించడం కోసమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు.