బాబూ..ప్ర‌చారం ఆపి ఆక్వా రైతులకు మేలు చేయండి

 ముడిసరుకుల రేటు పడిపోయినప్పుడు ఫీడ్ ధ‌ర‌ కూడా తగ్గాలి కదా?

100 కౌంట్‌ రొయ్యలకు రూ.270ల రేటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సమావేశాలు, ఆయ‌న‌ చేస్తున్న ప్రకటనలు ప్రచారం కోసం కాకుండా ఆక్వా రైతులకు నిజంగా మేలు చేసేలా ఉండాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆక్వా రైతుల క‌ష్టాల‌పై ఇప్ప‌టికే ఆయ‌న చేసిన ట్వీట్‌కు ప్ర‌భుత్వంలో చ‌ల‌నం రాగా, సీఎం చంద్ర‌బాబు కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌తో ఆక్వారైతుల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వైయ‌స్ జ‌గ‌న్ గురువారం మ‌రోసారి త‌న ఎక్స్ ఖాతాలో ఆక్వా రైతుల ఇబ్బందులు, ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరును ఎండ‌గ‌డుతూ పోస్టు చేశారు. 

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..

1. చంద్ర‌బాబు గారూ.. ఆక్వా రైతుల కష్టాలపై మా పార్టీ నాయకుల ఆందోళన, నా ట్వీట్‌ తర్వాత ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు. కాని, మీరు పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదని ఆయా జిల్లాలకు చెందిన నాయకులు నా దృష్టికి తీసుకు వచ్చారు. మీ సమావేశాలు, మీరు చేస్తున్న ప్రకటనలు ప్రచారం కోసం కాకుండా ఆక్వా రైతులకు నిజంగా మేలు చేసేలా ఉండాలి. 

2. ఆక్వా రైతుల పెట్టుబడిలో రొయ్యలకు వేసే మేత ప్రధానమైనది. గతంలో ఈ ఫీడ్‌పై 15% సుంకం విధించినప్పుడు కంపెనీలన్నీ కిలోకు రూ.6.50లు చొప్పున పెంచారు. ఫీడ్‌ తయారు చేసే ముడిసరుకులపై ఇప్పుడు సుంకం 15% నుంచి 5%కి తగ్గింది. అలాగే సోయాబీన్‌ రేటు కిలోకు గతంలో రూ.105లు ఉంటే ఇప్పుడు రూ.25లకు పడిపోయింది. మరి ముడిసరుకుల రేట్లు ఇలా పడిపోయినప్పుడు ఫీడ్‌ రేట్లు కూడా తగ్గాలి కదా? ఎందుకు తగ్గడంలేదు? ఈ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?

3. అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలన్నీకూడా 50 కౌంట్‌ లోపువే. అమెరికాకూడా మన దేశంపై విధించిన టారిఫ్‌లను 90 రోజులపాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలు పెరగాలి కదా? ఎందుకు పెరగడంలేదు? టారిఫ్‌ సమస్యతో సంబంధం లేని యూరప్‌ దేశాలకు 100 కౌంట్ రొయ్యలు ఎగుమతి అవుతాయి. వీటి రేటుకూడా పెరగడంలేదు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.220ల రేటు కూడా రైతులకు రావడం లేదు. 100 కౌంట్‌ రొయ్యలకు రూ.270ల రేటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 

4. మా ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్ అథారిటీ కింద ఎంపెవరింగ్‌ కమిటీ ఉండేది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలిచేది. ఇలాంటి వ్యవస్థలను ఇప్పుడు అచేతనంగా మార్చేశారు.  వెంటనే దీన్ని పునరుద్ధరిస్తూ రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి.

Back to Top