చిత్తూరు: ప్రజాస్వామ్యంలో ఓ సర్పంచ్ స్థాయి ప్రజా ప్రతినిధిపై దాడి జరగడం అనేది తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని, ఇటువంటి పరిస్థితుల్లో సాధారణ ప్రజలకు భద్రత ఎక్కడుందని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మండిపడ్డారు. నగిరి నియోజకవర్గంలోని విజయపురం మండలం, ఎం. అగరం గ్రామానికి చెందిన వైయస్ఆర్సీపీ సర్పంచ్ సుధాకర్పై హత్యాయత్నం జరిగింది. గ్రామ పంచాయతీ రెజల్యూషన్ ఇవ్వలేదని ఆగ్రహించిన టీడీపీ నాయకుడు లోకయ్య, ఆయన కుమారుడు, ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ కలిసి ఇంట్లోకి దూరి సర్పంచ్పై దాడికి పాల్పడ్డారు. దురదృష్టవశాత్తూ, ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికీ అసలు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజా సంక్షేమాన్ని నినాదంగా పెట్టుకుని అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు టిడిపి ప్రభుత్వం, నిందితులను రక్షించే ప్రయత్నంలో నామమాత్రపు కేసులతో తప్పించాలని చూస్తున్నారు.దాడి విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి ఆర్కే రోజా ఆసుపత్రికి వెళ్లి సర్పంచ్ను పరామర్శించారు. వెంటనే అసలు నిందితులను అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయకపోతే, మేము ప్రైవేట్ కేసు వేసి న్యాయపోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. రాజకీయ పార్టీ యూత్ సెక్రెటరీ ని ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించడం ఎంతవరకు న్యాయసమ్మతమో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని రోజా సూటిగా ప్రశ్నించారు.