తాడేపల్లి: రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టికి కూటమి సర్కార్ ప్రయత్నిస్తోందని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపారని ధ్వజమెత్తారు. ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్టు దారుణమని ఆయన ఖండించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ నేతృత్వంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే..: పార్టీలో పీఏసీ పాత్ర అత్యంత కీలకం: పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) అనేది పార్టీలో అత్యున్నతమైనది. ఇందులో తీసుకునే నిర్ణయాలు పార్టీ దిశ, దశను నిర్ణయిస్తాయి. ఈ కమిటీ ప్రతి అంశం మీద పార్టీకి దిశానిర్దేశం చేస్తుంది. వివిధ అంశాల మీద సమగ్రంగా చర్చిస్తూ, పార్టీకి సూచనలు చేస్తుంది. అంతేకాక రాబోయే రోజుల్లో పార్టీ ఏం చేయాలన్న దానిపై కూడా తగిన ఆలోచనలు చేయడంతో పాటు, సలహాలు కూడా ఇస్తుంది. ఇకపై ప్రతినెలా కూడా పీఏసీ సమావేశం అవుతుంది. యుద్ధ వాతావరణంలో పుట్టిన పార్టీ: పార్టీని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాలను నిర్మిస్తూ వస్తున్నాం. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులందర్నీ నియమించాం. వాళ్లు క్షేత్రస్థాయిలో గట్టిగా యుద్ధం చేస్తున్నారు. వైయస్సార్సీపీ యుద్ధ వాతావరణంలోనే పుట్టింది. పార్టీ పుట్టిన తర్వాత పదేళ్లపాటు మనం యుద్ధ వాతావరణంలోనే ఉన్నాం. రాబోయే రోజుల్లో పార్లమెంటు నియోజకవర్గాలకూ పరిశీలకులను నియమిస్తాం. పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లకు వారు అన్ని రకాలుగా సహాయపడతారు. ఇది పార్టీలో సమన్వయానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ నియామకాలు పూర్తైతే పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో నిర్మాణం పూరై్తనట్లు అవుతుంది. ఆరు నెలల్లో పార్టీ విస్తృత నిర్మాణం: జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులు, పీఏసీ ఏర్పాటు.. ఇలా అన్ని రకాలుగా పార్టీ నిర్మాణం అవుతోంది. అలాగే కింది స్థాయిలో జిల్లా కమిటీలు, నియోజకవర్గాల కమిటీలు, మండల స్థాయి కమిటీలు కూడా దాదాపు ఏర్పాటయ్యాయి. ఇక గ్రామస్థాయికి కూడా పార్టీ వెళ్లాలి. బూత్ లెవెల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే ఆరు నెలల్లో మొత్తం నిర్మాణం పూర్తి కావాలి. మన పార్టీ బలోపేతంగా ఉంటేనే, మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. ప్రజల తరపున మనం పోరాటాలు ఇప్పటికే మొదలుపెట్టాం. ఈ పోరాటాలు మరింత ముమ్మరం అవుతాయి. వచ్చే రెండు, మూడేళ్లలో ప్రజల తరఫున ప్రణాళికా బద్ధంగా పోరాటం చేస్తాం. చివరి ఏడాది ఎన్నికలకు పోతుంది. పార్టీ పీఏసీ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలి. ప్రజల తరఫున గొంతు విప్పాలి. అందరూ ప్రజల తరఫున మాట్లాడాలి. దీనివల్ల అన్ని అంశాలూ ప్రజల్లోకి వెళ్తాయి. రాష్ట్రంలో భయానక వాతావరణం: రాష్ట్రంలో ఒక భయాన్ని సృష్టించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి గురించి ప్రజల్లోకి రాకుండా ఈ ప్రభుత్వం తాపత్రయ పడుతోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు చేయడం పరాకాష్టకు నిదర్శనం. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీసుల అధికారుల పట్ల ప్రభుత్వం తీరును కోర్టు కూడా తప్పు బట్టింది. మొదటిసారిగా ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నాం. చరిత్రలో తొలిసారిగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి, ఇరికించడానికి సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. దీని కోసం మనుషులను భయపెడుతున్నారు. వారిని ప్రలోభపెట్టి, భయపెట్టి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయి. ఒక దుర్మార్గపు సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ఈ ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ కనిపించదు. అసలు లిక్కర్ స్కాం ఎవరిది?: లోక్సభ సభ్యుడు మిథున్రెడ్డిని టార్గెట్ చేసి, ఎలాగైనా ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. తన కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదిరించారు కాబట్టి.. చంద్రబాబునాయుడు పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష పెట్టుకున్నాడు. లేని ఆరోపణలు సృష్టించి, తప్పుడు సాక్ష్యాలు పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్పై సీఐడీ గతంలో కేసుకూడా పెట్టింది. మరి ఏది స్కాం? ప్రభుత్వం అన్యాయాలను గట్టిగా ప్రశ్నించాలి. