వైయస్ఆర్ జిల్లా: టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి దేవుడెరుగు..మరమ్మతులకు దిక్కులేదని కడప ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి విమర్శించారు. పులివెందులలోని రంగనాథ స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన కోనేరును కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ .. రంగనాథ స్వామి ఆలయాన్ని గత ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో పులివెందులలో చేసిన అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా చేయడం లేదన్నారు. అరటి రైతుల కోసం రూ. 25 కోట్లతో గత ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ను నిర్మించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ స్టోరేజ్ ను వినియోగం లోకి కూడా తీసుకురాలేదని ఫైర్ అయ్యారు. పులివెందుల కే తలమానికమైన మెడికల్ కాలేజీకి సీట్లు వస్తే ఈ ప్రభుత్వం వాటిని వెనక్కి పంపించిందని దుయ్యబట్టారు. జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రదాడి అత్యంత బాధాకరమని, కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. ఉగ్రదాడిలో మరణించిన కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపారు.