తాడేపల్లి: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొని వైయస్ఆర్సీపీ(ysrcp) విజయకేతనం ఎగురవేసింది. రెడ్ బుక్(Red Book రాజ్యాంగాన్ని వైయస్ఆర్సీపీ కేడర్ ఎదురొడ్డి పోరాడింది. అక్రమ కేసులు, కిడ్నాపులు, దాడులను ఎదుర్కొని వైయస్ఆర్సీపీ గెలిచింది. రాష్ట్రంలో గురువారం జడ్పీలు, మండల పరిషత్లలో మొత్తం 53 పదవులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఏకంగా 32 పదవులను కైవసం చేసుకుంది. పార్టీ అభ్యర్థుల విజయం పట్ల వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలుపుతూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. `ఎక్స్` వేదికగా వైయస్ జగన్ ఏమన్నారంటే.. స్థానిక సంస్థల(local bodies) ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, చంద్రబాబు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైయస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను. క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందర్నీ అభినందిస్తున్నాను. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్..అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ట్వీట్ చేశారు.