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేదా అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచారు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? దుకాణాలకు తోడు పర్మిట్ రూములు, బెల్టుషాపులు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూములు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?. 2014–19 మధ్య చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లు కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ఇప్పుడున్న డిస్టిలరీల్లో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా?. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మనం తీసుకొచ్చిన లిక్కర్ విధానం ఒక విప్లవాత్మకం. ప్రైవేటు దుకాణాలు తీసేసి, ప్రభుత్వమే నిర్వహించింది. అమ్మకాల వేళల్ని తగ్గించింది. లిక్కర్ టాక్స్ కూడా పెంచాం. దాంతో రేట్లు పెరిగాయి. అమ్మకాలు తగ్గాయి. మరి ఎవరి హయాంలో స్కాంలు జరిగాయి? కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్: కూటమి ప్రభుత్వంతో దేన్నీ వదిలి పెట్టడం లేదు. వైయస్సార్సీపీ మీద బురదజల్లి, డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. రోమన్ రాజుల కాలంలో గ్లాడియేటర్లను పెట్టిం గ్యాలరీల్లో ప్రజలను పెట్టి, మనుషులను చంపుకునే పోటీలు పెట్టేవారు. వినోదం కింద రోజుకో దుర్మార్గమైన ఆటలు పెట్టి.. ప్రజలను అందులో మునిగేలా చేసేవారు. ఏదైనా ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్య బయటకు వచ్చిందంటే, వెంటనే చంద్రబాబునాయుడు డైవర్షన్ చేస్తున్నాడు. ఏమీ లేకపోతే జగన్ మీద ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నారు. అన్ని పథకాలకు మంగళం: ప్రజల నోటిలోకి నాలుగు వేళ్లు ఎందుకు పోవడం లేదు? మన ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దు చేశారు? సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయి? ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు? ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ప్రతి క్వార్టర్కు రూ.700 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు బకాయి పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రియింబర్స్మెంట్ కూడా కలుపుకుంటే, మొత్తం రూ.7 వేల కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చారు. దీని వల్ల ప్రజలు తమ కష్టాలను, బాధలను వదిలేస్తారని అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు అదే తరహాలో చేస్తున్నారు. భూపందారాలు. పనుల్లో యథేచ్ఛ దోపిడి: లులూ గ్రూపునకు రూ.1500–2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే స్టీల్, సిమెంటు రేట్లు పెరిగాయని.. రూ.36 వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేల కోట్లకు పెంచారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానం తీసుకొచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. బటన్లు నొక్కితే దోపిడీకి వీలు కాదని: గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా చంద్రబాబు ఎందుకు బటన్లు నొక్కలేదు అని అడిగాను. బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తుంది. అందుకనే చంద్రబాబు బటన్లు నొక్కడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కానీ దేశవ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయి. ఏ రైతుకు గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. దాదాపు 4 లక్షల పెన్షన్లు తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. అధికారంలోకి వస్తాం. ప్రజలకు సేవలందిస్తాం: రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్ బుక్ పాలనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పీఏసీ గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలతో ఎప్పటికప్పుడు మమేకం కావాలి. అన్ని జిల్లాల్లో జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని అందించాలి. పార్టీ అధికారంలోకి వస్తుంది. మరింతగా ప్రజలకు సేవలందిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పార్టీకి చెందిన ప్రతి కార్యక్రమాన్ని మనది అనుకుని చేసుకోవాలి. అందర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నారు. సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామస్థాయిలో కార్యకర్తలను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్ అనే ఒక బ్రహ్మాండమైన సాధానాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి. గతంలోనూ మనపై తప్పుడు ప్రచారాలు: కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే మనపై తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కాని ప్రజలు మనల్ని నమ్మారు. ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబునాయుడిపై వ్యతిరేకతను మూసేయడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తుంది. కాని ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబునాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు. కేసులుకు భయపడేది లేదు: చంద్రబాబు పెడుతున్న కేసులకు ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరు. 16 నెలలు పాటు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కాని ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్నికేసులు పెడితే, ప్రజలు అంతా స్పందిస్తారు. కలియుగంలో రాజకీయాలుం ఈ రీతిలోనే ఉంటున్నాయి. కానీ భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈమేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తి నింపాలి. ప్రజల తరపున పోరాటంలో రాజీ వద్దు: కష్టాల నుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చేసే పోరాటాలు, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పనితీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు. పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజల్లోకి ఉధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి. పోరాటం చేయాలి. ఎలాంటి రాజీ పడొద్దు. వక్ఫ్ చట్టం విషయంలో టీడీపీ వ్యవహార శైలిపై చర్చ: కాగా, పార్లమెంటులో బిల్లుకు ఉభయ సభల్లో మద్దతు పలికి, టీడీపీ కింది స్థాయిలో కప్పదాటు వ్యవహారంతో నడుస్తోందన్న పీఏసీ సభ్యులు. టీడీపీ చేసిన ద్రోహాన్ని మైనార్టీలు ఎండగడుతున్నారన్న సభ్యులు. వక్ఫ్ చట్టం అన్నది కేవలం ఒక మతానికో, ఒక వర్గానికో సంబంధించినది కాదని, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది కాబట్టే దీనిపై న్యాయపరంగా పోరాటం చేసేందుకు సుప్రీంకోర్టులో కేసు వేశామన్న శ్రీ వైయస్ జగన్. రాజ్యాంగ పరంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులున్నాయి. వాటికి భంగం కలిగించ రాదన్న వైయస్ జగన్. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గడంపైనా సమావేశంలో పీఏసీ సభ్యుల ఆందోళన. ధాన్యం, పెసలు, మినుములు, కందులు, శనగలు, పొగాకు, మిర్చి, అరటి, టమోటా, కోకో సహా అన్ని పంటలూ ధరలు తగ్గిపోయాయని సభ్యుల ఆందోళన. ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని, టారిఫ్ల బూచి చూపి రైతులను నిలవునా దోచుకున్నారన్న సభ్యులు. ఆక్వా రైతులకు మేలు చేయడానికి, వారికి ప్రభుత్వం అండగా ఉండేందుకు మన ప్రభుత్వం హయాంలో చట్టాలు తీసుకు వచ్చి, విద్యుత్ రాయితీలు కూడా కల్పించాం. కానీ ఈ ప్రభుత్వం ఆ చట్టాలను వాడుకోలేదు. రైతులను ఆదుకోవడానికి ముందుకు రాలేదన్న పీఏసీ సభ్యులు. ఇప్పటికే రైతులకు జరుగుతున్న నష్టంపై పలు దఫాలుగా పార్టీ స్పందించింది. దీనిపై పార్టీ పరంగా పోరాటానికి ప్రణాళికను సిద్ధం చేయడంతో పాటు, కమిటీగా ఏర్పడి కార్యాచరణ చేయాలన్న శ్రీ వైయస్ జగన్. ఇంకా.. పీఏసీ ప్రతి సమావేశంలోనూ ఎజెండాను నిర్దేశించుకుని దానిపై చర్చించాలి. పార్టీకి సూచనలు చేయాలి. పార్టీ ఐక్యంగా ఉండి, పార్టీ కార్యక్రమాలను బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఏ జిల్లాలో ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య మనది అనుకుని దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి. వెంటనే కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలి. ఎవరో ఏదో ఆదేశాలు ఇస్తారని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రజలకు అండగా ఉండడం, పార్టీని బలోపేతంచేయడం అన్నది ముఖ్యమని పీఏసీ సభ్యులకు వైయస్ జగన్ దిశా నిర్దేశం చేశారు.